Home Blog Page 10

భుక్తాపూర్ విద్యుత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మిక తనిఖీ

భుక్తాపూర్ విద్యుత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మిక తనిఖీ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ (భుక్తాపూర్): ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ లోని విద్యుత్ డివిజన్ కార్యాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను సందర్శించిన కలెక్టర్, సిబ్బంది హాజరు పట్టికలను (అటెండెన్స్ రిజిస్టర్లు) క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యుత్ సరఫరాకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసిన కలెక్టర్, జిల్లాలో విద్యుత్ పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా, ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అధికారుల పనితీరుపై ఆరా తీసిన ఆయన, రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు.

పదో తరగతి ఫలితాల్లో జైనథ్ జడ్పీహెచ్ఎస్ ప్రభంజనం

పదో తరగతి ఫలితాల్లో జైనథ్ జడ్పీహెచ్ఎస్ ప్రభంజనం

  • వంద శాతం ఉత్తీర్ణతతో విద్యార్థుల ప్రతిభ

చిత్రం న్యూస్, జైనథ్: బుధవారం విడుదలైన పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలలో జైనథ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Z.P.H.S) విద్యార్థులు రికార్డు స్థాయి విజయాన్ని అందుకున్నారు. పరీక్షలకు హాజరైన మొత్తం 90 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి, పాఠశాలకు వందశాతం ఫలితాలను అందించారు.

మండల టాపర్‌గా సాయి స్మృతి: ఈ ఫలితాల్లో సాయి స్మృతి అనే విద్యార్థిని 600 మార్కులకు గానూ 576 మార్కులు సాధించి మండలంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సాయి స్మృతి ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కాగా, పాఠశాల విద్యార్థులలో 40 మంది 500 కంటే ఎక్కువ మార్కులు సాధించడం విశేషం. విద్యార్థులందరూ మంచి స్కోర్‌తో పాస్ కావడంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు ఆనందం వ్యక్తం చేశారు

ఉపాధ్యాయుల కృషితోనే ఈ విజయం: ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్ది లస్మన్న మాట్లాడుతూ..విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల నిరంతర కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని కొనియాడారు. విద్యార్థులను, వారికి వెన్నుముకగా నిలిచిన ఉపాధ్యాయ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని ఈ ఫలితాలు నిరూపించాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కార్తికేయ సీడ్ షాప్ రెండో బ్రాంచ్ ప్రారంభం: అతిథులుగా కాంగ్రెస్ నాయకులు

కార్తికేయ సీడ్ షాప్ రెండో బ్రాంచ్ ప్రారంభం: అతిథులుగా కాంగ్రెస్ నాయకులు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  కార్తికేయ సీడ్ షాప్ రెండవ బ్రాంచ్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. షాప్ యజమాని లక్ష్మణ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు, కంది శ్రీనివాస్ రెడ్డి తరఫున కాంగ్రెస్ పార్టీ జైనథ్ మండల సోషల్ మీడియా కన్వీనర్ పుండ్రు నరేష్ రెడ్డి, రిమ్స్ కో-ఆర్డినేటర్ ఎల్మ రాంరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులను యజమాని లక్ష్మణ్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడంలో కార్తికేయ సీడ్ షాప్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు  రైతులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం!

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం!

  • బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సన్నాహక సమావేశం

చిత్రం న్యూస్, హైదరాబాద్: మే 10వ తేదీన భాగ్యనగరంలో నిర్వహించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తెలంగాణ బీజేపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సన్నాహక సమావేశం నిర్వహించారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  ఎన్.రామచందర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయడంతో పాటు, ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో పార్టీ శాసనసభ, మండలి పక్ష నేతలు మహేష్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొని సభ నిర్వహణపై చర్చించారు.

వృద్ధురాలికి అండగా నిలిచిన సనాతన హిందూ సేవా సమితి

వృద్ధురాలికి అండగా నిలిచిన సనాతన హిందూ సేవా సమితి

చిత్రం న్యూస్, వరంగల్: అభాగ్యులకు అండగా నిలవడంలో తాము ఎప్పుడూ ముందుంటామని ‘సనాతన హిందూ సేవా సమితి’ మరోసారి చాటుకుంది. సమితి ఆధ్వర్యంలో బుధవారం 181వ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ నగరంలోని కొత్తవాడకు చెందిన వృద్ధురాలు అనుమాండ్ల సుజాత గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఆమె దీనస్థితిని తెలుసుకున్న సేవా సమితి సభ్యులు స్పందించి, ఆమెకు రెండు నెలలకు సరిపడా బియ్యం,  నిత్యావసర సరుకులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రూప్ వ్యవస్థాపకులు తాళ్లపల్లి నగేష్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సలహాదారు ప్రతాపగిరి గణేష్, సభ్యులు గంగిడి ధర్మారెడ్డి, బండారి సంపత్, మరియు దిడ్డి మోహన్ తదితరులు పాల్గొని వృద్ధురాలికి సాయం అందజేశారు. తమకు అండగా నిలిచిన సేవా సమితి సభ్యులకు ఈ సందర్భంగా సుజాత కృతజ్ఞతలు తెలిపారు.

బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

 బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలం కరంజి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులు, యువతకు బాల్య వివాహాలు మరియు సైబర్ ఫ్రాడ్ (సైబర్ నేరాలు) పట్ల అవగాహన సదస్సును సర్పంచ్ శైలజ పొచ్చన్న, ఉప సర్పంచ్ ఏనుగు సూర్య ప్రకాష్ రెడ్డి, అంగన్వాడీ టీచర్ సంగీత  నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, వారి ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

అనంతరం, ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయకపోవడం, వ్యక్తిగత వివరాలను పంచుకోకూడదని విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే ‘1930’ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్శింగ్, ఆశ వర్కర్ బోజమ్మ, అంగన్వాడీ సిబ్బంది భూమక్క, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో ZREAC 2026-27 సమావేశం: రైతులకు సోయాబీన్ కరదీపిక ఆవిష్కరణ

ఆదిలాబాద్‌లో ZREAC 2026-27 సమావేశం: రైతులకు సోయాబీన్ కరదీపిక ఆవిష్కరణ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా “ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం (ZREAC) – 2026-27” సమావేశం మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షిషా పలు సూచనలు చేశారు. అనంతరం సోయాబీన్ విత్తనోత్పత్తి, చీడపీడలపై అవగాహన కరదీపికను ఆవిష్కరించారు.  కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, పరిశోధన సంచాలకులు డా.ఎం.బాల్ రాజ్, విస్తరణ సంచాలకులు డా.యాకాద్రి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా.శ్రీధర్ చౌహాన్, వివిధ జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.

పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం కలగకూడదు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం కలగకూడదు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా తీరుపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రుతో కలిసి చమురు కంపెనీల సేల్స్ అధికారులు, బంక్ డీలర్లు, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడిన కలెక్టర్.. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం చమురు కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన గూగుల్ మీట్‌లో, డిపోల నుండి బంకులకు చేరుతున్న ఇంధన సరఫరా తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలోని అన్ని బంకుల్లో తగినంత స్టాక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి నందిని, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు, డీలర్లు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు సామాజిక రుగ్మత: బెల్లూరి అంగన్‌వాడీలో అవగాహన సదస్సు

బాల్య వివాహాలు సామాజిక రుగ్మత: బెల్లూరి అంగన్‌వాడీలో అవగాహన సదస్సు

చిత్రం న్యూస్, జైనథ్: బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు జైనథ్ మండలం బెల్లూరిలోని అంగన్‌వాడీ కేంద్రంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి, అంగన్వాడీ టీచర్ భూమబాయి, ఆశ వర్కర్ వనజ,  మహిళలు, కిషోర బాలికలు పాల్గొన్నారు. ఆడపిల్లలకు 18 ఏళ్లు, మగపిల్లలకు 21 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలను ప్రోత్సహించినా లేదా జరిపించినా కఠిన శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల బాలికలు శారీరక, మానసిక సమస్యలతో పాటు టీనేజ్ ప్రెగ్నెన్సీ వంటి తీవ్ర ఆరోగ్య ఇబ్బందులకు గురవుతారని వివరించారు. బాలికలు చదువు మధ్యలో మానేయకుండా, వారిని విద్యావంతులను చేయడం ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, బాల్య వివాహాలను అరికట్టవచ్చని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, కిశోర బాలికలతో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారులకు లేదా 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. మధ్యాహ్నం 2 గంటలకు విడుదల!

రేపే తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. మధ్యాహ్నం 2 గంటలకు విడుదల!

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) ఫలితాలు ఏప్రిల్ 29న మధ్యాహ్నం 02:00 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వ సలహాదారు శ్రీ కె. కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.

ఫలితాలను ఇలా చూసుకోండి: విద్యార్థులు తమ ఫలితాలను కింద పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు:

results.bsetelangana.org

results.bse.telangana.gov.in

bse.telangana.gov.in

school.edu.telangana.gov.in

వాట్సాప్ ద్వారా ఫలితాలు:

ఇంటర్నెట్ అందుబాటులో లేని విద్యార్థులు మీసేవ (MeeSeva) వాట్సాప్ నంబర్ 8096958096 కు “Hi” అని సందేశం పంపి, తమ హాల్ టికెట్ వివరాలను సమర్పించడం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు.