అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి: అధ్యక్ష కార్యదర్శులు కొండూరు రవీందర్, వెంక గారి భూమయ్య
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ – IJU) జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ భవేష్ మిశ్రా ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో ఎంతో కష్టపడి పనిచేస్తున్న జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు (అక్రిడేషన్లు) ఇవ్వడంలో జాప్యం చేయడం తగదన్నారు. సొంత ఇల్లు లేక ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇళ్లలో నివసిస్తున్న జర్నలిస్టుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించి, వారి సొంతింటి కల సాకారం చేయాలని కోరారు.
ముఖ్యంగా విద్యా రంగంలో పెరుగుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకుని, జర్నలిస్టుల పిల్లలు చదువుకునే ప్రైవేట్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించేలా జిల్లా యంత్రాంగం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ తమ విన్నపాలను సానుకూలంగా పరిశీలించి, జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పూసల పోశెట్టి, గుమ్ముల అశోక్, జల్ద మనోజ్, కార్యదర్శులు సట్ల హనుమాన్లు, రాజేశ్వర్, డి ఎస్ మధు, వరప్రసాద్, గంగారం, కల్చర్లు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.