Home Blog Page 9

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్.సరోజన రెడ్డి 

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ సరోజన రెడ్డి 

చిత్రం న్యూస్, బాసరదళారుల నుంచి రైతులను రక్షించి వారికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని బాసర మండలం కీర్గుల్(బి)గ్రామ సర్పంచ్ తినేట్ల సరోజన రెడ్డి అన్నారు. గ్రామంలో శుక్రవారం మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (బి) గ్రామానికి చెందిన ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న పంటను సాగు చేయడం జరిగిందని చెప్పారు.రైతుల సౌకర్యం కోసం ఎమ్మెల్యే రామారావు పటేల్ తో పాటు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు సెంటర్ ను ఏర్పాటు చేయాలని తెలుపడంతో అధికారులు స్పందించారన్నారు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం :పాల్గొన్న భైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు

0

ఘనంగా శ్రీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం :పాల్గొన్న భైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు

చిత్రం న్యూస్, లోకేశ్వరం: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం నరసింనగర్ తండా గ్రామపంచాయతీలోని శ్రీ నరసింహస్వామి ఉత్సవాలు  గురువారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున ప్రజలు శ్రీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు కుటుంబ సమేతంగా స్వామివారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి పల్లకీ మోశారు. ప్రజలు అందరూ సంతోషంగా, ఆరోగ్యముగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. జాదవ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

మే 3న ‘నీట్’ పరీక్ష: ఏర్పాట్లపై కలెక్టర్ రాజర్షి షా సమీక్ష

మే 3న ‘నీట్’ పరీక్ష: ఏర్పాట్లపై కలెక్టర్ రాజర్షి షా సమీక్ష

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: వచ్చే నెల (మే 3, 2026) నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్ష నిర్వహణపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమన్వయ సమావేశంలో పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షా నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, ఇతర మౌలిక వసతులు ఉండేలా చూడాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రు, రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్ రావుతో పాటు విద్యా, వైద్య, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు  సిబ్బంది పాల్గొన్నారు.

ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఏ.జగదీశ్వర్ గౌడ్ 

ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఏ.జగదీశ్వర్ గౌడ్ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఏ. జగదీశ్వర్ గౌడ్ నియమితులయ్యారు. గతంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా అంతకుముందు జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ కమిషనర్‌గా సేవలందించిన ఆయనను, ప్రభుత్వం ఆదిలాబాద్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే జగదీశ్వర్ గౌడ్ ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఆదిలాబాద్‌లో గిరిజన యువతకు సాంకేతిక నైపుణ్యాలు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్‌లో గిరిజన యువతకు సాంకేతిక నైపుణ్యాలు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

  • చించుఘాట్‌లో రాయ్ సెంటర్ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చించుఘాట్ గ్రామ పంచాయతీ పరిధిలో గిరిజన యువతకు సాంకేతిక నైపుణ్య అభివృద్ధిని అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రాయ్ సెంటర్ (RAI Center) / గిరిజన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, శాస్త్రోక్తంగా పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. గిరిజన తండాల్లోని యువతను స్వయం ఉపాధి బాటలో నడిపించడానికి రాయ్ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. నైపుణ్య శిక్షణ ద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే 106 రాయ్ సెంటర్లు మంజూరయ్యాయని, వాటి పనులు చురుగ్గా సాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇంకా అవసరమైన 46 ప్రాంతాలను గుర్తించి, కొత్త రాయ్ సెంటర్ల మంజూరు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే అవి కూడా మంజూరవుతాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దయాకర్, సంతోష్, చించుఘాట్ గ్రామస్తులు, గిరిజన పెద్దలు, అధికారులు పాల్గొన్నారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి

0

​అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి: అధ్యక్ష కార్యదర్శులు కొండూరు రవీందర్, వెంక గారి భూమయ్య 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ – IJU) జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ భవేష్ మిశ్రా ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో ఎంతో కష్టపడి పనిచేస్తున్న జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు (అక్రిడేషన్లు) ఇవ్వడంలో జాప్యం చేయడం తగదన్నారు. సొంత ఇల్లు లేక ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇళ్లలో నివసిస్తున్న జర్నలిస్టుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించి, వారి సొంతింటి కల సాకారం చేయాలని కోరారు.

​ముఖ్యంగా విద్యా రంగంలో పెరుగుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకుని, జర్నలిస్టుల పిల్లలు చదువుకునే ప్రైవేట్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించేలా జిల్లా యంత్రాంగం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ తమ విన్నపాలను సానుకూలంగా పరిశీలించి, జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.​ ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పూసల పోశెట్టి, గుమ్ముల అశోక్, జల్ద మనోజ్, కార్యదర్శులు సట్ల హనుమాన్లు, రాజేశ్వర్, డి ఎస్ మధు, వరప్రసాద్, గంగారం, కల్చర్లు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

నానో యూరియా, డీఏపీపై రైతులకు అవగాహన సదస్సు

 నానో యూరియా, డీఏపీపై రైతులకు అవగాహన సదస్సు

చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామం లో నానో యూరియా, డీఏపీ పై గురువారం సహాయ వ్యసాయ సంచాలకులు శ్రీధర్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ..నానో ఫర్టిలైజర్స్ ఎంత మోతాదులో వాడాలి..  ఎలా వాడాలి సహకార దిగ్గజ సంస్థ లో ఒకటి “ఇఫ్కో” దేశీయంగా తయారు చేస్తున్న నానో యూరియా, నానో డీఏపీ, తదితర నానో ద్రవరూప ఎరువులు ప్రపంచంలో ఆరుదైనవన్నారు. వీటిని గత ఐదేళ్లుగా ఇఫ్కో రైతులకు విక్రయిస్తున్నారు. సంప్రదాయక గుళికల ఈ యూరియా డిఏపీ బదులుగా ద్రవ రూపంలో ఉండే నానో యూరియా, నానో డీఏపీ, నానో పోటాష్ ఎరువులు వాడినప్పుడు ఎటువంటి దిగుబడి నష్టం లేదని అధిక దిగుబడులే వస్తున్నాయని క్షేత్ర ప్రయోగాల ద్వారా నిరూపించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూపతి రెడ్డి, ఏఓ సాయితేజ రెడ్డి, ఇఫ్కో ప్రతినిధి నిఖిల్ గొర్లవర్, వ్యవసాయ విస్తరణ అధికారులు వినయ్, ఉమర్, వ్యవసాయ రైతులు గోపతి అమోల్, మహేందర్, నితిన్, సునీల్ గోహార్కర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

వానకాలం సాగుపై రైతులకు అవగాహన సదస్సు 

వానకాలం సాగుపై రైతులకు అవగాహన సదస్సు 

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో రైతులకు వానాకాలం సాగుపై వ్యవసాయ అధికారులు గురువారం అవగాహన కల్పించారు.  వానాకాలంలో సాగు సన్నద్ధత, కల్తీ విత్తనాల నివారణ, విత్తనాల కొనుగోలులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) శ్రీధర్ రైతులతో మాట్లాడుతూ, రైతులు విత్తనాలను ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన విత్తన డీలర్ దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన విత్తనాల రశీదులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలని తెలిపారు. లూజు విత్తనాలు లేదా కల్తీ విత్తనాలు, ముఖ్యంగా హెచ్‌టీ కాటన్ (HT Cotton) విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. గ్రామంలో ఎవరైనా కల్తీ విత్తనాల విక్రయానికి పాల్పడితే వెంటనే వ్యవసాయ, పోలీస్, మండల టాస్క్ ఫోర్స్ బృందానికి సమాచారం అందించాలని కోరారు. రైతులు ఒకే రకం పత్తి విత్తనాలపై ఆధారపడకుండా, వివిధ రకాల పత్తి విత్తనాలను సాగు చేయడం ద్వారా పంటలో రిస్క్‌ను తగ్గించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సాయి తేజ, వ్యవసాయ విస్తరణ అధికారులు వినయ్ కుమార్, ఉమర్, గ్రామ సర్పంచ్ భూపతి రెడ్డి, ఉప సర్పంచ్ శేఖర్, రైతులు మహేందర్ ప్రవీణ్, నితిన్, అమోల్ తదితరులు పాల్గొన్నారు.

 

సీసీఐ పునఃప్రారంభం వరకు పోరాటం ఆగదు: మాజీ మంత్రి జోగు రామన్న

సీసీఐ పునఃప్రారంభం వరకు పోరాటం ఆగదు: మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పునఃప్రారంభం అయ్యే వరకు తమ పోరాటం ఆగదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న స్పష్టం చేశారు. బుధవారం చాంద బేల్లూరిలో సీసీఐ భూనిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. సీసీఐ పరిశ్రమను తాకట్టు పెట్టడం దారుణమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. భూ నిర్వాసితులను, ఉద్యోగులను మోసం చేయడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. రైతుల భూములపై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని వీడాలని డిమాండ్ చేశారు. సీసీఐ అంశంపై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు తమ స్పష్టతనివ్వాలని కోరారు. కమీషన్ల కోసం కాకుండా, జిల్లా అభివృద్ధి కోసం పని చేయాలని, ఆదిలాబాద్ యువతను మోసం చేయడం తగదని హెచ్చరించారు. సీసీఐ పునఃప్రారంభంపై ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ధర్నాలు, నిరసనలతో ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉంటామని జోగు రామన్న ఈ సందర్భంగా వెల్లడించారు.

టీటీడీసీలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు: పాల్గొన్న కలెక్టర్ రాజర్షిషా

టీటీడీసీలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు: పాల్గొన్న కలెక్టర్ రాజర్షిషా

చిత్రం న్యూస్,ఆదిలాబాద్:  టీటీడీసీలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, కాల్స్‌పై స్పందించవద్దని కలెక్టర్ సూచించారు. అనంతరం సైబర్ నేరాలపై అవగాహన, జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ప్రిన్సిపల్, పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, యువత పాల్గొన్నారు.