బాల్య వివాహాలు సామాజిక రుగ్మత: బెల్లూరి అంగన్వాడీలో అవగాహన సదస్సు
చిత్రం న్యూస్, జైనథ్: బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు జైనథ్ మండలం బెల్లూరిలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి, అంగన్వాడీ టీచర్ భూమబాయి, ఆశ వర్కర్ వనజ, మహిళలు, కిషోర బాలికలు పాల్గొన్నారు. ఆడపిల్లలకు 18 ఏళ్లు, మగపిల్లలకు 21 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలను ప్రోత్సహించినా లేదా జరిపించినా కఠిన శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు.
చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల బాలికలు శారీరక, మానసిక సమస్యలతో పాటు టీనేజ్ ప్రెగ్నెన్సీ వంటి తీవ్ర ఆరోగ్య ఇబ్బందులకు గురవుతారని వివరించారు. బాలికలు చదువు మధ్యలో మానేయకుండా, వారిని విద్యావంతులను చేయడం ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, బాల్య వివాహాలను అరికట్టవచ్చని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, కిశోర బాలికలతో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారులకు లేదా 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్కు సమాచారం అందించాలని సూచించారు.




