Home Blog Page 8

జైనథ్‌లో భక్తిశ్రద్ధలతో ‘శ్రీరామకోటి లిఖిత మహాయజ్ఞం’ 

జైనథ్‌లో భక్తిశ్రద్ధలతో ‘శ్రీరామకోటి లిఖిత మహాయజ్ఞం’ 

చిత్రం న్యూస్, జైనథ్: ధర్మ ప్రచారంలో భాగంగా ‘శ్రీరామకోటి లిఖిత మహాయజ్ఞం’ కార్యక్రమం జైనథ్‌ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు . ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన ఏ.ఎం. ఉమాశంకర్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం  జైనథ్‌లోని చారిత్రాత్మక లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమాశంకర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ రామనామాన్ని చేరవేయడమే ఈ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి గ్రామానికి వెళ్తూ గ్రామస్తులతో చర్చిస్తూ, వారిని ఈ రామకోటి లిఖిత యజ్ఞంలో సభ్యులుగా చేరుస్తున్నట్లు వివరించారు. రామనామ జపంతో పాటు దానిని లిఖితపూర్వకంగా రాయడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి లింగారెడ్డి, దేవన్న, పిడుగు స్వామి యాదవ్, నిపుంగే దివ్య గంగమణి, గట్టు దేవకి, లక్ష్మీనారాయణ స్వామి సేవకులు, గ్రామ సభ్యులు, భక్తులు పాల్గొని రామ కార్యంలో తాము కూడా భాగస్వాములమవుతామని ఉత్సాహంగా ముందుకు వచ్చారు.

ఘనంగా మే డే వేడుకలు: పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా

 ఘనంగా మే డే వేడుకలు: పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని మేస్త్రి సంఘ భవనంలో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ (మే డే) వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. శ్రమ శక్తికి గౌరవం దక్కాలన్నదే మే డే ఉద్దేశమని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రతి కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్మికులకు వివిధ అంశాల్లో శిక్షణ అందిస్తున్న పలువురు సిబ్బంది సేవలను గుర్తించిన కలెక్టర్, ఎమ్మెల్యే, వారికి ప్రశంసా పత్రాలను, మెమెంటోలను అందజేసి అభినందించారు. ఈ వేడుకల్లో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, ఉట్నూర్ ఐటీఐ ఏటీఓ ఆర్.శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేశ్వరి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందన్ కుమార్ పాల్గొన్నారు. మేస్త్రీ సంఘం నాయకులు బండారి పోశన్న, సామల సత్యనారాయణ, రమేష్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

నిర్మల్ కలెక్టర్‌ భవేష్ మిశ్రాను కలిసిన ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 

 నిర్మల్ కలెక్టర్‌ భవేష్ మిశ్రాను కలిసిన ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ కలెక్టర్‌ భవేష్ మిశ్రాను ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించి పూలమొక్క అందజేశారు. ముథోల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. రైతులు పండించిన పంటలను విక్రయించుకునేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, సబ్ సెంటర్లలో గన్నీ బ్యాగులు, లారీల (రవాణా సౌకర్యాల) లోపం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్య సమస్యలను ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, వాటిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ భవేష్ మిశ్రా, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

శిశు గృహలో అదనపు భవనాన్ని పర్యవేక్షించిన కలెక్టర్ రాజర్షి షా.. చిన్నారులకు క్రీడా వస్తువుల పంపిణీ

శిశు గృహలో అదనపు భవనాన్ని పర్యవేక్షించిన కలెక్టర్ రాజర్షి షా.. చిన్నారులకు క్రీడా వస్తువుల పంపిణీ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని శిశు గృహలో నూతనంగా ప్రారంభించిన అదనపు భవనాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా భవనంలోని వసతులను పరిశీలించడమే కాకుండా, చిన్నారుల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీశారు.అనంతరం శిశు గృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని, వారికి అందుతున్న వ్యక్తిగత సంరక్షణ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా బాలలకు క్రీడా వస్తువులను పంపిణీ చేశారు. చిన్నారులకు నిరంతరం సేవలందిస్తున్న సిబ్బందిని అభినందిస్తూ వారిని శాలువాతో సత్కరించి, నూతన వస్త్రాలను, మెమెంటోలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్, బాలల సంరక్షణ అధికారి స్వామి, లీగల్ కం ప్రొబేషన్ ఆఫీసర్ కుట్ల రమేష్, మేనేజర్ విజయలక్ష్మి, సోషల్ వర్కర్ స్వప్న, ఏఎన్ఎం, ఆయాలు, డీసీపీయూ సిబ్బంది పాల్గొన్నారు.

అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన కౌన్సిలర్ రజిత రాము 

అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన కౌన్సిలర్ రజిత రాము 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్:  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ అనాథ శవానికి ఏడో వార్డ్ కౌన్సిలర్ రజిత రాము శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. సొంతవారే పట్టించుకోని ఈ కాలంలో దిక్కు మొక్కు లేనివారు మృతి చెందితే ఆపదలో మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు.

గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో  కే ఆర్కే కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి వడ దెబ్బతో కిందపడి ఉండగా వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ సిబ్బందికి ఫోన్ చేసి రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు చికిత్స పొందుతూ చనిపోయారని డాక్టర్లు వెల్లడించారు. అనాధ శవానికి అంతక్రియలు నిర్వహించడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో   కౌన్సిలర్ రజిత రాము ముందుకొచ్చారు.

శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆదిలాబాద్ మావల పోలీస్ స్టేషన్ కి కౌన్సిలర్  సమాచారం అందించారు. మధ్యాహ్నం 3 గంటలకు కేఆర్కే స్మశాన వాటికలో అనాధ శవానికి అంతక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ గ్రూప్ అధ్యక్షులు లింగంపెల్లి శశికాంత్, విద్యుత్ ఏఈ జి.జనార్దన్ రెడ్డి, కళ్లెం హరీష్ రెడ్డి, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అలీం పాషా, బోధకుంట రాజు తదితరులు పాల్గొన్నారు.

జైనథ్ లో ఘనంగా బాజీరావ్ బాబా సప్తాహ వేడుకలు 

జైనథ్ లో ఘనంగా బాజీరావ్ బాబా సప్తాహ వేడుకలు 

* మాజీ మంత్రి జోగు రామన్న విరాళం

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న భాజీరావ్ బాబా మహారాజ్ సప్తాహ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగు రామన్న తన ఉదారతను చాటుకున్నారు. బాబా సప్తాహ ఉత్సవాల నిర్వహణ కోసం జోగు రామన్న తరపున ఆయన ప్రతినిధులు  బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం రూ. 11,116 నగదును విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు జోగు రామన్న ఎల్లప్పుడూ అండగా ఉంటారని, భక్తుల సౌకర్యార్థం ఈ చిన్న సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నేత,జైనథ్ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయ మాజీ చైర్మన్ వెంకట్ రెడ్డి, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ యాదవ్, మాదస్తు వెంకన్న నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విరాళం అందించిన జోగు రామన్నకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఉపాధి హామీ పనులు లేక బిక్కుబిక్కుమంటున్న ప్రజలు  

ఉపాధి హామీ పనులు లేక బిక్కుబిక్కుమంటున్న ప్రజలు 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని కనిపించడం లేదని పనులు లేక నెల రోజులుగా  పస్తులు ఉంటున్నామని బాసరలోని ఉప్పుకుంటా కాలనీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల పనిని పొందే హక్కు ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు పని కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ వాజిద్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని కూలీలు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సుమారు 30 మందికి పైగా ఉన్న ఉపాధి జాబ్‌ కార్డుదారులందరికి వంద రోజుల ఉపాధి హామీపని కల్పించాలని కోరుతున్నారు.

రాంపూర్ (టి)లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ: పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా

రాంపూర్ (టి)లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ: పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, భోరజ్: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భోరజ్ మండలం రాంపూర్ (టి) గ్రామంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథులుగా హాజరై, లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందాలనే లక్ష్యంతో ఈ పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. సొంత ఇంటి కల నెరవేరడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, హౌసింగ్ నోడల్ అధికారి శంకర్, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, తహసీల్దార్ రాజేశ్వరి, సర్పంచ్ వెంకటమ్మతో పాటు లబ్ధిదారులు, గ్రామస్తులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సిర్సన్న లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

సిర్సన్న లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామంలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంశుక్రవారం నిర్వహించారు. తెలంగాణలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు, శాస్త్రీయ పద్ధతులను రైతులకు నేరుగా అందించేందుకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం 27 ఏప్రిల్ నుంచి మే 23 వరకు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వ్యవసాయ, ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు గ్రామాల్లో పర్యటించి, నేల ఆరోగ్యం, అధిక దిగుబడి వంగడాలు, సేంద్రియ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.

ఈ సందర్బంగా బేల మండలం సిర్సన్న గ్రామంలోని రైతువేదికలో జిల్లా వ్యవసాయ పరిశోదన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ రాజశేఖర్, రాజేందర్ రెడ్డి హాజరై రైతులకు సమగ్ర సస్యరక్షణ,తక్కువ ఖర్చు తో అధిక దిగుబడి మరియు మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పంటల సాగు గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. రైతులు అధిక యూరియా వాడకం తగ్గించాలని కోరారు.ప్రతి సంవత్సరం పంట మార్పిడి తప్పకుండ చేయాలనీ, రసాయన ఎరువుల నియంత్రణను చేపట్టాలని సూచించారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలను వాడకంతో పాటు సేంద్రియ సాగులను చేపట్టాలని కోరారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్.సరోజన రెడ్డి 

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ సరోజన రెడ్డి 

చిత్రం న్యూస్, బాసరదళారుల నుంచి రైతులను రక్షించి వారికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని బాసర మండలం కీర్గుల్(బి)గ్రామ సర్పంచ్ తినేట్ల సరోజన రెడ్డి అన్నారు. గ్రామంలో శుక్రవారం మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (బి) గ్రామానికి చెందిన ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న పంటను సాగు చేయడం జరిగిందని చెప్పారు.రైతుల సౌకర్యం కోసం ఎమ్మెల్యే రామారావు పటేల్ తో పాటు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు సెంటర్ ను ఏర్పాటు చేయాలని తెలుపడంతో అధికారులు స్పందించారన్నారు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.