సీసీఐ పునఃప్రారంభం వరకు పోరాటం ఆగదు: మాజీ మంత్రి జోగు రామన్న
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పునఃప్రారంభం అయ్యే వరకు తమ పోరాటం ఆగదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న స్పష్టం చేశారు. బుధవారం చాంద బేల్లూరిలో సీసీఐ భూనిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. సీసీఐ పరిశ్రమను తాకట్టు పెట్టడం దారుణమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. భూ నిర్వాసితులను, ఉద్యోగులను మోసం చేయడం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. రైతుల భూములపై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని వీడాలని డిమాండ్ చేశారు. సీసీఐ అంశంపై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు తమ స్పష్టతనివ్వాలని కోరారు. కమీషన్ల కోసం కాకుండా, జిల్లా అభివృద్ధి కోసం పని చేయాలని, ఆదిలాబాద్ యువతను మోసం చేయడం తగదని హెచ్చరించారు. సీసీఐ పునఃప్రారంభంపై ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ధర్నాలు, నిరసనలతో ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉంటామని జోగు రామన్న ఈ సందర్భంగా వెల్లడించారు.

