Home Blog Page 23

శివాజీ మహారాజ్ విగ్రహం కోసం రూ.5 వేలు అందజేసిన ఇట్టడి సుశాంత్ రెడ్డి

శివాజీ మహారాజ్ విగ్రహం కోసం రూ.5 వేలు అందజేసిన ఇట్టడి సుశాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: మండలంలోని కొబ్బయి గ్రామంలో ప్రతిష్టాపించనున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కోసం జై హనుమాన్ పర్టిలైజర్స్ బేల యజమాని ఇట్టడి సుశాంత్ రెడ్డి తమ వంతు సహాయంగా రూ.5 వేలు గ్రామ పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహావీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేయడం ఎంతో సంతోషకరమని, శివాజీ మహారాజ్ ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయుడని పేర్కొన్నారు. బేల మండలంలోని ఏ గ్రామంలో ఐన శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు ముందుకొస్తే తమ వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.

బాల్య వివాహం ఎవరు ప్రోత్సహించవద్దు: జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ 

బాల్య వివాహం ఎవరు ప్రోత్సహించవద్దు: జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: బాల్య వివాహం ఎవరు ప్రోత్సహించవద్దని అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, జరగకుండా ఉండడానికి అందరూ ప్రయత్నం చేయాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ అక్షయ తృతీయలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ష్యూర్ ఎన్జీవో, జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో శనివారం బాల్ రక్షక్ భవన్ లో పూజారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ష్యూర్ ఎన్జీవో ముద్రించిన బాల్య వివాహాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీపీవో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… మంచి ముహూర్తాలు ఉన్నాయని వయసు చూడకుండానే పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బాల్యవివాహాలు నిర్వహించొద్దని పూజారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అర్చకులు చెప్తే ప్రతి ఒక్కరూ వింటారని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వయసు నిర్ధారణ చూసుకున్న తర్వాతే పెళ్లిళ్లు చేయాలన్నారు. ఆధార్ కార్డు, వయసు, ప్రామాణికం కాదని విద్య ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలన్నారు. తక్కువ వయసులో పెళ్లిళ్లు చేస్తే ఆరోగ్య సమస్యలతో పాటు, మానసిక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ సందర్భంగా ధూప దీప నైవేద్య సంఘం జిల్లా అధ్యక్షుడు కలవరపు లింగయ్య మాట్లాడుతూ.. బాల్ వివాహ ముక్త్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలు నిరోధించడానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ సిపివో (చైల్డ్ మ్యారేజ్ నోడల్ ఆఫీసర్) రమేష్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్, పివోఐసి ఎన్. స్వామి, ష్యూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ వినోద్ కుమార్, అర్చక సంఘం ప్రచార కార్యదర్శి గజానంద్, కోశాధికారి నాగభూషణ్, చైల్డ్ హెల్ప్ లైన్, డిసిపియు, ష్యూర్ ఎన్జీవో సిబ్బంది తదితరులున్నారు.

బోధన్ లోని రైస్ మిల్లుపై దాడి: పీడీఎస్ బియ్యం పట్టివేత 

బోధన్ లోని రైస్ మిల్లుపై దాడి: పీడీఎస్ బియ్యం పట్టివేత 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: బోధన్ పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లో ఉన్న సాయి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుపై సీసీఎస్ టీం, స్థానిక బోధన్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి ఉంచుతునారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రైడ్ చేపట్టారు. రెండు ఆటోలు, ఒక లారీ నుండి పీడీఎస్ ధాన్యం అక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 144. 2 క్వింటాళ్ల ధాన్యాన్ని స్వాధీనం చేసుకొని వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.సివిల్ సప్లై డీటీ హనుమాన్ పంచనామ నిర్వహించారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ సీఐ వెంకటనారాయణ హెచ్చరించారు.

కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేతలు 

కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నేతలు 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ కు భవిష్యత్తులో మహిళలే తగిన గుణపాఠం చెబుతారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిఖిల్ సాయి చౌరస్తా వద్ద కాంగ్రెస్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ..మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ ನಿಜ స్వరూపం బయటపడిందన్నారు. 2023 లో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు పలికినట్టే పలికి ఇప్పుడు వ్యతిరేకించడం సమంజసం కాదన్నారు. డీఎంకే, సమాజ్ వాదీ పార్టీలు కూడా మహిళల పట్ల వారికున్న నైతికత బయటపడిందన్నారు. మహిళా శక్తి అంటూ చెప్పే కాంగ్రెస్ అవకాశం ఇవ్వాల్సిన సమయంలో వెనక్కి తగ్గిపోవడం సిగ్గుచేటన్నారు. మోడీ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి వ్యతిరేక పనులలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని భవిష్యత్తులో వారికి తగిన గుణపాఠం తప్పదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఉద్దేశంతో బీజేపీ ముందడుగు వేసింది అన్నారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్ చేయని మహిళా బిల్లు ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అడ్డుకోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్ కర్ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు బొబ్బిలి సువర్ణ వేణు, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ యాదవ్, మల్కాయి మహేందర్, జ్యోతి మురళి మహిళా నాయకురాలు వనిత తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ స్పాట్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ స్పాట్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఫ్లోరోసెంట్ పెయింటింగ్, రేడియం స్టిక్కర్ లతో నిజామా బాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్, నిజామా బాద్,ఆర్మూర్ డివిజన్ పరిధిలోగల 55 బ్లాక్ స్పాట్లను పోలీసులు సమగ్రంగా గుర్తించి పర్యవేక్షించారు.ఎస్ఐలు,సీఐలు, ఏసీపీలు,అదనపు డీసీపీ(అడ్మిన్)తో పాటు పోలీస్ కమిషనర్ స్వయంగా ఆయా ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎడపల్లి మండలం జాన్కంపేట్, అశోక్ సాగర్ దర్గా వద్ద నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,శనివారం పర్యవే క్షించారు. ఈ సందర్భంగా ప్రమాదాలకు ప్రధాన కారణా లైన అధిక వేగం, రోడ్డు వంపులు,స్పష్టమైన సూచిక బోర్డుల లేమి, రాత్రివేళలలో తగిన లైటింగ్ లేకపోవడం వంటి అంశాలను గుర్తించడం జరిగింది.వీటిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులకు సిపి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ స్పాట్లలో తక్షణ చర్యలు గా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం,ఫ్లోరోసెంట్ పెయింటింగ్ మరియు రేడియం స్టిక్కర్ తో కూడినటు వంటి పోలీస్ కటౌట్ లను ఏర్పాటు, స్పీడ్ బ్రేకర్లు నిర్మించడం,రోడ్డు మార్కింగ్లు స్పష్టంగా వేయడం, స్ట్రీట్ లైటింగ్ మెరుగుపరచడం వంటి పనులు చేప ట్టాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ పోలీసుల పర్య వేక్షణను పెంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అదనం గా, డ్రైవర్లలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని,హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ తప్పనిసరి పాటించడం వంటి అంశాలపై కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి, ప్రమాదాల నివారణలో పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా సమగ్ర చర్యలు కొనసాగుతున్నాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేయాలి

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేయాలి

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు గౌడ్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: యూనివర్సిటీ సమస్యల పైన తన గళం వినిపించాలని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు గౌడ్ అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం నూతన పాలక మండలి సభ్యునిగా నియామకమైన చెరుకూరి రజనీకాంత్ ను ఆయన శనివారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రాబోయే కాలంలో తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధి కొరకై పాలకమండలి సమావేశాల్లో చర్చించి, యూనివర్సిటీ అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని, యూనివర్సిటీలో గతంలో వచ్చిన ఆరోపణలపై తన గళం వినిపించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం యూనివర్సిటీ పాలక మండలి సభ్యునిగా రజనీకాంత్ నియమకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి

సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను సంబంధిత అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ లు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించే సంక్షేమ వారోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. వారం రోజుల పాటు నిర్వహించే ఆయా కార్యక్రమాలను నిర్దేశించిన ప్రణాళికకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. వసతి గృహాల విద్యార్థులకు క్విజ్, ఉపన్యాసం, చిత్రలేఖనం, తదితర పోటీలు నిర్వహించి బహుమతులను అందజేయాలన్నారు. ఆయా వసతి గృహాల్లో చిన్న చిన్న మరమ్మతులు అవసరం ఉంటే అలాంటి పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలపై, నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కలిగించడమే కాక వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించారు.

వీసీ అనంతరం అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ లు అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సంక్షేమ శాఖల అధికారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు వారోత్సవాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. ఆయా వసతి గృహాల్లో ఉండే సమస్యలపై ఫోటోలు తీసి, పరిష్కరించాక కూడా ఫోటోలు తీసుకొని బిఫోర్, ఆఫ్టర్ ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల బ్యానర్లను తప్పకుండా ప్రదర్శిస్తూ షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్స్ నిర్వహించాలన్నారు. పేరెంట్స్ మీటింగ్ ల సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, సీపీఓ రతన్, సంక్షేమ శాఖల జిల్లా అధికారులు కృష్ణవేణి, నర్సయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, హౌసింగ్ అధికారి నివర్తి తదితరులు పాల్గొన్నారు.

యువతను సన్మార్గంలో నడిపేందుకే ప్రీమియర్ లీగ్ పోటీలు

యువతను సన్మార్గంలో నడిపేందుకే ప్రీమియర్ లీగ్ పోటీలు

పోలీస్ కమిషనరేట్, సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ర్యాలీ

ర్యాలీని ప్రారంభించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  యువతను సన్మార్గంలో నడిపేందుకే ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. యువత చెడు మార్గంలో కాకుండా తమ ఉజ్వల భవిష్యత్తు కోసం సక్రమ మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ ర్యాలీ శనివారం ఉదయం జిల్లా క్రీడా అథారిటీ మైదానం నుండి పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు నిర్వహించారు. ఈ లీగ్ ర్యాలీని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తుండడం ఎంతో గర్వకారణమని, నిజామాబాద్ జిల్లా నుండి ఎంతోమంది క్రీడాకారులను దేశానికి అందించినటువంటి ఘనత జిల్లాకు ఉండడం ఎంతో సంతోషకరమైన విషయం అని, ఈ ప్రీమియర్ లీగ్ లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్, యోగా మొదలగు క్రీడలు నిర్వహిస్తున్నారని సాయి చైతన్య అన్నారు. ఇందులో అన్ని మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారని వెల్లడించారు. ఈ క్రీడలలో గెలుపొందిన వారికి ప్రైజ్ మనీ కూడా డిక్లేర్ చేయడం జరిగిందని అన్నారు. యువతను సన్మార్గంలో నడిపించాలని ఉద్దేశంతో యువతను ప్రోత్సహించే విధముగా ఈ యొక్క సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నరని, కోవిడ్ సమయంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది చనిపోయారని రోడ్డు ప్రమాదాల వలన నిజామాబాద్ జిల్లాలో 2025 సంవత్సరంలో 300 మంది మరణించారని వివరించారు.ప్రధానముగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వలన ఈ యొక్క ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గమనించాలని సీపీ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారు క్షేమంగా తమ గమ్యానికి చేరుకుంటున్నారని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు. ,

యువత డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరితో సే నో టు డ్రగ్స్, సే ఎస్ టూ స్పోర్ట్స్ అనే నినాదం చేయించడం జరిగింది. యువత మీదనే దేశ భవిష్యత్తు ఆధారాలు ఉంటుందని యువత సన్మార్గంలో నడిచినప్పుడే అది సాధ్యమవుతుందని అందుకే ఈ యొక్క సమ్మర్ క్యాంపు ద్వారా ఈ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు.. అనంతరం కాగడాతో క్రీడా ర్యాలీని ప్రారంభించి, క్రీడా ర్యాలీ పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి కోర్టు చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ కార్యాలయం, విజయ్ థియేటర్, రైల్వే కమాన్, అయ్యప్ప దేవాలయం, మీ-సేవ, పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీసీపీ బస్వా రెడ్డి, జనరల్ సెక్రెటరీ కవిత రెడ్డి, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్, ట్రెజరర్ సంతోష్ వివిధ విభాగాల్లో జాయింట్ సెక్రటరీలు శిరీష్, పితాని, శివప్రసాద్, గణేష్ గుప్తా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, నిజామాబాద్ యువత, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొని దిగ్విజయం చేశారు.

జైనథ్ బస్ స్టాండ్ ఆవరణలో చలివేంద్రం ప్రారంభం

జైనథ్ బస్ స్టాండ్ ఆవరణలో చలివేంద్రం ప్రారంభం

చిత్రం న్యూస్, జైనథ్: పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులు, బాటసారుల దాహార్తిని తీర్చడానికి జైనథ్ గ్రామ పంచాయతీ ప్రత్యేక చొరవ తీసుకుంది. స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు.

వేసవి తాపం నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడమే ధ్యేయంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పంచాయతీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు, కూలీలకు, రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. వేసవిలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ముజీబ్, ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగదీశ్ రెడ్డి, బీజేపీ గ్రామ అధ్యక్షుడు చిలుకూరి లింగారెడ్డి,వార్డు సభ్యులు కోవ సారథి, స్వామి, గంగన్న, పరశురాం, గ్రామ పెద్దలు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై బేల కాంగ్రెస్ నేతల ఫైర్

బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై బేల కాంగ్రెస్ నేతల ఫైర్

చిత్రం న్యూస్, బేల : పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆంధ్రప్రదేశ్-తెలంగాణ విభజనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బేల మండల కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..స్థానిక శివాజీ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఈ వ్యాఖ్యలు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, వందలాదిమంది విద్యార్థుల ఆత్మబలి దానాలకు చలించి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు  సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలతో త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చిన ఎంపీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.తేజస్వి సూర్య బేషరతుగా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ  జడ్పీటీసీ రాందాస్ నాక్లే, మార్కెట్ వైస్ చైర్మన్ విలాస్ పటేల్, కిసాన్ సెల్ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఘన్ శ్యామ్ గవాండే, చంద్రకాంత్ మడావి, ఆత్మ డైరెక్టర్,ఈశ్వర్ ధోటే, సర్పంచులు గంబీర్ థాక్రే, శంకర్ భోక్రె, గులాబ్ గేడాం, అవినాష్ గోడే, బాపురావు దడంజె, సాగర్ థాక్రె నాయకులు సుదర్శన్,  కన్నె రాజు, గోపతి శంకర్, యువ నాయకులు హేమంత్ పటేల్, రవి గట్లేవార్, మహబూబ్ ఖాన్, మొబిన్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.