సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను సంబంధిత అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ లు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించే సంక్షేమ వారోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. వారం రోజుల పాటు నిర్వహించే ఆయా కార్యక్రమాలను నిర్దేశించిన ప్రణాళికకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. వసతి గృహాల విద్యార్థులకు క్విజ్, ఉపన్యాసం, చిత్రలేఖనం, తదితర పోటీలు నిర్వహించి బహుమతులను అందజేయాలన్నారు. ఆయా వసతి గృహాల్లో చిన్న చిన్న మరమ్మతులు అవసరం ఉంటే అలాంటి పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలపై, నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కలిగించడమే కాక వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించారు.
వీసీ అనంతరం అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ లు అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సంక్షేమ శాఖల అధికారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు వారోత్సవాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. ఆయా వసతి గృహాల్లో ఉండే సమస్యలపై ఫోటోలు తీసి, పరిష్కరించాక కూడా ఫోటోలు తీసుకొని బిఫోర్, ఆఫ్టర్ ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల బ్యానర్లను తప్పకుండా ప్రదర్శిస్తూ షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్స్ నిర్వహించాలన్నారు. పేరెంట్స్ మీటింగ్ ల సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, సీపీఓ రతన్, సంక్షేమ శాఖల జిల్లా అధికారులు కృష్ణవేణి, నర్సయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, హౌసింగ్ అధికారి నివర్తి తదితరులు పాల్గొన్నారు.

