బాల్య వివాహం ఎవరు ప్రోత్సహించవద్దు: జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: బాల్య వివాహం ఎవరు ప్రోత్సహించవద్దని అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, జరగకుండా ఉండడానికి అందరూ ప్రయత్నం చేయాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ అక్షయ తృతీయలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ష్యూర్ ఎన్జీవో, జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో శనివారం బాల్ రక్షక్ భవన్ లో పూజారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ష్యూర్ ఎన్జీవో ముద్రించిన బాల్య వివాహాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీపీవో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… మంచి ముహూర్తాలు ఉన్నాయని వయసు చూడకుండానే పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బాల్యవివాహాలు నిర్వహించొద్దని పూజారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అర్చకులు చెప్తే ప్రతి ఒక్కరూ వింటారని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వయసు నిర్ధారణ చూసుకున్న తర్వాతే పెళ్లిళ్లు చేయాలన్నారు. ఆధార్ కార్డు, వయసు, ప్రామాణికం కాదని విద్య ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలన్నారు. తక్కువ వయసులో పెళ్లిళ్లు చేస్తే ఆరోగ్య సమస్యలతో పాటు, మానసిక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ సందర్భంగా ధూప దీప నైవేద్య సంఘం జిల్లా అధ్యక్షుడు కలవరపు లింగయ్య మాట్లాడుతూ.. బాల్ వివాహ ముక్త్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలు నిరోధించడానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ సిపివో (చైల్డ్ మ్యారేజ్ నోడల్ ఆఫీసర్) రమేష్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్, పివోఐసి ఎన్. స్వామి, ష్యూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ వినోద్ కుమార్, అర్చక సంఘం ప్రచార కార్యదర్శి గజానంద్, కోశాధికారి నాగభూషణ్, చైల్డ్ హెల్ప్ లైన్, డిసిపియు, ష్యూర్ ఎన్జీవో సిబ్బంది తదితరులున్నారు.




