ఆదిలాబాద్ జొన్న రైతులకు ఊరట: రేపటి నుంచే కొనుగోళ్లు ప్రారంభం- ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని జొన్న రైతుల ఎదురుచూపులకు తెరపడింది. రైతులు తాము పండించేస్తున్నారుచిన పంటను విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రైతులకు ఈ శుభవార్త వినిపించారు. జొన్నల కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుందని ఎమ్మెల్యే తెలిపారు. మే 3వ తేదీ నుంచి జైనథ్ మండల కేంద్రంలో కొనుగోళ్లు మొదలవుతాయి. మే 4వ తేదీ నుంచి ఆదిలాబాద్ మరియు బేల మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి అన్నారు. గత కొన్ని రోజులుగా జొన్న పంట కొనుగోలు విషయంపై తాము ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించాయని, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం కొనుగోళ్లకు అనుమతి ఇచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నీడ వంటి అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు పాయల్ శంకర్ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని జొన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
