Home Blog Page 6

అవల్పూర్ గ్రామంలో భూసార పరీక్ష గురించి అవగాహన సదస్సు

అవల్పూర్ గ్రామంలో భూసార పరీక్ష గురించి అవగాహన సదస్సు

చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం అవాల్పూర్ గ్రామంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక భాగంలో సోమవారం రైతులకు భూసార పరీక్ష (మట్టిపరీక్ష ) గురించి ఇఫ్కో ప్రతినిధి ఆదిలాబాద్ మార్కెటింగ్ నిఖిల్ గొర్లవార్  రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మట్టి నమూనా ఎలా తీయాలి.. ఫీల్డ్,డిమాన్స్ట్రేషన్ చేయడం ఎలా అనే దాని పై వివరించారు. భూసార పరీక్ష (మట్టి పరీక్ష) ద్వారా నేలలోని పోషకాల స్థాయిని తెలుసుకుని, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని తెలిపారు. మట్టి నమూనాలు తీసుకొని 15 రోజుల తర్వాత మా ఇఫ్కో కంపెనీ తరపున రైతులకు భూసార పరీక్ష రిపోర్ట్ ఇవ్వనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దినేష్, మాజీ ఎంపీటీసీ నగేష్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజు, రమణ, రైతులు రాకేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు 

ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు 

చిత్రం న్యూస్, బేల:  ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో రైతు వేదికలో నేల ఆరోగ్యం, పరిరక్షణ, మట్టి నమూనాల సేకరణ, మట్టి పరీక్ష , వివిధ పంటలలో సరైన మోతాదులో ఎరువుల వాడకం వంటి అంశాలపై వ్యవసాయ విస్తరణ అధికారి వినయ్ కుమార్ సోమవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతుల నుంచి మట్టి నమూనాలు  సేకరించారు. ల్యాబులో పరీక్షించిన మట్టినమునాల ఫలితాలను సూచించే సాయిల్ హెల్త్ కార్డులను రైతులకు అందించారు. కార్యక్రమంలో సాంగిడి సర్పంచ్ భూపతిరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ బాలచందర్, రైతులు మహేందర్, నితిన్, ఆకాష్, ఆశన్న, శ్రీనివాస్, సాయి , రణధీర్ తదితరులు పాల్గొన్నారు

ఆదిలాబాద్ లో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, మార్కెట్ ఛైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి 

ఆదిలాబాద్ లో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, మార్కెట్ ఛైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డితో కలిసి జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రైతును సన్మానించి మిఠాయి తినిపించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం రైతులందరి నుండి జొన్న పంటను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే షెడ్యూల్ కూడా వస్తుందని చెప్పారు. రైతులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ఏవైనా సమస్యలుంటే రైతులు తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

పీఎంజీ జ్యువెలరీలో దోపిడీ: నిందితుల ఆచూకీ తెలిపితే రూ.లక్ష రివార్డ్!

పీఎంజీ జ్యువెలరీలో దోపిడీ: నిందితుల ఆచూకీ తెలిపితే రూ.లక్ష రివార్డ్!

చిత్రం న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్‌లో గల పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్‌లో ఆదివారం పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ఐదుగురు దుండగులు తుపాకులతో సిబ్బందిని బెదిరించి, సుమారు ఒక కిలో బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన సిబ్బందిపై దుండగులు కాల్పులు జరపగా, నలుగురు గాయపడ్డారు.  ఈ కేసును సవాలుగా తీసుకున్న కరీంనగర్ పోలీసులు నిందితుల సీసీ టీవీ (CCTV) దృశ్యాలను విశ్లేషించి, ఐదుగురు అనుమానితుల ఫోటోలను విడుదల చేశారు. ఈ నిందితుల గురించి ఎటువంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి లేదా వారు పట్టుబడటానికి సహకరించే సమాచారం అందించిన వారికి రూ.లక్ష నగదు బహుమతిని పోలీసులు ప్రకటించారు. పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివరాలు తెలిస్తే ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.  8712670762,  8712670711, 8712670713 లేదా అత్యవసర సహాయం కోసం 100 నంబర్‌కు డయల్ చేయాలన్నారు.

 

సాంగిడి గ్రామంలో ఘనంగా బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలు 

సాంగిడి గ్రామంలో ఘనంగా బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలు 

చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో ఆదివారం బాజీరావు బాబా భక్తులు నిర్వహించే ఏడు రోజుల (సప్తాహ) ఆధ్యాత్మిక ఉత్సవం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాజీరావు బాబా పల్లకిని ఊరేగింపు నిర్వహించారు. బాబా శిష్యులు ప్రవచనాలు,  బోధనలు, జీవిత విశేషాలను వివరించారు. చిన్నారులను ఎడ్ల బండి పై  దేవతల వస్త్రధారణతో కూర్చోబెట్టారు. భక్తులు పల్లకికీ పూజలు నిర్వహించారు. అనంతరం కాలదహీ హండీ నిర్వహించారు. హరిపాట్ గావించారు. గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని కోలాటమాడుతూ నృత్యాలు చేశారు.  మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాజీరావు బాబా శిష్యులు, గ్రామ మహిళలు, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాదం: గుర్తుతెలియని వ్యక్తి మృతి

0

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాదం: గుర్తుతెలియని వ్యక్తి మృతి

చిత్రం న్యూస్, సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక వ్యక్తి రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం ప్రకారం, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు ప్లాట్‌ఫామ్‌పైకి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు (GRP) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వివరాలు పోలీసుల ప్రాథమిక విచారణలో మృతుడు సుమారు 5.6 అడుగుల ఎత్తు, ఆకుపచ్చ రంగు చెక్స్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. మృతుడి కుడి చేతిపై ‘పల్లవి’ అనే పేరుతో టాటూ ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జొన్నలు, సెనగల కొనుగోళ్లలో రైతులను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే పై జోగు రామన్న ధ్వజం

జొన్నలు, సెనగల కొనుగోళ్లలో రైతులను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే పై జోగు రామన్న ధ్వజం

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జొన్నలు మరియు సెనగల కొనుగోళ్ల విషయంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న తీవ్రంగా విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, కుంటి సాకులు చెబుతూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఒక వీడియో ప్రకటన విడుదల చేసిన జోగు రామన్న గత తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కోలేదని, ఇప్పుడు కొత్తగా సమస్యలను సృష్టించడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. అప్పట్లో పని చేసిన అధికారులే ఇప్పటికీ విధుల్లో ఉన్నారని గుర్తు చేస్తూ, కొనుగోలు విధానాలపై సరైన అవగాహనతో మాట్లాడాలని ఎమ్మెల్యేకు సూచించారు. మోసపూరిత ప్రకటనలతో రైతులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని, రైతుల ప్రయోజనాల కోసం నిజాయితీగా పని చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతుల పక్షాన నిలబడి పోరాడతామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని జోగు రామన్న స్పష్టం చేశారు.

రైతులను రాజకీయాల కోసం వాడుకోవద్దు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

రైతులను రాజకీయాల కోసం వాడుకోవద్దు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

* జైనథ్‌లో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్

చిత్రం న్యూస్, జైనథ్: రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను వాడుకునే నాయకులతో జాగ్రత్తగా ఉండాలని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ఆదివారం జైనథ్ మార్కెట్ కమిటీ (AMC) పరిధిలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలు మూడు రోజుల క్రితమే వచ్చినప్పటికీ, గోదాముల్లో నిల్వ సామర్థ్యం (సరఫరా) లేకపోవడం వల్లే కొనుగోలు ప్రక్రియలో స్వల్ప ఆలస్యం జరిగిందని వివరించారు. అయితే కొన్ని రాజకీయ పార్టీల నాయకులు తాము చేసిన ధర్నాల వల్లే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని ప్రచారం చేసుకుంటూ రైతులను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం ఎమ్మెల్యేగా తాను నిరంతరం కృషి చేస్తున్నానని, రైతులకు అండగా ఉండటం తన బాధ్యత అని పేర్కొన్నారు. స్థానికంగా ఇబ్బందులు ఉన్నందున, మహారాష్ట్రలోని గోదాములను సంప్రదించి అక్కడ జొన్నలు మరియు ఇతర పంటలను నిల్వ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ పంటను మద్దతు ధరకు అమ్ముకునేలా అటు రాష్ట్ర ప్రభుత్వంతో, ఇటు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. మిగిలి ఉన్న రైతుల నుంచి శనగలను (Bengal Gram) కూడా కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని, రేపటి కేబినెట్ సమావేశంలో దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రికి అభ్యర్థించినట్లు వెల్లడించారు.”రైతుల కోసం నా చివరి శ్వాస వరకు పోరాడుతాను” అని ఈ సందర్భంగా పాయల్ శంకర్ భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, బీజేపి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు కట్కం రాందాస్, కాంగ్రెస్ నాయకులు జగదీశ్ రెడ్డి, రూకేష్ రెడ్డి, బీజేపి నాయకులు అశోక్ రెడ్డి, పిడుగు సంతోష్ యాదవ్, చిలుకూరి లింగా రెడ్డి, రాకేష్ రెడ్డి తదితరులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

నీట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఆదిలాబాద్ కలెక్టర్, ఎస్పీ 

నీట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఆదిలాబాద్ కలెక్టర్, ఎస్పీ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ (NEET) పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 7 పరీక్షా కేంద్రాలలో 6 కేంద్రాలను వారు స్వయంగా సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రాల్లోని బయోమెట్రిక్ విధానం, సీసీ కెమెరాల పనితీరు, విద్యార్థుల అటెండెన్స్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.ఈ తనిఖీ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రూ, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, పరీక్షల కో-ఆర్డినేటర్ అశోక్, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో జొన్నల కొనుగోలుకు రంగం సిద్ధం

ఆదిలాబాద్ జిల్లాలో జొన్నల కొనుగోలుకు రంగం సిద్ధం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లాలో జొన్నల కొనుగోలుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతులు పండించిన జొన్న పంటకు మద్దతు ధర కల్పించే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా 13 కొనుగోలు కేంద్రాలను గుర్తించినట్లు జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్, జైనథ్, బేల, తలమడుగు, ఇచ్చోడ, బజార్‌హత్నూర్, బోథ్, నేరడిగొండ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, హాస్నాపూర్, సిరికొండ ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే ఇవన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. రైతులు తమ పంటను బాగా శుభ్రపరిచి తేమ శాతం 14% కంటే మించకుండా,ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, కొనుగోళ్లు కేవలం వేలిముద్ర బయోమెట్రిక్ విధానం ద్వారానే జరుగుతాయన్నారు. రైతులు తమ పంట వివరాలను ముందుగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోని అనంతరం కేటాయించిన షెడ్యూల్ ప్రకారమే పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి అని తెలిపారు. పక్క రాష్ట్రాల నుండి జొన్నలు రాకుండా జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బయటి వ్యక్తులు రైతుల ముసుగులో పంటను విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు పంటను అమ్ముకోవద్దని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఏవైనా సందేహాలుంటే 6300001597 నంబర్‌కు సంప్రదించవచ్చని జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ మహేష్ కుమార్ తెలిపారు.