కాంగ్రెస్ 1000 రోజుల ప్రజా పాలన సందర్బంగా బైక్ ర్యాలీ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనకు 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ కుమురం భీం చౌక్, ఎన్టీఆర్ చౌక్, వినాయక్ చౌక్, డీటీసీ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, నెహ్రూ రోడ్డు, నేతాజీ చౌక్, గర్ల్స్ హైస్కూల్ మీదుగా తిరిగి డీసీసీ కార్యాలయానికి చేరుకుంది. దారి పొడవునా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ చౌక్ లో ఏర్పాటు చేసిన సభలో నాయకులు మాట్లాడారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ… గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
*కేసీఆర్ రాజీనామా చేసి ప్రజా తీర్పు ఎదుర్కోవాలి – కాంగ్రెస్ నేతల డిమాండ్
పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ తన హయాంలో రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు వంటి అంశాల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు సమాధానం చెప్పాలని, రాజకీయ బాధ్యత తీసుకుని రాజీనామా చేసి ప్రజా తీర్పును ఎదుర్కోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ చేస్తున్న వ్యక్తిగత విమర్శలు మాని, నిరుద్యోగం, రైతు సమస్యలు, సంక్షేమం, అభివృద్ధి వంటి ప్రజా సమస్యలపై చర్చ జరగాలని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరల పెరుగుదల, నిరుద్యోగంపై దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపురావు, బోథ్ ఇంచార్జ్ ఆడే గజేందర్, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, అల్లూరి సంజీవరెడ్డి, ఐఎన్టీయూసీ నాయకుడు మునిగేల నర్సింగ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు చరణ్ గౌడ్, మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, ఎస్సీ సెల్ చైర్మన్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.










