ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం: రైతుల కష్టాలపై మాజీ జడ్పీ చైర్మన్ సుహాసిని రెడ్డి ఆగ్రహం
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్తమైన కొనుగోలు విధానాల వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ చిట్యాల సుహాసిని రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయాలంటే రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జొన్న పంట చేతికి వచ్చి నెల రోజులు దాటినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం, జిల్లాలో 13 కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కేవలం రెండు చోట్ల మాత్రమే ప్రారంభించి ప్రభుత్వం కాలయాపన చేస్తు, జూన్ మొదటి వారం వరకు గడువు ఇవ్వడం వల్ల రైతులు తదుపరి ఖరీఫ్ సీజన్కు ఎలా సిద్ధమవుతారని ఆమె ప్రశ్నించారు. సోయాబీన్, శనగ పంటల కొనుగోలులో నాణ్యత సాకులు చూపిస్తూ రైతులను ఇబ్బంది పెడుతు సోయా రైతులు క్వింటాల్కు రూ. 1000 నుండి 1500 వరకు నష్టపోయారని, ఇప్పుడు శనగ పంట విషయంలోనూ అదే ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ హామీలను ముఖ్యమంత్రి గాలికి వదిలేశారని సుహాసిని రెడ్డి విమర్శించారు. రైతు భరోసా కింద రూ. 15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పడం అన్యాయమన్నారు. రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని, ఫసల్ బీమా పథకం విషయంలో రైతులను మోసం చేశారని ఆమె ఆరోపించారు. పంట నష్టపరిహారం చెల్లింపులోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులు తమ కష్టాన్ని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకునేలా ప్రభుత్వం కుట్ర చేస్తోందని, తక్షణమే జొన్న, శనగ పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.




