Home Blog Page 3

జనాభా గణనపై అవగాహన: కలెక్టర్ రాజర్షి షా సెన్సస్ మారథాన్ ప్రారంభం

జనాభా గణనపై అవగాహన: కలెక్టర్ రాజర్షి షా సెన్సస్ మారథాన్ ప్రారంభం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జనాభా గణన ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు సోమవారం ఉదయం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు ‘సెన్సస్ వాక్/మారథాన్’ నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షి షా అవగాహన ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా మారథాన్‌లో పాల్గొని ప్రజల్లో ఉత్సాహం నింపారు.

ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రు, రాజేశ్వర్, డీఆర్ఓ స్రవంతి, డీవైఎస్ఓ శ్రీనివాస్, ఈడీ మనోహర్, మెప్మా పీడీ రాజు, పర్యవేక్షకురాలు నలంద ప్రియతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, స్థానిక యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ర్యాలీ విజయవంతమైంది. కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పర్వతగిరిలో సనాతన హిందూ సేవా సమితి ఉదారత

పర్వతగిరిలో సనాతన హిందూ సేవా సమితి ఉదారత

గోమాతలకు గ్రాసం, పేద కుటుంబానికి నిత్యావసరాల పంపిణీ

చిత్రం న్యూస్ (పర్వతగిరి), వరంగల్: సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న సనాతన హిందూ సేవా సమితి పర్వతగిరిలో మరోసారి తన ఉదారతను చాటుకుంది. సంస్థ ఆధ్వర్యంలో ఒకే రోజు రెండు విభిన్న వినూత్న సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.

గోమాతలకు రెండు నెలల గ్రాసం పంపిణీ: సమితి ఆధ్వర్యంలో 186వ సేవా కార్యక్రమాన్ని స్థానిక గోశాలలో చేపట్టారు. గోరక్షణలో భాగంగా గోశాలలోని గోమాతలకు రెండు నెలలకు సరిపడా ఎండుగడ్డి (గ్రాసం) అందజేశారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా: చిన్న వయసులోనే భర్తను కోల్పోయి, ఇద్దరు ఆడపిల్లల చదువులు, పోషణ భారంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కట్టా రాధిక అనే మహిళను సమితి సభ్యులు ఆదుకున్నారు. 187వ కార్యక్రమంగా ఆమె కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమాల్లో సనాతన హిందూ సేవా సమితి వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్, సలహాదారు అంచూరి వేణుగోపాల్, ప్రతాపగిరి గణేష్, గ్రూప్ సభ్యులు గంగిడి ధర్మారెడ్డి, పేర్ణ భరత్ తదితరులు పాల్గొన్నారు.

ఎండీఎం ఆదిలాబాద్ జిల్లా మహాసభ విజయవంతం: కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్

ఎండీఎం ఆదిలాబాద్ జిల్లా మహాసభ విజయవంతం: కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మధ్యాహ్న భోజన పథకం ( ఎండీఎం ) వర్కర్స్ యూనియన్ ఆదిలాబాద్ జిల్లా మహాసభ సీపీఐ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఎండీఎం రాష్ట్ర కమిటీ, ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు నాయకత్వంలో జరిగిన ఈ సభకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఎండీఎం కార్మికులు, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కుంటాల రాములు మాట్లాడుతూ.. 24 ఏళ్లుగా బడి పిల్లలకు పోషకాహారం అందిస్తున్న ఎండీఎం కార్మికులను ప్రభుత్వాలు శ్రమ దోపిడీ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.10 వేల హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుపరం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

యూనిఫాం, రూ.10 లక్షల ప్రమాద బీమా, వయసు పైబడిన కార్మికులకు రూ.5 వేల పెన్షన్ కల్పించాలని మహాసభలో తీర్మానించారు. జూన్ నెలలోగా వేతనాలు పెంచకుంటే స్కూళ్లు తెరిచేలోపు వంటలు బంద్ చేసి జిల్లా వ్యాప్త సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా శ్రీదేవి, ప్రధాన కార్యదర్శిగా కుంటాల రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా లక్ష్మి, గంగామణి, శశికళ, రాంబాయి, పుష్పలత, శకుంతల, రాజారామ్, యశ్వంత్, సుజాత, సునీత, బుజ్జక్క, కోశాధికారిగా ఉప్మా బాయిలను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి సీపీఐ జిల్లా నాయకులు మెమెంటోలు అందజేశారు.

 

 

 

 

 

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఎస్సీ విభాగం పదవులకు దరఖాస్తుల స్వీకరణ

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఎస్సీ విభాగం పదవులకు దరఖాస్తుల స్వీకరణ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా, రాష్ట్ర స్థాయి పదవుల నియామకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ విభాగం నియామక పరిశీలకులు సమతా సుదర్శన్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆశావహులకు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందనడానికి ఎస్సీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతలే నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేసే నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సేకరించిన దరఖాస్తులను తదుపరి పరిశీలన కోసం గాంధీ భవన్‌కు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు.మరో ముఖ్య అతిథి సమతా సుదర్శన్ మాట్లాడుతూ ఎఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ జరుగుతోందని వివరించారు. దేశంలో అన్ని కులాలు, వర్గాలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ తన్వీర్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దీపక్, మాధవ్ పటేల్, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు బండి దేవిదాస్ చారి, గౌలి సంజీవ్, తదితర ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదు తప్పనిసరి..లేదంటే పథకాలు కట్

 ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదు తప్పనిసరి..లేదంటే పథకాలు కట్

చిత్రం న్యూస్ ,ఆదిలాబాద్: జిల్లాలోని రైతులందరూ ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలు, రాయితీలు, యూరియా బుకింగ్ వంటి సేవలను పొందడానికి ‘ఫార్మర్ రిజిస్ట్రీ’లో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా సూచించారు. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ వ్యవసాయ పథకాలకు ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ప్రాథమిక అర్హతగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ఈ ప్రక్రియను పూర్తి చేయని రైతులు రానున్న రోజుల్లో ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోయే ఆస్కారం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. ఇప్పటివరకు నమోదు చేసుకోని రైతులు వెంటనే సమీపంలోని మీ-సేవ (MeeSeva) కేంద్రాలను గానీ లేదా తమ ప్రాంత వ్యవసాయ విస్తరణాధికారులను (AEO) గానీ సంప్రదించి, సకాలంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గ్యాస్ సిలిండర్ల కొరత: క్యూలైన్లలో గృహిణుల అవస్థలు

గ్యాస్ సిలిండర్ల కొరత: క్యూలైన్లలో గృహిణుల అవస్థలు

చిత్రం న్యూస్, నిర్మల్: జిల్లా కేంద్రంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రరూపం దాల్చింది. మే 9, 2026న సిలిండర్ల కోసం వినియోగదారులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యకు కారణాలు: మార్కెట్లోకి అవసరమైన మేర సిలిండర్ల సరఫరా కాకపోవడం, వేసవి డిమాండ్‌కు తగ్గ స్టాక్ స్థానికంగా అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. సిలిండర్ల కొరతతో సామాన్య ప్రజలు, గృహిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి డిమాండ్‌కు సరిపడా అదనపు గ్యాస్ స్టాక్‌ను అందుబాటులోకి తేవాలని నిర్మల్ పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సాత్నాల ప్రాజెక్టు కుడి కాలువలో పూడికతీత పనులు ప్రారంభం

సాత్నాల ప్రాజెక్టు కుడి కాలువలో పూడికతీత పనులు ప్రారంభం

చిత్రం న్యూస్, సాత్నాల: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ రైతు వారోత్సవాల్లో భాగంగా సాత్నాల మండల కేంద్రంలోని ప్రాజెక్టు కుడి కాలువ పరిధిలో మేడిగూడ-సి కెనాల్ వద్ద పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలతో పనులు ప్రారంభమయ్యాయి. అనంతరం సాత్నాల ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్, మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.69 లక్షల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలోనే మరమ్మతు పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదలశాఖ ఈఈ ఉమామహేశ్వరరావు, డీఈ శ్రీనివాసరావు, ఏఈ మహేష్, ఎంఆర్ఓ రామారావు, ఎంపీడీఓ వెంకట్ రాజు, ఏపీఓ వెంకట రమణ, సర్పంచ్ అంజనా బాయి తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాకు నీతి ఆయోగ్ నుంచి రూ.4.29 కోట్లు మంజూరు

ఆదిలాబాద్ జిల్లాకు నీతి ఆయోగ్ నుంచి రూ.4.29 కోట్లు మంజూరు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. నీతి ఆయోగ్ ‘విండో-II’ ఇన్నోవేషన్ కేటగిరీ కింద రెండు కీలక ప్రాజెక్టులకు రూ.4.29 కోట్లు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గిరిజన ప్రాంతాల ప్రగతి, రైతుల ఆర్థికాభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు.

మంజూరైన ప్రాజెక్టులు:

1. *లక్క సాగు అభివృద్ధి – రూ.0.40 కోట్లు:* నార్నూర్ బ్లాక్‌లోని 20 గ్రామాలకు చెందిన 370 గిరిజన కుటుంబాలకు లబ్ధి. అడవిపై ఆధారపడే గిరిజనులకు శాస్త్రీయ శిక్షణ ఇచ్చి అదనపు ఆదాయం కల్పించడం లక్ష్యం.

2. *వాడీ సాగు – 3 అంచెల సమీకృత వ్యవసాయం – రూ.3.89 కోట్లు:* నార్నూర్ ప్రాంతంలోని 286 మంది సన్నకారు రైతులకు లబ్ధి. ఉద్యాన పంటలు, కూరగాయలు, టేకు సాగులో ప్రోత్సాహం అందించి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తారు.

ఈ నిధులను సక్రమంగా వినియోగించి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కలెక్టర్ రాజర్షి షా ధీమా వ్యక్తం చేశారు.

తాంసి మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

తాంసి మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

చిత్రం న్యూస్, తాంసి: తాంసి మార్కెట్ యార్డులో తెల్ల జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోjaa రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు పండించిన జొన్న పంట కొనుగోళ్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తోందని, దీనిని 15 క్వింటాళ్లకు పెంచేలా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులతో చర్చించినట్లు తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా జొన్నల పంపిణీకి ప్రభుత్వాన్ని కోరామని పేర్కొన్నారు.

రైతులు షెడ్యూల్ ప్రకారమే పంటను మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు. ఒక రైతు బిడ్డగా తాను చైర్మన్ బాధ్యతలు తీసుకున్నందున, మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ తన్వీర్ అహ్మద్ పటేల్, మెంబర్ ధనంజయ్, నాయకులు శ్రీధర్ రెడ్డి, సర్పంచులు సామ సంతోష్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో మధ్యాహ్న భోజన వర్కర్ల జిల్లా మహాసభ

 ఆదిలాబాద్‌లో మధ్యాహ్న భోజన వర్కర్ల జిల్లా మహాసభ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మధ్యాహ్న భోజన పథకం (MDM) వర్కర్ల జిల్లా మహాసభ మే 10, ఆదివారం ఉదయం 9:30 గంటలకు భుక్తాపూర్‌లోని సీపీఐ కార్యాలయంలో జరగనుందని, జిల్లాలోని అన్ని మండలాల కమిటీలు, కార్యవర్గ సభ్యులు, వర్కర్లు తప్పనిసరిగా హాజరుకావాలని ఎండీఎం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు పిలుపునిచ్చారు. ఈ మహాసభకు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు నళిని రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

మహాసభలో కార్మికుల 10 ప్రధాన సమస్యలపై తీర్మానాలు చేయనున్నారు. కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన రూ.10 వేల గౌరవ వేతనాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనానికి అవసరమైన నిత్యవసర సరుకులను ప్రభుత్వమే సరఫరా చేయాలని, కార్మికులందరికీ యూనిఫామ్‌లు, ఈఎస్‌ఐ సౌకర్యం, ప్రమాద బీమా కల్పించాలని కోరారు.  జూన్-జులైలో పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలంటే ముందుగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కమిటీ స్పష్టం చేసింది.