ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులకు కష్టాలు: ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధ్వజం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్లలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం కారణంగానే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిపోయిన జొన్న, మక్క పంటలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, అన్నదాతలకు భరోసా కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను ఆలస్యం చేయడం వల్లే అకాల వర్షాలకు మార్కెట్లో నిల్వ ఉంచిన పంటలు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్నా, ఇప్పటికీ రబీ పంటల కొనుగోలుపై స్పష్టత లేకపోవడం ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు, వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే వరకు ప్రభుత్వంపై తనవంతుగా ఒత్తిడి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.”అకాల వర్షాల వల్ల తడిసిన పంటను ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు లేకుండా పూర్తిగా కొనుగోలు చేయాలి. రైతులు ఎవరూ అధైర్యపడవద్దు, మీకు అండగా మేముంటాం” అని పాయల్ శంకర్ పేర్కొన్నారు. కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు పడుతున్న అవస్థలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
