ఆదిలాబాద్లో మధ్యాహ్న భోజన వర్కర్ల జిల్లా మహాసభ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మధ్యాహ్న భోజన పథకం (MDM) వర్కర్ల జిల్లా మహాసభ మే 10, ఆదివారం ఉదయం 9:30 గంటలకు భుక్తాపూర్లోని సీపీఐ కార్యాలయంలో జరగనుందని, జిల్లాలోని అన్ని మండలాల కమిటీలు, కార్యవర్గ సభ్యులు, వర్కర్లు తప్పనిసరిగా హాజరుకావాలని ఎండీఎం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు పిలుపునిచ్చారు. ఈ మహాసభకు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు నళిని రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
మహాసభలో కార్మికుల 10 ప్రధాన సమస్యలపై తీర్మానాలు చేయనున్నారు. కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన రూ.10 వేల గౌరవ వేతనాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనానికి అవసరమైన నిత్యవసర సరుకులను ప్రభుత్వమే సరఫరా చేయాలని, కార్మికులందరికీ యూనిఫామ్లు, ఈఎస్ఐ సౌకర్యం, ప్రమాద బీమా కల్పించాలని కోరారు. జూన్-జులైలో పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలంటే ముందుగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కమిటీ స్పష్టం చేసింది.

