Home Blog Page 16

ఆదిలాబాద్‌లో జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశం

ఆదిలాబాద్‌లో జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ సమావేశం  గురువారం జరిగింది. అజెండా అంశాలపై కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మున్సిపల్ కమిషనర్ రాజు, ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి సునీత, ఈడీ మనోహర్, డీఎండబ్ల్యూఓ కలీం, డీఎస్ఓ నందిని, మెప్మా డీఎంసీ శ్రీనివాస్, లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును స్వాగతించిన మాజీ మంత్రి జోగు రామన్న

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును స్వాగతించిన మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్, అదిలాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఊరటను మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టంగా ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేశారు. కమిషన్ నిబంధనలు పాటించలేదని కోర్టు పేర్కొనడం ద్వారా అసలు నిజం బయటపడిందని, ఇది న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచిందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రతికార ధోరణితో వ్యవహరిస్తూ, బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం వంటి అద్భుత ప్రాజెక్టును దూషించడం మానుకొని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి కేవలం రాజకీయ వేధింపులకు పాల్పడటం సరికాదని హెచ్చరించారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి నిజం కోసం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

మహంకాళి ఆలయానికి సరికొత్త శోభ: కుంట రఘుకుల్ రెడ్డి ఉదారత

మహంకాళి ఆలయానికి సరికొత్త శోభ: కుంట రఘుకుల్ రెడ్డి ఉదారత

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలం ఖాప్రి గ్రామంలోని మహంకాళి ఆలయం సరికొత్త రూపును సంతరించుకుంది. ఆలయ సుందరీకరణ, పెయింటింగ్ పనుల కోసం మాజీ ఎంపీపీ (బేల) కుంట రఘుకుల్ రెడ్డి అందించిన సహకారంతో గ్రామస్థులు, ఆలయ కమిటీ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆలయ ప్రాంగణం, గోపురానికి రంగులు వేయించి, భక్తులకు కనువిందు చేసేలా ఆధ్యాత్మిక శోభను పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కుంట రఘుకుల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన చేసిన ఈ ధార్మిక సేవ ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలతో భక్తులకు మరింత మెరుగైన వసతులు లభిస్తాయని వారు పేర్కొన్నారు. శుక్రవారం రోజున మహంకాళి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ సుందరీకరణ పనులు పూర్తి కావడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

కరంజి (కె) పాఠశాలలో శుద్ధ జల ప్లాంట్ ప్రారంభం: ఎల్టి దశరథ్ రాంరెడ్డి దాతృత్వం

0

కరంజి (కె) పాఠశాలలో శుద్ధ జల ప్లాంట్ ప్రారంభం: ఎల్టి దశరథ్ రాంరెడ్డి దాతృత్వం

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలం కరంజి (కె) గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) విద్యార్థుల కోసం ప్రముఖ దాత ఎల్టి దశరథ్ రాం రెడ్డి ముందుకు వచ్చి తన ఉదారతను చాటుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, సుమారు రూ.లక్ష నిధులు సొంత ఖర్చుతో ఏర్పాటు చేసి తాగునీటి ప్లాంట్ (RO Plant),  వాటర్ కూలర్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ.. ఎల్టి దశరథ్ రాం రెడ్డి సేవలను కొనియాడారు. వేసవి కాలంలో, సాధారణ రోజుల్లో కూడా విద్యార్థులకు స్వచ్ఛమైన, చల్లని తాగునీరు అందుబాటులో ఉండటం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని వారు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సామాజిక సేవా కార్యక్రమం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఎల్టి దశరథ్ రాంరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొంటిముక్కుల అనిత పొచ్చన్న , ఉప సర్పంచ్ సూర్య ప్రకాష్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు చిన్నయ్య, శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

*సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కంది శ్రీనివాస రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్‌తో కలిసి, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్యం కారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిధులను అందిస్తోందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేసేందుకు తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అవసరమైన వారు ఈ కౌంటర్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్, రాంరెడ్డి, నరేష్ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ ప్రజల కోసం ‘ప్రజా దర్బార్’.. సమస్యల పరిష్కారానికి కంది శ్రీనివాస్ రెడ్డి భరోసా

ఆదిలాబాద్ ప్రజల కోసం ‘ప్రజా దర్బార్’.. సమస్యల పరిష్కారానికి కంది శ్రీనివాస్ రెడ్డి భరోసా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పట్టణంలోని ప్రజా సేవా భవన్‌లో గురువారం అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్ కూడా పాల్గొని, ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించడమే కాకుండా వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతుల నమోదు కోసం ప్రత్యేకంగా ఒక డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీని ద్వారా సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతాయని ఆయన పేర్కొన్నారు.

మున్సిపల్ చైర్ పర్సన్ అనూష సతీష్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తుండటం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ప్రతి వారం ఇలా ప్రజా దర్బార్ నిర్వహించి, క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడం అభినందనీయమని ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

బాసర ఆర్జీయూకేటీలో కొండచిలువ కలకలం

0

 బాసర ఆర్జీయూకేటీలో కొండచిలువ కలకలం

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ కళాశాల పరిసరాల్లో కొండచిలువ కలకలం రేపింది. చుట్టూ చెత్త, పిచ్చి మొక్కలు, పుట్టలు ఉండడంతో ఈ కాలేజీ పాములకు కేరాఫ్‌గా మారింది. కళాశాలలో వివిధ రకాల చెట్లు బారీగా పెరగడంతో పాములు, కొండచిలువవలకు ఆవాసంగా మారింది. హ్యుమానిట్స్ బిల్డింగ్ ప్రాంగణంలో పాము కలకలం రేపడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న రాము స్పందించి రెండు పాములను పట్టుకున్న తర్వాత వాటిని సురక్షితంగా గోనె సంచిలో పెట్టి కళాశాలకు దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో సిబ్బంది విద్యార్థిని, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

భాద్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్ ను కలిసిన టీఎన్జీఓ నాయకులు

చిత్రం న్యూస్, కలెక్టరేట్: :ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చిత్రు, ఆర్డీవో పి.జగదీశ్వర్ రావులను వారి కార్యాలయాలలో ఆదిలాబాద్ జిల్లా టీఎన్జీవో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఏ.నవీన్ కుమార్, టీఎన్జీవో కేంద్ర సభ్యులు తిరుమల్ రెడ్డి, జిల్లా సభ్యులు, చంద్ర మోహన్ రెడ్డి, యస్ రాజేశ్వర్, అదిప నారాయణ, రవి, అదిలాబాద్ రూరల్ తాలూకా అధ్యక్షులు అసురీ ప్రవీణ్, అర్బన్ కార్యదర్శి కె.అరుణ్ కుమార్, సభ్యులు దుర్గయ్య, సోహైల్, శ్రీనివాస్, నవీన్ కుమార్, కలీo, అఖిల్ వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు

అసిస్టెంట్ ట్రెజరీ అధికారికి ఘనంగా సన్మానం 

అసిస్టెంట్ ట్రెజరీ అధికారికి ఘనంగా సన్మానం 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఇటీవల అసిస్టెంట్ ట్రెజరీ అధికారిగా (FAC)  బాధ్యతలు స్వీకరించిన పి.వి.రమణ చారి ను జిల్లా ట్రెజరీ కార్యాలయంలో అదిలాబాద్ జిల్లా టీఎన్జీవో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వివిధ డిపార్ట్మెంట్ల బిల్లులు సత్వరమే పాస్ చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఏ. నవీన్ కుమార్, టీఎన్జీవో కేంద్ర సభ్యులు తిరుమల్ రెడ్డి, జిల్లా సభ్యులు, చంద్ర మోహన్ రెడ్డి, యస్ రాజేశ్వర్, అదిప నారాయణ, రవి, అదిలాబాద్ రూరల్ తాలూకా అధ్యక్షులు అసురీ ప్రవీణ్, అర్బన్ కార్యదర్శి కె. అరుణ్ కుమార్ , సభ్యులు, దుర్గయ్య, సోహైల్, శ్రీనివాస్, నవీన్ కుమార్, కలీo, అఖిల్ వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: ఎంఈవో మహాలక్ష్మి

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: ఎంఈవో మహాలక్ష్మి

చిత్రం న్యూస్, బేల:

పిల్లలను ప్రయివేట్ పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని మండల విద్యాధికారిణి (ఎంఈవో)  మహాలక్ష్మి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామంలో గురువారం బడిబాట కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం, కిచెన్ గార్డెన్, నిష్ణాతులైన ఉపాధ్యాయులు, విద్యార్థులకు సౌకర్యవంతమైన తరగతి గదులు పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని వివరిస్తూ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఉపాధ్యాయ బృందం ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఇంటికి వెళ్లి మా పాఠశాలలో చేర్పించాలని, చేర్పించినట్లయితే నాణ్యమైన విద్యను అందించడం మా బాధ్యత అని గ్రామస్తులకు హామీ ఇచ్చారు . బడిబాట కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, పాఠశాలలో చేరిన విద్యార్థులకు కచ్చితంగా నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తామన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గ్రామాలు, వీధుల్లో ఇంటింటీ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ క్యాతం సురేష్ రెడ్డి, ఉపాధ్యాయులు,సిద్రప్ ప్రవీణ్, దినేష్, దేవిదాస్, అన్విత, జ్యోతి, మమత, యువకులు ఊరడే సాహిల్, మోహన్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.