కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును స్వాగతించిన మాజీ మంత్రి జోగు రామన్న
చిత్రం న్యూస్, అదిలాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఊరటను మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టంగా ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేశారు. కమిషన్ నిబంధనలు పాటించలేదని కోర్టు పేర్కొనడం ద్వారా అసలు నిజం బయటపడిందని, ఇది న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రతికార ధోరణితో వ్యవహరిస్తూ, బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం వంటి అద్భుత ప్రాజెక్టును దూషించడం మానుకొని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి కేవలం రాజకీయ వేధింపులకు పాల్పడటం సరికాదని హెచ్చరించారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి నిజం కోసం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.




