టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ అరెస్ట్
చిత్రం న్యూస్,గజ్వేల్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అసెంబ్లీలో ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సోమవారం గజ్వేల్లోని కేసీఆర్ ఫామ్హౌస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈ ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్, ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు భారీగా తరలివచ్చి ఫామ్హౌస్ను ముట్టడించేందుకు యత్నించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. దళిత స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఖండించారు. ఈ నిరసనలో పాల్గొన్న టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని గజ్వేల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరికొందరు నాయకులు, కార్యకర్తలను ప్రజ్ఞాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి హెచ్.ఆర్. మోహన్, రాష్ట్ర నాయకులు సమతా సుదర్శన్, శ్రీనివాస్, భద్రయ్య, కపిలేశ్వర్, హైమావతి, జీవన్ జ్యోతి, సంగారెడ్డి ఎస్సీ సెల్ చైర్మన్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
