Home Blog Page 25

అవల్పూర్ గ్రామంలో తీరిన దశాబ్ద కాలపు విద్యుత్ కష్టాలు: సర్పంచ్ అనిల్ చొరవపై సర్వత్రా హర్షం

అవల్పూర్ గ్రామంలో తీరిన దశాబ్ద కాలపు విద్యుత్ కష్టాలు: సర్పంచ్ అనిల్ చొరవపై సర్వత్రా హర్షం

చిత్రం న్యూస్, బేల: గత పది ఏళ్లుగా విద్యుత్ సమస్యలతో అల్లాడుతున్న బేల మండలం అవల్పూర్ గ్రామ ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. గ్రామంలో నెలకొన్న తీవ్రమైన విద్యుత్ అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని, సర్పంచ్ అనిల్ ప్రత్యేక చొరవ చూపి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు.

గ్రామంలో పాతబడిన, సరిపడా సామర్థ్యం లేని ట్రాన్స్‌ఫార్మర్ల వల్ల లో-వోల్టేజ్ తో ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సర్పంచ్, సంబంధిత అధికారులతో మాట్లాడి యుద్ధప్రతిపాదికన అవసరమైన చోట కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయించారు.

స్వయంగా పనులను పర్యవేక్షించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల నాటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ అనిల్ కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గ్రామ అభివృద్ధిలో విద్యుత్ సమస్య పరిష్కారం ఒక కీలక మైలురాయి అని ఈ సందర్భంగా గ్రామస్తులు కొనియాడారు.

రాష్ట్రస్థాయిలో మెరిసిన జైనథ్ విద్యార్థిని గతాడే వైష్ణవికి ఘన సన్మానం

రాష్ట్రస్థాయిలో మెరిసిన జైనథ్ విద్యార్థిని గతాడే వైష్ణవికి ఘన సన్మానం

చిత్రం న్యూస్, జైనథ్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో జైనథ్ గ్రామానికి చెందిన గతాడే వైష్ణవి అద్భుత ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయిలో మంచి మార్కులు సాధించి తమ గ్రామానికి పేరు తెచ్చిన వైష్ణవిని స్థానిక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గ్రామ అధ్యక్షుడు చిలుకూరి లింగారెడ్డి, నాయకులు కోవ సారథి, అన్నెల అశోక్, కొడిచర్ల స్వామి, శ్రీకాంత్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆమె నివాసానికి చేరుకుని, శాలువాతో ఆమెను గౌరవించి అభినందనలు తెలిపారు. వైష్ణవి పట్టుదలతో చదివి సాధించిన ఈ విజయం ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ దిశగా అడుగులు: అధికారుల బృందం సంయుక్త క్షేత్ర స్థాయి పరిశీలన

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ దిశగా అడుగులు: అధికారుల బృందం సంయుక్త క్షేత్ర స్థాయి పరిశీలన

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ నిర్మాణ సాధ్యసాధ్యాలను (Feasibility Study) పరిశీలించేందుకు శుక్రవారం రక్షణ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని,జిల్లా ఇంచార్జి కలెక్టర్ యువరాజ్ మర్మట్ అధికారులకు అవసరమైన వివరాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అధ్యయనం చేపట్టడం శుభపరిణామమని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ అధ్యయనానికి సహకరించిన భారత ప్రభుత్వానికి, సంబంధిత కేంద్ర మంత్రులకు, తెలంగాణ ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఢిల్లీలో జరగనున్న తదుపరి సమావేశంలో ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఈ క్షేత్ర స్థాయి పరిశీలన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, ఆర్డీఓ స్రవంతిలతో పాటు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు రాహుల్ శుక్ల, ఎస్.జి. హెడ్గే, జె.పి. సబర్వాల్, రాజీవ్ మరియు పలువురు ప్రభుత్వ వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఈ నెల 18న కూర గ్రామంలో హిందూ సమ్మేళనం 

ఈ నెల 18న కూర గ్రామంలో హిందూ సమ్మేళనం 

చిత్రం న్యూస్, జైనథ్: ఆధ్యాత్మికత, ఐక్యతను చాటిచెప్పే లక్ష్యంతో  శనివారం  ఉదయం 11 గంటల నుండి కూర గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వేదికగా భారీ “హిందూ సమ్మేళనం” నిర్వహించనున్నారు. కరంజి ఉప మండలం పరిధిలోని అనంద్ పూర్, కూర, కరంజి, కాప్రి, ఉమ్రి వంటి పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ధర్మ పరిరక్షణ, హిందూ సమాజంలో ఐక్యత పెంపొందించడం కోసం ఈ సమ్మేళనంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, సామూహిక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని, అలాగే హిందూ ధర్మ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని నిర్వాహకులు తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన బీజేపీ బాసర మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ 

0

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన బీజేపీ బాసర మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ 

చిత్రం న్యూస్, బాసర : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావుని నిర్మల్ జిల్లా బాసర బీజేపీ మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ శుక్రవారం హైదరాబాద్ లో  మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి  ఘనంగా సన్మానించారు. అనంతరం బాసరలో నెలకొన్న సమస్యలపై వివరించారు. సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.  ఈ సందర్భంగా రామచంద్ర రావుకు పుట్నాల సాయినాథ్ అభినందనలు తెలిపారు. ఆయన వెంట జాదవ్ గణేష్ తదితరులు ఉన్నారు

ఖోగ్దూర్ గ్రామంలో బోర్ స్టార్టర్ ను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

ఖోగ్దూర్ గ్రామంలో బోర్ స్టార్టర్ ను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఖోగ్దూర్ గ్రామంలో నీటి కోసం గ్రామస్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు గ్రామంలో నీటి కష్టాలు మొదలవుతాయి. మిషన్ భగీరథ ఉన్న గ్రామానికి కావాల్సినంతగా నీరు సరఫరా కావడం లేదు. దీంతో 3 కిలోమీటర్ల దూరంలోని మంగ్రూడ్ గ్రామ శివారులో ప్రభుత్వ స్థలంలో బోరు వేసి అక్కడి నుండి పైప్ లైన్ ద్వారా మిషన్ భగీరథ ట్యాంక్ కి సరఫరా చేసి నీటిని వినియోగించుకుంటున్నారు. గత రెండు రోజుల క్రితం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడ ఉన్న బోర్ స్టార్టర్ ని ధ్వంసం చేశారు.రెండు రోజుల నుండి నీటి కోసం గ్రామస్థులు అనేక ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. ఈ సందర్బంగా గ్రామ ఉప సర్పంచ్ కాడే సంజయ్ మాట్లాడుతూ…కొందరు వ్యక్తులు కావాలనే ఉద్దేశ్యంతో అక్కడ ఉన్న బోర్ స్టార్టర్ ని పలుమార్లు ధ్వంసం చేశారన్నారు . మరోమారు ఇలానే ప్రవర్తిస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టరేట్ ఎదుట TGEJAC నేతల నిరసన 

ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టరేట్ ఎదుట TGEJAC నేతల నిరసన 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ TGEJAC నాయకులు అదిలాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

2వ పీఆర్సీ అమలు: రెండవ పిఆర్సీ నివేదికను తక్షణమే తెప్పించుకుని, జూన్ 2వ తేదీలోపు 51% ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పెండింగ్ బిల్లుల విడుదల: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు ₹13,000 కోట్ల బిల్లులను ఏకమొత్తంగా విడుదల చేసి, రిటైర్డ్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు.

ఆరోగ్య కార్డుల మంజూరు: ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం కొత్త EHS (Employee Health Scheme) విధానాన్ని రూపొందించి, మే 1వ తేదీ నుండి నగదు రహిత వైద్య సేవలు అందేలా చూడాలని విన్నవించారు.

Cps రద్దు – OPS పునరుద్ధరణ: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని, ముఖ్యంగా 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారికి పాత పెన్షన్ వర్తింపజేయాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా వారు కలెక్టర్‌ను కోరారు. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని TGEJAC నాయకులు హెచ్చరించారు.  కార్యక్రమంలో  ఆయా సంఘాల జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా, మండల భాద్యులు పాల్గొన్నారు.

బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు 

బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా చట్టాలకు లోబడి పార్లమెంట్ ప్రక్రియ ద్వారా ఒక రాష్ట్రం ఏర్పడటాన్ని దేశ విభజనతో ముడిపెట్టి శత్రుదేశమైన పాకిస్థాన్ తో పోల్చడం క్షమించరాని నేరమని, ఇది దేశద్రోహానికి సమానమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన దీర్ఘకాల పోరాటం, వేలాది అమరుల త్యాగాలను అవమానించేలా బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేసిన ఎంపీపై వెంటనే చర్యలు తీసుకుని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ  మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డీసీసీ కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బాసరలో మొక్కజొన్న పంట దగ్ధం  

బాసరలో మొక్కజొన్న పంట దగ్ధం  

*కంటతడి పెట్టుకున్న రైతు గోసుల రాజు 

చిత్రం న్యూస్, బాసర : ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న పంట కళ్ళముందే దగ్ధం అయిన ఘటన నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బాసరలోని రవీంద్రపూర్ కాలనీకి చెందిన గోసుల రాజు రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట వేశాడు. చేనులో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి తిని వచ్చేలోపు పంటకు నిప్పంటుకొని కాలి బూడిదవడంతో  కన్నీరు మున్నీరయ్యాడు. గమనించిన తోటి రైతులు బకెట్లతో నీరు పోసి కాపాడేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. చేతికొచ్చిన మొక్కజొన్న పంట బూడిద కావడంతో బాధిత రైతు కంటతడి పెట్టుకున్నాడు. పంటకు నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  తనను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.

మొక్కజొన్న సబ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

0

మార్క్ ఫెడ్ ఎండీ ని కలిసిన ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, అనిల్ జాదవ్ 

చిత్రం న్యూస్, బాసర: మొక్కజొన్న రైతుల పంటను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తామని, ఈపాటికి అన్ని మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు ఆయన హైదరాబాద్ లో మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డిని  కలిసిన సందర్భంగా మాట్లాడారు. ముథోల్ నియోజకవర్గంలో ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న పంట ఉందని, భారీ వర్షాలతో రైతుల నష్టపోయారని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేపడితే కొంతైనా మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉన్నందున ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మితే క్వింటాలుకు రూ.700 వరకు అధిక ధర వస్తుందని, వెంటనే కొనుగోలు చేపట్టి, పంట అమ్మినా డబ్బులను రైతుల ఖాతాల్లో సత్వరం వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో ప్రధాన కొనుగోలు కేంద్రాలతో పాటు సబ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే పంట అమ్ముకోవడానికి ఇబ్బందులు ఉండవని, ఎక్కడెక్కడ సబ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలో ఆయన రాతపూర్వకంగా ఎండీకి వివరించారు. నియోజకవర్గంలో 30కి పైగా సబ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా అమ్మకానికి పంట తెచ్చిన వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామన్నారు. మొక్కజొన్న రైతులు ఆందోళన పడకుండా తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని ఎమ్మెల్యే సూచించారు.