ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ దిశగా అడుగులు: అధికారుల బృందం సంయుక్త క్షేత్ర స్థాయి పరిశీలన
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ నిర్మాణ సాధ్యసాధ్యాలను (Feasibility Study) పరిశీలించేందుకు శుక్రవారం రక్షణ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని,జిల్లా ఇంచార్జి కలెక్టర్ యువరాజ్ మర్మట్ అధికారులకు అవసరమైన వివరాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్లో విమానాశ్రయ ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అధ్యయనం చేపట్టడం శుభపరిణామమని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ అధ్యయనానికి సహకరించిన భారత ప్రభుత్వానికి, సంబంధిత కేంద్ర మంత్రులకు, తెలంగాణ ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఢిల్లీలో జరగనున్న తదుపరి సమావేశంలో ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఈ క్షేత్ర స్థాయి పరిశీలన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, ఆర్డీఓ స్రవంతిలతో పాటు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు రాహుల్ శుక్ల, ఎస్.జి. హెడ్గే, జె.పి. సబర్వాల్, రాజీవ్ మరియు పలువురు ప్రభుత్వ వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.




