Home Blog Page 26

బాసర ఆలయంలో భక్తుల సందడి  

0

బాసర ఆలయంలో భక్తుల సందడి  

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసరలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో  శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారిని దర్శించుకోవడానికి వరుసలో బారులు తీరారు. బారులు తీరిన భక్తులకు ఆలయ ఈవో విజయరామారావు, మంచినీళ్లు, మజ్జిగ, వసతులు కల్పించారు. శుక్రవారం కావడంతో చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసాలను చేయించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఈవో విజయ రామారావు, ఏవో గంగ ప్రసాద్, బాసర సీఐ కిరణ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్

 వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో వరుస దొంగతనాలు, మొబైల్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న సయ్యద్ నవీద్ అలీ (అలియాస్ బడా ముష్రఫ్) పై ఆదిలాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. నిందితుడిపై ఇప్పటివరకు మొత్తం 23 కేసులు నమోదయ్యాయి. ఇందులో 20 దొంగతనం కేసులు కాగా, 3 గంజాయి స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులు ఉన్నాయి. గతంలో జైలు శిక్ష అనుభవించినప్పటికీ, నవీద్ అలీ తన ప్రవర్తన మార్చుకోలేదు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు. నిందితుడు జైలు నుండి విడుదలైన ప్రతిసారీ మళ్ళీ నేరాలకు పాల్పడుతుండటంతో, ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రహదారి ప్రమాదాల నివారణకు సమన్వయంతో కృషి చేయాలి: అదనపు కలెక్టర్లు

రహదారి ప్రమాదాల నివారణకు సమన్వయంతో కృషి చేయాలి: అదనపు కలెక్టర్లు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రహదారి ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘రోడ్డు భద్రత అవగాహన’ సమీక్షా సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, విలువైన ప్రాణాలను బలిగొంటున్న రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు సంబంధిత శాఖలు పరస్పర సహకారంతో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేవలం నిబంధనలు అమలు చేయడమే కాకుండా, ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, అక్కడ తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ, రవాణా, పోలీసు, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు, రోడ్లు-భవనాల శాఖ (R&B) ఇంజనీర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజాపాలన లక్ష్యం అర్హులకు సంక్షేమం అందడమే: ఎమ్మెల్యే పాయల్ శంకర్P

ప్రజాపాలన లక్ష్యం అర్హులకు సంక్షేమం అందడమే: ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రభుత్వ పథకాలు, సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందడమే ప్రజాపాలన అసలు ఉద్దేశమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. ‘ప్రజాపాలన 99 రోజుల’ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్‌లోని ఎస్టీయూ భవన్‌లో నిర్వహించిన మున్సిపల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదని, ప్రజలందరి సంక్షేమం కోసం నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పాలన సాగించాలన్నారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బ్యాంకుల నుండి రుణాలు పొందడమే కాకుండా, వాటిని సరైన మార్గంలో పెట్టుబడిగా పెట్టి ఆర్థికంగా ఎదగాలని కోరారు. అప్పుడే సంఘాల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని హితబోధ చేశారు.

వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ సమస్య తలెత్తినా పారదర్శకమైన పరిష్కారం లభించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిగతులను (Status) ఎప్పటికప్పుడు తెలుసుకునేలా మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌లకు విజ్ఞప్తి చేశారు. సంక్షేమ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు సిద్ధిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్, వైస్ చైర్మన్ రోహిత్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ స్రవంతి, ఎల్డీఎం ఉత్పల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు, డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్, డీవైఎస్ఓ శ్రీనివాస్, సంక్షేమ అధికారి మిల్కా, ట్రాఫిక్ ఎస్సై దేవేందర్, తహసిల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్లు అన్నపూర్ణ, స్వాతి, ధోని జ్యోతి, చరణ్ గౌడ్, మున్న జైస్వాల్, గంట జీవన్, విజయ్, ఆత్రం వేంకటేష్, నాగ్ సేన్, మహెబూబ్, సంజయ్, అంగన్వాడీలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జైనథ్ లో వైభవంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సమావేశం

జైనథ్ లో వైభవంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సమావేశం

చిత్రం న్యూస్,జైనథ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా జైనథ్ మండల కేంద్రంలో గురువారం మండల స్థాయి సమీక్షా సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

సమావేశం ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు ప్రభుత్వ సాంప్రదాయ పద్ధతిలో సీమంతం నిర్వహించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు అధికారులు గర్భిణులకు పండ్లు, పూలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ ‘ప్రగతి ప్రణాళిక’ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతం మరియు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై ఈ వేదికగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రమేష్, తహసీల్దార్ నారాయణ, మండల ప్రత్యేక అధికారి, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

బాసర రైతు వేదికలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం

0

బాసర రైతు వేదికలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం

చిత్రం న్యూస్, బాసర:  ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి సమీక్ష సమావేశం బాసర రైతు వేదికలో నిర్వహించారు. ఈ సమావేశం ఎంపీడీవో దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రభుత్వ పథకాల అమలు, ప్రగతి, ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. బాసర ఎంపీడీవో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని సూచించారు. అలాగే, పనుల అమలులో పారదర్శకత పాటిస్తూ సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ పవన్ చంద్ర ఎంపీఓ గంగ ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, శాఖాధికారులు, సిబ్బంది మండల ప్రజలు పాల్గొన్నారు.

ప్రజా పాలనతో గ్రామాల అభివృద్ధికి వేగం

ప్రజా పాలనతో గ్రామాల అభివృద్ధికి వేగం

చిత్రం న్యూస్, దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)  పి.చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించి, సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. మండలంలోని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల అవసరాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి పరస్పర సమన్వయం కీలకమని తెలిపారు.

108 అంబులెన్సు లో మహిళ ప్రసవం..తల్లీ బిడ్డ క్షేమం 

చిత్రం న్యూస్,బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చెంపల్లి గ్రామానికి చెందిన యోగిత  108 వాహనంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో  బేల మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకొని వెళ్లారు . ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి 108 అంబులెన్స్ లో  అదిలాబాద్ రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యల నొప్పులు తీవ్రమవ్వడంతో ఈఎంటీ సాయి కిరణ్ ,పైలట్ అర్షద్ ఖాన్ లు వాహనం నిలిపి ప్రసవం చేశారు. మహిళ మగ బిడ్డకు జన్మనివ్వగా ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు.  మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్ కి తరలించిన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.

బేలలో ప్రజా పాలనా..ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం

బేలలో ప్రజా పాలనా..ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రజా పాలనా- ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం ఎంపీడీఓ మహేష్ కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.సమావేశ ప్రారంభోత్సవం ముందుగా జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ మండల స్థాయి ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఇందులో రైతుభరోసా,సబ్సిడీ గ్యాస్,తదితర సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు మండలానికి 21 కోట్లు రావడం జరిగిందన్నారు. అదేవిదంగా మండల స్థాయి అధికారులు తమ తమ ప్రగతి నివేదికను సమావేశంలో చదివి వినిపించారు.సమావేశంలో పలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం నిర్వహించారు.

ఈ సందర్బంగా మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం వివిధ శాఖలకు సంబందించిన మండల స్థాయి అధికారులు తమ తమ నివేదికలను వివిరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, జిల్లా విద్యాధికారి మహాలక్ష్మి, మండల వైద్యాధికారి, కృష్ణవంశీ, మండల పశువైద్యాధికారి డా. దీప్ రతన్, మండల వ్యవసాయ అధికారి సాయి తేజ రెడ్డి, మండల హౌసింగ్ ఏఈ లింగం, మండల సర్పంచ్ సంఘం అధ్యక్షుడు అశోక్ టాక్రే, తదితరులు పాల్గొన్నారు.

సర్కారు బడిలోనే విలువలతో కూడిన విద్య

సర్కారు బడిలోనే విలువలతో కూడిన విద్య

చిత్రం న్యూస్, దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ధర్మారావుపేట ప్రభుత్వ పాఠశాలను విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు భరత్, సత్తయ్య గురువారం సందర్శించారు. పాఠశాలలోని రికార్డులను తనిఖీ చేసి, బోధన తీరును పరిశీలించారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని అంచనా వేసి, పాఠ్యబోధనలో మరింత మెరుగులు దిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.bఅధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు విశ్వాసంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. విద్యతో పాటు విలువల ఆధారిత సంస్కారం కూడా పాఠశాలల్లోనే పెంపొందుతుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం, మౌలిక వసతులు, పరిశుభ్రత పరిస్థితులను కూడా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ శ్రీనివాస్ రావు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.