బీజేపీ కార్యాలయాలు, నాయకులపై దాడులను ఖండించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, హైదరాబాద్: నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై జరిగిన దాడి హేయమైన చర్య అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ తీవ్రంగా ఖండించారు. నల్గొండలో బీజేపీ జిల్లా కార్యాలయం, రాష్ట్ర కార్యాలయం, జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి నివాసంపై జరిగిన దాడులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షిత్ రెడ్డి ఇంట్లోకి చొరబడి టీవీ, ఫ్రిజ్ తదితర వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు ఆయన తల్లిపై దాడి చేసి గాయపరిచిన ఘటనను ఖండించారు. “ప్రజాస్వామ్యంలో భేదాభిప్రాయాలు సహజం, కానీ కార్యాలయాలపై దాడులు, ఆస్తుల ధ్వంసం, మహనీయుల చిత్రాలను అవమానించడం సమర్థనీయం కాదు” అని అన్నారు. సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ నేతల అరెస్టులను కూడా ఆయన ఖండించారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని అన్నారు. మంగళవారం డీజీపీ కార్యాలయానికి వెళ్లి బీజేపీ నేతలతో కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. నల్గొండ జిల్లా కార్యాలయంపై 50 మంది దాడి, సంత్ రవిదాస్ చిత్రాన్ని అవమానించిన ఘటనలపై SC/ST అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా నిష్పక్షపాత విచారణ జరిపి బాధితులకు న్యాయం, బీజేపీ నేతలకు భద్రత కల్పించాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.
