ఐటీ రంగాన్ని భారత్కు పరిచయం చేసిన మహానాయకుడు రాజీవ్ గాంధీ: దుర్గం శేఖర్
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: భారత రత్న, స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ అన్నారు. గురువారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ రంగాలను ప్రవేశపెట్టి “సాంకేతిక సమాచార విప్లవ పితామహుడు”గా నిలిచారని కొనియాడారు. మహిళలకు 33% రిజర్వేషన్లు, యువతకు 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనదేనన్నారు. రాజీవ్ ఆశయాల మేరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పరమేశ్వర్, పట్టణ అధ్యక్షులు చంద్రాల రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
