రాజ్యాంగం స్ఫూర్తితోనే అందరికీ అభివృద్ధి ఫలాలు
*ఆర్టికల్ 311 ద్వారానే తాను ఐఏఎస్ కాగలిగాను*
*అంబేడ్కర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్ఫూర్తితోనే భారతదేశంలో అన్ని వర్గాల వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రాజ్యంగంలో ఆలిండియా సర్వీసెస్ గురించి పొందుపర్చిన ఆర్టికల్ 311 ద్వారానే తాను ఐ.ఏ.ఎస్ కాగలిగానని గుర్తు చేశారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. అంబేడ్కర్ 135 వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఫులాంగ్ చౌరస్తా వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు,ఆయా సంఘాల నాయకులు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని, ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని వర్గాల వారు అభ్యున్నతి సాధించాలని అంబేడ్కర్ కన్న కలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉద్బోధించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగానే జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ, ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు బాబా సాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని చదువుల్లో రాణించాలని, తద్వారా ఉన్నత స్థానాలను అధిరోహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యార్జన దిశగా ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందని అన్నారు. వసతి గృహాలు, గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ప్రతి ఏటా సుమారు రూ. లక్షా ఎనిమిది వేల చొప్పున నిధులను ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలని మార్గ నిర్దేశం చేశారు. నిజామాబాద్ నగరంలో అంబేడ్కర్, పూలే వంటి మహనీయుల విగ్రహాల ఏర్పాటు విషయంలో అందరితో చర్చించి జిల్లా యంత్రాంగం సముచిత నిర్ణయం తీసుకుంటుందని వెల్లడిస్తూ, అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
నగర మేయర్ కే.ఉమారాణి మాట్లాడుతూ, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు,బాధ్యతలను, పదవులను చేపట్టగలుతున్నారని అన్నారు. భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్స్ అన్ని వర్గాల వారికి హక్కులను కల్పిస్తున్నాయని, అంబేద్కర్ అందరి వాడు అని కొనియాడారు. ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం అంకిత భావంతో కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ లు మాట్లాడుతూ, భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకునే విద్యార్థులకు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే స్ఫూర్తి ఆని అన్నారు. సమాన విద్య, సమానత్వ హక్కులు, ప్రాథమిక హక్కులన్నీ రాజ్యాంగంలో పొందుపర్చినవే అని గుర్తు చేశారు. మన దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఎటువైపు చూసినా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా వ్యాస రచన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు బహూకరించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీటీసీ దుర్గా ప్రమీల, జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజ గంగారాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

