హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
*జన గణన తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోళ్ళికేరి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: జన గణనలో భాగంగా చేపట్టనున్న హౌస్ లిస్టింగ్ (ఇండ్ల గణన) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జన గణన తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోళ్లికేరి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఇండ్ల గణన కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జనగణన కార్యక్రమంలో భాగంగా మే 11వ తేదీ నుండి నిర్వహించే ఇండ్ల గణన ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా ఇండ్ల జాబితా బ్లాక్ లను రూపొందించాలని, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు క్షేత్ర స్థాయిలో పక్కాగా పర్యవేక్షించాలని, ఇండ్ల గణన, జనగణన జాబితా ప్రకారం అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో దోహదపడతాయని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, హౌస్ లిస్టింగ్ ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఇండ్ల గణన కోసం ఆరు మండలాలు మినహా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల సరిహద్దుల నిర్ధారణ పూర్తయ్యిందని, మిగిలిపోయిన మండలాల్లోనూ 15వ తేదీ నాటికి పూర్తి చేస్తామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

