జొన్నలు, సెనగల కొనుగోళ్లలో రైతులను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే పై జోగు రామన్న ధ్వజం
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జొన్నలు మరియు సెనగల కొనుగోళ్ల విషయంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న తీవ్రంగా విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, కుంటి సాకులు చెబుతూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఒక వీడియో ప్రకటన విడుదల చేసిన జోగు రామన్న గత తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కోలేదని, ఇప్పుడు కొత్తగా సమస్యలను సృష్టించడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. అప్పట్లో పని చేసిన అధికారులే ఇప్పటికీ విధుల్లో ఉన్నారని గుర్తు చేస్తూ, కొనుగోలు విధానాలపై సరైన అవగాహనతో మాట్లాడాలని ఎమ్మెల్యేకు సూచించారు. మోసపూరిత ప్రకటనలతో రైతులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని, రైతుల ప్రయోజనాల కోసం నిజాయితీగా పని చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతుల పక్షాన నిలబడి పోరాడతామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని జోగు రామన్న స్పష్టం చేశారు.

