Home Blog Page 52

వెల్లంపల్లిలో బూత్ అధ్యక్షుడి గృహ ప్రవేశానికి హాజరైన డా. పగడాల కాళీ ప్రసాద్ రావు

చిత్రం న్యూస్, పరకాల రూరల్: పరకాల రూరల్ మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ బూత్ అధ్యక్షుడు ఏకు సదయ్య నూతనంగా నిర్మించుకున్న గృహ ప్రవేశ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళీ ప్రసాద్ రావు నూతన గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సదయ్య కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.  ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పరకాల మండల అధ్యక్షుడు కాసగాని రాజ్ కుమార్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు సింగడి శ్రీనివాసరెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు కునూరు వీరాస్వామి, గ్రామ శక్తి కేంద్ర ఇంచార్జ్ గంట శ్రీనివాస్ రెడ్డి, అశోక్ మరియు పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంజనేయ స్వామికి వెండి కిరీటం సమర్పించిన డా.కళ్లెం జీవిత-వెంకట్ రెడ్డి దంపతులు

చిత్రం న్యూస్, సాత్నాల: హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డా. కళ్ళెం జీవిత, డా.కళ్ళెం వెంకట్ రెడ్డి దంపతులు తమ భక్తిని చాటుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం మేడిగూడ గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామికి వారు వెండి కిరీటాన్ని కానుకగా సమర్పించారు.

ఈ సందర్భంగా మేడిగూడ గ్రామానికి విచ్చేసిన డాక్టర్ దంపతులకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, మంగళ హారతులతో గ్రామం కోలాహలంగా మారింది. కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి వెండి కిరీటాన్ని అలంకరించారు.

గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వైద్యులు అందిస్తున్న సహకారం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కుంటాల గ్రామంలో ‘ప్రజా పాలన’ గ్రామ సభ: అభివృద్ధి పనుల ఫోటో ప్రదర్శనL

చిత్రం న్యూస్, కుంటాల: కుంటాల మండల కేంద్రంలో  ’99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో, చేపట్టిన అభివృద్ధి పనుల ఫోటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కుంటాల గ్రామంలో జరిగిన గ్రామ సభకు గ్రామ సర్పంచ్ జక్కుల గజేందర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ప్రత్యేక జిల్లా అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను వివరించారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను తెలియజేశారు. ప్రతి అర్హుడికి పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు గ్రామంలో గత 99 రోజులలో చేపట్టిన అభివృద్ధి పనులను తెలిపేలా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను అదనపు కలెక్టర్ పరిశీలించారు. తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య కార్యక్రమాలు, పంచాయతీ అభివృద్ధి పనులు వంటివి ఫోటోల రూపంలో ప్రదర్శించారు. అభివృద్ధి పనులు పారదర్శకంగా నిర్వహించడం అభినందనీయమని, ఇతర గ్రామాలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని ఆయన సూచించారు

గ్రామ సభల ద్వారా సమస్యల పరిష్కారం: కలెక్టర్ అభిలాష అభినవ్

చిత్రం న్యూస్, నిర్మల్ : గ్రామాల సమస్యల పరిష్కారమే గ్రామ సభల నిర్వహణ ముఖ్య ఉద్దేశ్యం అని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం నిర్మల్ గ్రామీణ మండలం వెంగ్వాపేట్ గ్రామ పంచాయతీ భవన ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉన్నతికి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు వంటి పథకాల ద్వారా ఎందరో మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో దాదాపు 60 వేల రేషన్ కార్డులను ఇప్పటికే మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

గ్రామ సభల ద్వారా గ్రామాల్లో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, ప్రతి రెండు నెలలకు ఒకసారి తప్పనిసరిగా గ్రామసభలు నిర్వహించి, గ్రామాలలో నెలకొన్న సమస్యలను చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు.ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులన్నీ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నాయని, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల ద్వారా గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా మార్చామని, అతి త్వరలోనే వైద్య కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.అధికారులంతా జవాబుదారీతనంతో పని చేస్తూ, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో కీలకంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామ సభలో భాగంగా, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన గ్రామస్తుల వివరాలు చదివి వినిపించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అన్ని పథకాలను సద్వినియోగపరుచుకోవాలని సూచించారు.

మహనీయుల జయంతి ఉత్సవాలను విజయవంతం చేయండి..జిల్లా కలెక్టర్ రాజర్షి షా 

* జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు మహనీయుల చిత్ర పటాన్ని అందజేసిన దళిత సంఘాల నాయకులు 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మహనీయుల జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశం మందిరంలో దళిత సంఘాల సమితి ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈనెల 05 తేదీన బాబు జగజీవన్ రామ్ జయంతి, 14 న బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా సన్నాహక నిర్వహణ కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ప్రతినిధులు సూచనలు అందిందిన క్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కి మహనీయుల చిత్ర పటాలను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ ,ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్ , షెడ్యూల్ క్యాస్ట్ అభివృద్ధి అధికారి సునీత. ఈ.డీ మనోహర్, దళిత సంఘాల ప్రతినిధులు మేకల మల్లన్న.మల్యాల స్వామి, దుర్గం శేఖర్, బాల శంకర్ కృష్ణ,  రత్న జాడే ప్రజ్ఞ కుమార్, మల్యాల మనోజ్ కుమార్, నక్కారాందాస్, రాజన్న,  అల్లూరి భూమన్న, ఆయిండ్ల శశికాంత్ , దాన్డిగే సందీప్, వాగ్మారే బింరావ్, కొప్పుల రమేష్.అగ్గిమళ్ళ గణేష్, ఆరేల్లి మల్లేష్, నిమ్మల ప్రశాంత్, దర్శనాల నగేష్.. కాంబ్లే బాలాజీ, బిక్కి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సర్ధార్ పాపన్న గౌడ్ వర్ధంతి 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ తొలిరాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన  వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు ఆయన విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన వర్ధంతి కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ తో కలిసి పాల్గొని పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, బీసీ గౌడ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి రూ.రెండు లక్షల విరాళం  

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలోని పురాతన దేవాలయం రేణుకపూర్ లోని దక్షిణముఖి హనుమాన్ ఆలయానికి ఆలయ అధ్యక్షుడు సంజీవరావు దేశ్ముఖ్ గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ పునఃనిర్మాణం పనుల అభివృద్ధి కోసం రూ.2 లక్షల విరాళం చెక్కును హనుమాన్ ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గురు స్వామికి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని అదేవిధంగా భక్తులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారన్నారు. వెంట పీఆర్ఓ నర్సూరి భీంరావు, మాజీ సర్పంచ్ సతీశ్వర్ రావు, మమ్మాయి మురళి, కార్తీక్ రావు, ఆకాష్, గంగాధర్, రాజు,పోతన్న, అంజన్న స్వాములు తదితరులు పాల్గొన్నారు.

బాసర అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

చిత్రం న్యూస్, బాసర: దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి శుక్రవారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హనుమాన్ జయంతి ఉత్సవాలు సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకార పూజలను చేశారు. అమ్మవారి దర్శనం కోసం ఉమ్మడిఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రైలు, రోడ్డు మార్గాల ద్వారా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఈవో విజయ రామారావు, ఆలయ సిబ్బంది. బాసర సీఐ కిరణ్, ఏర్పాట్లు చేశారు.

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సక్రమంగా అమలు చేయాలి: కలెక్టర్ అభిలాష అభినవ్ 

చిత్రం న్యూస్, నిర్మల్ : జిల్లాలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్దేశిత ప్రణాళిక ప్రకారం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేపటి రోజున గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో, గ్రామ, వార్డు సభలను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సభల్లో ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని, వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను వెల్లడించాలని ఆదేశించారు.

గ్రామ సభలకు హాజరయ్యే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా నిర్ణీత సమయంలో సభలను ముగించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు పథకాల అమలు తీరును తెలియజేయడం ద్వారా కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుందని ఆమె తెలిపారు. అధికారులు సమర్థవంతంగా పనిచేసి, ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని, తద్వారా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు

ఆశా వర్కర్ పద్మకు న్యాయం చేయాలి: సీఐటీయూ 

చిత్రం న్యూస్, నిర్మల్: ఖానాపూర్ మండలం సోమరిపేట్ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ పద్మకు న్యాయం చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) నిర్మల్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. గ్రామస్తులు వెలివేసిన ఒక గర్భిణికి సేవలు అందించినందుకు ఆమెను ఏఎన్‌ఎమ్ చంద్రకళ అసభ్య పదజాలంతో దూషించిందని, దీనితో పద్మ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని యూనియన్ ఆరోపించింది. ఆదివాసీ గ్రామానికి చెందిన ఓ మహిళను గ్రామస్తులు వెలివేయడం జరిగిన సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు పి.గంగమణి పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో అక్కడ పనిచేస్తున్న ఏఎన్‌ఎమ్ చంద్రకళ ఆ మహిళకు వైద్య సేవలు అందించవద్దని ఆశా వర్కర్ పద్మకు ఆదేశించడం అత్యంత అమానుషమని విమర్శించారు.గర్భిణికి 9 నెలలు నిండిన తర్వాత నొప్పులు రావడంతో ఆశా వర్కర్ పద్మ తన బాధ్యతగా స్పందించి అంబులెన్స్‌ను పిలిపించి ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేయించారు. ఇది ఆశా వర్కర్ పద్మ మానవత్వానికి, విధి నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు అనంతరం, ఏఎన్‌ఎమ్ చంద్రకళ ఫోన్‌లో ఆశా వర్కర్ పద్మను అసభ్య పదజాలంతో దూషించిందని ఆరోపించారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక పద్మ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం చాలా బాధాకరమని యూనియన్ నాయకులు తెలిపారు. ఆశా వర్కర్ పద్మపై దుర్వినియోగానికి పాల్పడిన ఏఎన్‌ఎమ్ చంద్రకళపై తక్షణ చర్యలు తీసుకోవాలని, పద్మకు పూర్తి రక్షణ కల్పించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి. సుజాత డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు భయపడకుండా విధులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.