Home Blog Page 49

బాసర  ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిసి మంత్రి జూపల్లి భోజనం

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని ప్రతిష్టాత్మక బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని (RGUKT) రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి మెస్‌లో రాత్రి భోజనం చేశారు. విద్యార్థుల మధ్య కూర్చున్న మంత్రి, వారికి వడ్డిస్తున్న ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు.

భోజనం నాణ్యతపై ఆరా..భోజనం చేస్తున్న సమయంలో విద్యార్థులతో మంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. రోజువారీ మెనూ ప్రకారం భోజనం అందుతోందా? అని ఆరా తీశారు. కూరగాయలు, భోజనం నాణ్యత ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నారు. దీనిపై విద్యార్థులు స్పందిస్తూ.. ప్రతిరోజు తమకు అందుతున్న భోజన వివరాలను, క్యాంపస్‌లో కల్పిస్తున్న ఇతర సదుపాయాలను మంత్రికి వివరించారు. విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా చూడాలని అధికారులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.

అధికారుల బృందం పర్యవేక్షణ..మంత్రి జూపల్లితో పాటు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ట్రిపుల్ ఐటీ వై స్ ఛాన్సలర్ గోవర్ధన్ తదితర ఉన్నతాధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, వారికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న శాయంపేట మాజీ సర్పంచి వలుపదాసు చంద్రమౌళి

చిత్రం న్యూస్, శాయంపేట: శాయంపేట గ్రామ మాజీ సర్పంచ్, శాయంపేట గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వలుపదాసు చంద్రమౌళి శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, వారికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమౌళి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో శాయంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బాసాని శాంత – రవి తన పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు.

తెలంగాణను దక్షిణాసియాలో టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

ATEXCON-2026 సదస్సులో పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

చిత్రం న్యూస్, హైదరాబాద్: వస్త్ర పరిశ్రమ రంగంలో తెలంగాణను 2047 నాటికి దక్షిణాసియాలోనే అగ్రగామి టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. టెక్స్‌టైల్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన విజన్‌కు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చగల వాతావరణాన్ని కల్పించేందుకు పారిశ్రామిక వేత్తలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (CITI) సంయుక్తంగా నిర్వహించిన 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సు (ATEXCON-2026)లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ATEXCON-2026 నివేదికను విడుదల చేశారు. సదస్సులో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు, జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ ఎగ్జిబిషన్‌ను సీఎం మంత్రులతో కలిసి సందర్శించారు. సదస్సులో మాట్లాడుతూ.. “అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర భారతదేశానికి ఉంది. శతాబ్దాలుగా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు టెక్స్‌టైల్స్ రంగాన్ని పరిపుష్టం చేశాయి” అని అన్నారు. నిజాం కాలంలో ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేసేవారని గుర్తుచేశారు. “టెక్స్‌టైల్స్ మా డీఎన్ఏలో భాగం” అని పేర్కొన్నారు.

తెలంగాణలో పత్తి ఉత్పత్తి, నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వంటి సంప్రదాయాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉందని వివరించారు. టెక్స్‌టైల్ రంగం రాష్ట్రంలో పరిశ్రమ మాత్రమే కాకుండా ప్రజల జీవనాధారమని అన్నారు.

వరంగల్‌లో ప్రపంచ స్థాయి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసి, అనేక అప్పరెల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని సీఎం వెల్లడించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ ద్వారా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం లక్ష్యమని పేర్కొన్నారు. పరిశ్రమల కోసం భూమి, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని, అనుమతులను వేగంగా మంజూరు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ పోటీకి అనుగుణంగా విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. “తెలంగాణలోని పత్తి పొలాల నుంచి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ ర్యాంప్‌ల వరకు అనుసంధానం కావాలి” అని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

హైదరాబాద్ గ్లోబల్ సినిమా హబ్‌గా ఎదుగుతోందని, ఇటీవల నెట్‌ఫ్లిక్స్ స్టూడియోలను ప్రారంభించినట్లు తెలిపారు. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ కూడా హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుంటోందని, సినిమా రంగానికి అనుబంధంగా ఫ్యాషన్ పరిశ్రమను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో డిజైన్, కట్టింగ్, స్టిచింగ్ రంగాల్లో యువతకు, ముఖ్యంగా మహిళలకు శిక్షణ అందిస్తామని వెల్లడించారు.

“ప్రపంచంలోని ప్రతి దేశం తెలంగాణలో తయారైన దుస్తులను ధరించేలా చేయడం మా లక్ష్యం. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో అందరూ భాగస్వాములు కావాలి” అని సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు

ఫిట్నెస్ లేని సాని డంపర్లను నిలిపివేసిన డిప్యూటీ డైరెక్టర్ మైన్ సేఫ్టీ

0

చిత్రం న్యూస్, నిర్మల్: సింగరేణి మణుగూరు ఏరియా పీకే ఓసి సెక్షన్-2 లో పనిచేస్తున్న విపిఆర్ దుర్గ (డీఐఎంపీఎల్) ఓబీ కంపెనీలో ఆదివారం జరిగిన ప్రమాద సంఘటన నేపథ్యంలో డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ దిలీప్ కుమార్ రక్షణ తనిఖీ చర్యలు చేపట్టారు. ఈ తనిఖీలలో లో గుర్తించిన ఫిట్నెస్ సర్టిఫికేట్,  అవసరమైన అనుమతులు లేని సుమారు వందకి పైగా సానీ డంపర్లను నిలిపివేశారు. గురువారం (రెండో తేదీ ) సెకండ్ షిఫ్ట్ బ్లాస్టింగ్ తర్వాత మొత్తం వాహనాల్లో కేవలం ముప్పై ఐదు భారీ డంపర్ లకే ఫిట్నెస్ అనుమతులు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన ఫిట్నెస్ లేని వాహనాల పనులను పూర్తిగా పార్కింగ్ యార్డ్కే పరిమితం అయ్యేలా నిలిపివేశారు.

ఈ ప్రమాద సంఘటన ఒక ఓబి వర్కర్ చనిపోయిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు, ప్రమాద సంఘటనలు పునారవృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అనుక్షణం కార్మికులను సూపర్వైజర్లను అప్రమత్తం చేయాలని , వ్యక్తిగత రక్షణ పరికరాల ధరింపు, పని స్థలాలలో రక్షణ చర్యలు,హాల్ రోడ్స్, లైటింగ్, వాటర్ స్ప్రేయింగ్ తదితర అంశాలలో ప్రమాదాలు నివారణకు చేపట్టవలసిన రక్షణ చర్యలకు సంబంధించి తగు సూచనలతో కూడిన ఆదేశాలు ఓబి యాజమాన్యానికి జారీ చేసినట్లు తెలిసింది, అలాగే పర్యవేక్షణకు సంబంధించి సింగరేణి యాజమాన్యానికి కూడా తగు ఆదేశాలు అనగా కోల్ మైన్స్ రెగ్యులేషన్ (సిఎంఆర్ 2017) నిబంధనల ప్రకారం రక్షణ సూత్రాలు పాటించాలని ప్రతిరోజు క్రమం తప్పకుండా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ (యస్ యం పి) స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (యస్ ఓ పి) ప్రకారం గనిలో పనిలో గ్యారేజీలో అట్టి ఆదేశాలు అమలు చేయాలని లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

చిత్రం న్యూస్, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ పట్టణంలోని రోస్ గార్డెన్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క సమావేశానికి అధ్యక్షత వహించారు. సమావేశానికి ముందు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్‌లకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సుగుణక్క ఘన స్వాగతం పలికి, శాలువాలతో సన్మానించారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సుగుణక్క అందజేశారు.

ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చిన్నదైనా ప్రాముఖ్యత కలిగిన జిల్లాగా అభివర్ణించారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లా మళ్లీ అదే దిశగా సాగుతోందని తెలిపారు.రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రజల సమస్యలను తెలుసుకుని, వారికి న్యాయం చేయాలనే లక్ష్యంతో జరిగిందని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, పార్టీలో 70 శాతం నాయకత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దక్కిందని తెలిపారు.

గ్రామాల అభివృద్ధి దేశ అభివృద్ధికి మూలమని గాంధీ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఉన్నత పదవులు కల్పించిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో భారీ అప్పులు పెరిగాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తోందన్నారు. రైతు రుణమాఫీ విషయంలో గతంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉపశమనం కల్పించిందని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కలుగుతోందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా దీనిని అంగీకరిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100కి పైగా సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు సాధిస్తుందని, ప్రజలు అభివృద్ధి వైపు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారని, భవిష్యత్తులో విమాన సదుపాయం కూడా అందుబాటులోకి రానుందని తెలిపారు.

కుమురం భీం జిల్లాలో అవసరమైన పరిశ్రమలను స్థాపించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు బలంగా ఉందని, రాబోయే 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ,..జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని స్థాయిల్లో కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేస్తున్నామని చెప్పారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్‌కు బలమని, వారి కృషితోనే విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత పెంచుతామని, జిల్లా వ్యాప్తంగా పార్టీని మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి

* రూ.5లక్షల ఎల్.ఓ.సి లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతిరెడ్డి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని నిజమాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన పాముల లలిత అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శస్త్రచికిత్స నిమిత్తం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో రూ.5లక్షలకు సంబంధించి ఎల్.ఓ.సి లెటర్ ను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మేల్యే తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అందజేశారు.ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ నెల 4,5 తేదీల్లో ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ లో బిగ్ స్క్రీన్ పై ఐపీఎల్ మ్యాచ్ లు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఐపీఎల్ క్రికెట్ అంటే ఇష్టపడని అభిమానులు ఉండరు. పట్టణాలలోని స్టేడియంలోకి వెళ్లి చూసి ఆనందించే అవకాశం తక్కువ మందికే ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా స్టేడియంలోకి వెళ్లి చూడాలని నిరాశ చెందే అభిమానుల కోసం దేశవ్యాప్తంగా 50 నగరాలలో ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ ఆపరేషన్ మేనేజర్ వికాస్ పండిట్ తెలిపారు.జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ గురించి వివరించారు.జిల్లా కేంద్రంలో ఈ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయడం ఇది నాలుగో సారి అని ఆయన తెలిపారు. ఎటువంటి రుసుము చెల్లించకుండా ప్రత్యక్ష అనుభూతిని పొందవచ్చు అని తెలిపారు.ఈ ఫ్యాన్ పార్కులో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, కేవలం రూ.100 తక్కువ ఛార్జీలు విధించబడతాయని తెలిపారు.ఇట్టి ఫ్యాన్ పార్క్ లో శని, ఆదివారాలలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లు బిగ్ స్క్రీన్ పైన లైవ్ మ్యాచ్ లు చూపించబడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వెంకట్ రెడ్డి, మేనేజర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు.

అటవీ అధికారులకు తాబేలును అప్పగించిన రైతు వెంకటేశ్వర రావు 

చిత్రం న్యూస్, పెనుబల్లి : ఖమ్మం జిల్లా  పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన రైతు తగరం వెంకటేశ్వరరావు తన పొలంలో పనిచేస్తుండగా ఒక అరుదైన తాబేలు కనిపించింది. సాధారణంగా ఈ తాబేలు ప్రత్యేక లక్షణాలతో ఉండటంతో ఆయన దానిని జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చారు. అనంతరం ఆ తాబేలు గురించి సంబంధిత అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని తాబేలును స్వాధీనం చేసుకున్నారు. ప్రకృతి సంపదను కాపాడే బాధ్యతతో తగరం వెంకటేశ్వరరావు వ్యవహరించిన తీరు ప్రశంసనీయమని అధికారులు తెలిపారు. తాబేలును సురక్షిత ప్రాంతానికి తరలించి, అవసరమైన సంరక్షణ చర్యలు చేపడుతామని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. అడవి జంతువులను గుర్తించినప్పుడు వాటిని స్వయంగా సంరక్షించకుండా అధికారులకు అప్పగించడం ఎంతో ముఖ్యమని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా రైతు తగరం వెంకటేశ్వరరావుని అటవీశాఖ అధికారులు అభినందిస్తూ, ఇలాంటి బాధ్యతాయుత చర్యలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఘనంగా ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్

చిత్రం న్యూస్,నల్లబెల్లి: దేశ సేవకే అంకితమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అని, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి సమగ్ర మానవతా దృక్పథమే దేశ నిర్మాణానికి మార్గదర్శకమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. నల్లబెల్లి మండలంలోని మేడపల్లి గ్రామంలో గల యశోద ఫంక్షన్ హాల్‌లో మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ అధ్యక్షతన ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్’ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల్లో సైద్ధాంతిక స్పష్టత పెంపొందించడం, సంస్థాగత బలోపేతం,  ప్రజలతో మమేకం కావడంపై కీలక దిశానిర్దేశం చేశారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను బూత్ స్థాయి నుండి ప్రజలకు వివరిస్తూ, రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచంద్ర రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి, రంగాపురం సర్పంచ్ ఓరుగంటి మాధవి రాజు, మండల ప్రధాన కార్యదర్శులు ఈర్ల నాగరాజు, తిరుపతి, మండల ఉపాధ్యక్షులు గుర్రపు నరేష్, బత్తిని కుమారస్వామి, యాదగిరి, మండల కార్యదర్శి ఓదెల అశోక్, కోశాధికారి మురికి మనోహర్, సీనియర్ నాయకులు వల్లే పర్వతాలు, బచ్చు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్ మందిరానికి గడియారం విరాళంగా అందజేత 

చిత్రం న్యూస్, సాత్నాల: ఆధ్యాత్మిక మార్గంలో హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. శుక్రవారం తమ సొంత గ్రామమైన జామ్ని లోని హనుమాన్ మందిరానికి కుమ్ర జగదీష్, సునీల్, ఇతర దీక్షా స్వాములు కలిసి ఒక పెద్ద గడియారాన్ని విరాళంగా అందజేశారు. స్వామివారి సేవలో భాగంగా ఈ విరాళం అందించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. వీరి చొరవను ఆలయ కమిటీ, గ్రామస్తులు అభినందించారు.