చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగొట్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో శనివారం సిబ్బంది దాడి చేశారు. ఆయన మాట్లాడుతూ..పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుండి నాలుగు వాహనాలు, మూడు సెల్ఫోన్లు, రూ.10,940 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుబడిన వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
సెల్ ఫోన్ కోసం హత్య.. నిందితుడిని రిమాండ్ కి తరలింపు
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: సెల్ ఫోన్ కోసం తోటి కూలీనే హత్య చేసి పరారైన నిందితుడిని పట్టుకొని శనివారం అరెస్ట్ చేసే రిమాండ్ కి తరలించినట్టు కామారెడ్డి సబ్ డివిజనల్ ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఆమె మీడియాకి వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్లో గత ఫిబ్రవరిలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం మొబైల్ ఫోన్, నగదు కోసం తోటి కూలీని అత్యంత కిరాతకంగా హతమార్చిన నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. గత ఫిబ్రవరి 12న రాత్రి సమయంలో, కామారెడ్డి బస్టాండ్ ఎంక్వయిరీ కౌంటర్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య మొబైల్ ఫోన్ విషయం పై ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని అర్ని తలోక్ జిల్లా పంగిడి కి చెందిన నిందితుడు ఆకాష్ నాగురావ్ కోవె బాధితుడైన శ్రీనివాస్ (కూలీ) ముఖం, ఛాతిపై విచక్షణారహితంగా దాడి చేసి, కింద పడేసి చంపాడు. అనంతరం బాధితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్, రూ.300 నగదును దోచుకుని అక్కడి నుండి పరారయ్యాడు. ఈ విషయం పై బస్టాండ్ కంట్రోలర్ షెర్ల సత్య గౌడ్ ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారించగా అతను తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని, నిందితుడిని కోర్టులో రిమాండ్ చేసినట్లు తెలిపారు.
ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఫులే స్మృతి వనం:అఖిల భారతీయ మాలీ మహాసంఘం హర్షం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో రూ. 4 కోట్ల నిధులతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ ఫులే స్మృతి వనాన్ని’ ఈ నెల 11న మహాత్మా జ్యోతిభా ఫులే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనుండటం పట్ల అఖిల భారతీయ మాలీ మహాసంఘం హర్షం వ్యక్తం చేసింది. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే, ప్రధాన కార్యదర్శి సాంబన్న షిండే తదితరులు మాట్లాడారు. సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిబా ఫులే, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే దంపతుల విగ్రహాలను ట్యాంక్ బండ్పై ప్రతిష్టించాలని తాము గత అనేక ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. గత ఏడాది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం సమర్పించగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించి స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఘనంగా ఫూలే జయంతి వేడుకలు: ప్రతి ఏటా రాష్ట్రంలోని 33 జిల్లాలకు రూ. 20 లక్షల నిధులను మంజూరు చేసి అధికారికంగా ఫూలే జయంతి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని వారు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అదనంగా రూ.లక్ష నిధులు విడుదల చేసి, ఈ ఏడాది కూడా జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కోరారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని, ఫులే దంపతులు కలలుగన్న సమసమాజ నిర్మాణం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాలీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అంబేకర్, ప్రధాన కార్యదర్శి ప్రధాన్ భాస్కర్, కార్యవర్గ సభ్యులు వాడగురే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నిరుపేద కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన 67 మంది లబ్ధిదారులకు రూ.18.90 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు: ఆదిలాబాద్ ప్రజలు మెరుగైన వైద్యం కోసం మహారాష్ట్రలోని యవత్మాల్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానిక రిమ్స్ (RIMS) ఆస్పత్రిలో ఉన్న ఖాళీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. హెల్త్ కార్డుల వినియోగం మరియు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల విడుదలపై అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని, బాధితులకు న్యాయం జరిగేలా పోరాడుతామని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని, వైద్య ఖర్చులతో ఇబ్బంది పడే వారికి CMRF ఒక వరమని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మయూర్, ఆకుల ప్రవీణ్, దోని జ్యోతి, సంతోష్ స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
డ్రైవర్లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిత్యం వాహనాలు నడిపే డ్రైవర్లు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సూచించారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మోపాల్ ఎస్ హెచ్ ఓ జెడ్. సుస్మిత ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్, జీజీహెచ్ నిజామాబాద్ సహకారంతో మోపాల్లో డ్రైవర్లకు కంటి, చెవి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ.. భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు ఎల్లప్పుడూ కంటి, చెవి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్యం బాగుంటేనే వాహనాలు సక్రమంగా నడపగలుగుతామని వివరించారు. శిబిరంలో సుమారు 80 మంది డ్రైవర్లు, 30 మంది మోపాల్ గ్రామస్థులకు వైద్యులు అమర్దీపిక, శ్రవంతి, లయన్స్ క్లబ్ బృందం సభ్యులు చెవి, కంటి పరీక్షలునిర్వహించారు. అనంతరం పలువురు డ్రైవర్లకు కళ్లద్దాలు సైతం అందజేశారు. కార్యక్రమంలో సౌత్ రూరల్ సీఐ సురేష్, మోపాల్ ఎస్ హెచ్ ఓ జెడ్. సుస్మిత తదితరులు పాల్గొన్నారు.
బస్సు సౌకర్యం కల్పించాలని వినతి
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల స్వర్గం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ బస్ డిపో మేనేజర్ కు శివప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. ఆయా గ్రామాలలో బస్సు సౌకర్యం లేక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి బస్సులు రాకపోవడం, కనీస సౌకర్యాలు లేని బస్టాండ్లు, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటం వల్ల నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కీర్గుల్ (కె ), ఓని, కౌట, సాలాపూర్, అనేక గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం లేక, సకాలంలో నడవక విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.రవాణా సదుపాయం లేకపోవడంతో ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ సమస్యలపై రవాణా శాఖ, అధికారులు స్పందించి ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా బస్సులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మీసేవ ఆపరేటర్ల పాలాభిషేకం
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: తమకు కమీషన్ పెంచడంపై మీసేవ ఆపరేటర్లు హర్షం వ్యక్తం చేస్తు ఎన్టీఆర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి శనివారం పాలాభిషేకం చేశారు.. ఈ సందర్బంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.కమీషన్ పెంపుతో పాటు కొత్త ఛార్ట్ అమలు చేస్తున్నామని ఏఎంసీవోఏ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల శ్రీనివాస్, టీఎంవోఏ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ లు అన్నారు. కమీషన్ పెంపుతో పాటు కొత్త సిటిజన్ ఛార్టర్ను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. జిల్లాలోని మీసేవ ఆపరేటర్లకు సంబంధించిన రెండు యూనియన్లు టీఎంవోసీఏ, ఏఎంసీవోఏ 2025లో జేఏసీగా ఏర్పడ్డాయన్నారు. పదేళ్లుగా తమకు కమీషన్ పెంచాలని ప్రభుత్వాన్ని వేడుకుంటే పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా కమిషన్ పెంపునకు సహకరించిన సీఎం రేవంత్రెడ్డికి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మీసేవ కమిషనర్ రవి కిరణకు జిల్లా యూనియన్ల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెరిగిన కమిషన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పెద్దోళ్ల కిషోర్, ధర్మానందం, జీవీఆర్, శివకుమార్, విశ్వనాథ్, సంతోష్, మహమ్మద్ నజీర్ అహ్మద్, సయ్యద్ ఉబేద్ హైమద్, చింత రాజు, పెద్దోళ్ల రమేశ్వర్, తిరుపతి, శివకుమార్, పల్లికొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కప్ పోటీల్లో అమ్మాయిలు అదరగొట్టడం అభినందనీయం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
సీఎం కప్ బేస్ బాల్ బాలికల పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన నిజామాబాద్ జట్టు
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీసేందుకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీఎం కప్ పోటీల్లో నిజామాబాద్ బేస్ బాల్ బాలికల జట్టు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి అన్నారు. ఇటీవల సీఎం కప్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో లో నిర్వహించగా.. నిజామాబాద్ నుంచి బేస్ బాల్ బాలికల జట్టు కెప్టెన్ ఇందు నేతృత్వంలో అత్యుత్తమ ప్రదర్శనతో ఘన విజయం సాధించారు. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కప్ ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో విజేతగా నిలిచిన బాలికల జట్టు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డినిక్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జట్టు కోచ్ అనికేత్,బేస్ బాల్ జిల్లా కార్యదర్శి వినోద్,తో పాటు సహకారం అందించిన సాఫ్ట్ బాల్ జిల్లా కార్యదర్శి గంగామోహన్ లను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. రాబోవు రోజుల్లో బాలికలను క్క్రీడల్లో ప్రోత్సహించాలని తద్వారా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. బాలికలు ఉన్నత విద్య తో పాటు క్రీడల్లో రాణించి గొప్ప గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ధర్మపురి సంజయ్కి పదవి ఇవ్వాలని నిరాహార దీక్ష
చిత్రం న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో: మాజీ మంత్రి డీఎస్ తనయుడు, నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్కు పదవి ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్న డి.సంజయ్కు గుర్తింపు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆయన అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా కృషి చేశారన్నారు. ఆయన సేవలను గుర్తించి పదవి ఇవ్వాలని వారు కోరారు. ధర్మపురి సంజయ్ ఏ పార్టీలో ఉన్నా తాము ఆయన వెన్నంటే ఉంటామన్నారు. నిరాహార దీక్షలో సంజయ్ అభిమానులు ఆకుల చిన్న రాజేశ్వర్, ఆమందు వెంకటేష్, కపిల్, పుప్పాల భాజన్న, సక్కి విజయ్, పుప్పాల విజయ, సందీప్, రణధీర్, రింపు, తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
* ఇద్దరు అన్నదమ్ములు మృతి, ఐదుగురికి గాయాలు
చిత్రం న్యూస్, హనుమకొండ: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మసాగర్ మండలం దేవనూరు సమీపంలో జరిగిన ఈ ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. కారు అతివేగంతో వెళ్తూ అదుపుతప్పి చెట్టును ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది.
మృతులను జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల శివ, లోకేష్లుగా గుర్తించారు. వీరిద్దరూ అన్నదమ్ములని తెలియడంతో నర్సాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగం, అజాగ్రత్తతో వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
