Home Blog Page 42

డీసీఓ నర్సయ్య కుటుంబానికి అధికారుల ఆర్థిక సాయం 

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో : జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన డిప్యూటీ కలెక్టర్ కార్యాలయ (డీసీఓ) అధికారి నర్సయ్య కుటుంబానికి మంగళవారం జిల్లా అధికారులు ఆర్థిక సహాయం అందించారు. కలెక్టర్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా చెక్కులు, నగదు అందజేశారు. జిల్లా అధికారుల సంఘం తరపున అందించిన ఆర్థిక సహాయాన్ని నర్సయ్య కుటుంబ సభ్యులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం, అధికారులు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీపీవో జీవరత్నం, డీఆర్డీవో జయలక్ష్మి, ఎస్టీఓ సరోజ, డీపీఓ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, పలు సంక్షేమ శాఖల అధికారులు, డీసీఎస్ఓ రాజేందర్, డీఎం ఇండస్ట్రీస్ నరసింహా రెడ్డి తదితరులు ఆర్థిక సహాయం అందించడంలో పాలుపంచుకున్నారు.

రాజురా వీడీసీ నూతన కమిటీ ఎన్నిక

  1. చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో : లోకేశ్వరం మండలం రాజురా గ్రామంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ (వీడీసీ) నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా సుందరగిరి ముత్తా గౌడ్, ఉపాధ్యక్షుడిగా నర్సింగ్ రావు ఎన్నికయ్యారు. కోశాధికారిగా జిలకర సాయి ప్రసాద్, జాయింట్ కోశాధికారిగా తమ్మరాశి గంగాధర్, రైటర్‌గా టీకే శ్రీనివాస్ ఎంపికయ్యారు. వీరు కమిటీ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించనున్నారు. నల్లల రాజు చైర్మన్‌గా వైస్ చైర్మన్‌గా ముజాహిద్ ఎన్నికయ్యారు.గ్రామస్తులు, ప్రముఖులు నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.

సాయిరాం మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి : కుటుంబ సభ్యుల ధర్నా

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో (మామడ):  మండలంలోని దిమ్మదుర్తి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిరాం చనిపోలేదని వాహనంతో ఢీ కొట్టి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై ధర్నా చేశారు ఈ ఘటన స్థలాన్ని సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ పోలీసు సిబ్బందితో చేరుకొని బాధితులతో మాట్లాడి అతని  మృతికి కారకులైన వారిని పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు

సురెల్లి గ్రామంలో మొక్క జొన్న పంట దగ్ధం 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలం సురేల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ఆరుగాలం పండించిన రైతు పంట నేల పాలయింది. సురెల్లి గ్రామానికి చెందిన రైతు ఆనంద్ తన పంట దగ్ధం కావడంతో  కంటతడి పెట్టారు. మొక్క జొన్న పంట షార్ట్ సర్క్యూట్ కారణమా. లేక ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టరా అని కోణంలో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఒక ఎకరం పంట విలువ రూ.80 వేల నష్టం కలిగిందని రైతు తెలిపారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.

లేఖర్ వాడలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

చిత్రం న్యూస్, భోరజ్: హిందూ ధర్మ పరిరక్షణ, సామజిక మరసత లక్ష్యంగా లేకర్వాడ ఉప మండలం (లేకర్వాడ, కౌట, సాంగ్వి, పెండల్వాడ, సావాపూర్, బాలాపూర్, ఆకుర్ల గ్రామాలు) ఆధ్వర్యంలో ‘హిందూ సమ్మేళనం’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11 న లేకర్వాడలోని విఠల్ రుక్మిణి ఆలయ ప్రాంగణంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుంది. ఉదయం 10:15 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ సమ్మేళనం కొనసాగుతుంది. లోక కల్యాణం కోసం భక్తులందరితో కలిసి సామూహిక పారాయణం, శాంతి, సౌభాగ్యాల కోసం ప్రత్యేక హోమం జరగనుంది.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా శ్రీ యోగానంద సరస్వతి (గోపాల కృష్ణ మఠం పీఠాధిపతి), ముఖ్య అతిథిగా శ్రీ విశోక తీర్థ స్వామి (శ్రీ సత్యానంద ఆశ్రమం), ప్రధాన వక్తగా శ్రీ డారావినూతల శశిధర్ (VHP జాతీయ అధికార ప్రతినిధి) విచ్చేసి భక్తులకు దిశానిర్దేశం చేయనున్నారు. హిందూ సమాజంలో ఐక్యతను చాటేందుకు కులమతాలకు అతీతంగా హిందూ బాంధవులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని హిందూ సమ్మేళన నిర్వహణ సమితి కోరింది.

పూసం కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్న ఆత్రం సుగుణ

చిత్రం న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో ( జన్నారం): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కొమ్ముగూడెం గ్రామంలో జరిగిన పూసం కుటుంబ వివాహ వేడుకకు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కుమురం భీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించిన సుగుణ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ, వివాహ వేడుకలో పాల్గొన్న బంధుమిత్రులతో కాసేపు గడిపారు. స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు, పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ

చిత్రం న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో ( సిర్పూర్ (టి) ):  మండల కేంద్రంలోని సీడీపీఓ ఆఫీసు ప్రాంగణంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు, పిల్లలకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్ల, ఆయాల గౌరవ వేతనం పెంచాలని తాను అసెంబ్లీలో డిమాండ్ చేశానని, ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపడుతుందని తెలిపారు.విపరీతమైన పని ఒత్తిడితో సతమతం అవుతున్న అంగన్వాడీ టీచర్లకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపిఓ విజయలక్ష్మి, సూపర్ వైజర్ పద్మ, ఎమ్మార్వో రహీముద్దీన్, ఎంపీడీఓ సత్యనారాయణ, సర్పంచ్లు ఒడ్డేటి నాగమణి నానయ్య, లావణ్య, ఉప సర్పంచ్ దుర్గం ప్రశాంత్, అన్ని మండలాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, నాయకులు రాచర్ల మహేష్, రాజశేఖర్, జాగరి రమేష్, శేఖర్, శ్యామ్ రావు, సంతోష్, బాలాజీ, బాబు, మహేష్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి రమేష్ వెల్లడించారు. నిజామాబాద్ నగరంలో వరల్డ్ మెడికల్ డే సందర్భంగా మంగళవారం ఉదయం నిర్వహించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ర్యాలీ, ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి పరేడ్ గ్రౌండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథులుగా నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, తెలంగాణ స్టేట్ ఐఎంఏ ప్రెసిడెంట్ వైద్యులు కిషన్ పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

అనంతరం పరేడ్ గ్రౌండ్ లో మున్సిపల్ ఉద్యోగుల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పలువురు వైద్యులు సేవలందించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.మున్సిపల్ కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ముఖ్య అతిథులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి: ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఓ డివిజన్ కార్పొరేటర్ రాజకీయ కక్ష సాధింపుతో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ పై పుకార్లు పుట్టిస్తూ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లకి ఫిర్యాదు చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన నిజామాబాద్ సౌత్ డివిజన్ల కార్పొరేటర్లకు సన్మానం చేయాలని సదుద్దేశంతో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ భవనము మరమ్మత్తులు జరుగుతుండడం వలన స్థానికంగా ఉన్న వాటర్ ప్లాంట్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఇట్టి వాటర్ ప్లాంట్ డాక్టర్ గ్రూప్ వారు 15 సంవత్సరములు అద్దెకు తీసుకున్నారని ఇంకా ఏడు సంవత్సరాల కాల పరిమితి మిగిలి ఉండగా తాము అనుమతితో ఇట్టి సన్మాన కార్యక్రమం నిర్వహించామని, సన్మాన కార్యక్రమంలో  ఆ కార్పొరేటర్ ను కూడా సన్మానించామన్నారు. కానీ తాను రాజకీయ బురద చల్లడం కోసం వాటర్ ప్లాంట్ ను కబ్జా చేసేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మా అసోసియేషన్ లో ఉన్న ఒక సభ్యుడిని బెదిరింపులకు పాల్పడడంతో ఐదవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం  జరిగిందని తెలిపారు.  మాకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని వారు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నరసింగరావు, కోశాధికారి రమణ గౌడ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా EMT డే వేడుకలు

చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో : నిర్మల్ జిల్లాలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) డే సందర్భంగా 108 అంబులెన్స్ సిబ్బంది ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లాలో 108 సేవలు అందిస్తున్న ప్రాముఖ్యతను గత సంవత్సరంలో 31,977 కేసులకు సేవలందించిన వివరాలను వెల్లడించారు.

ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) డేని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో 108 అంlబులెన్స్ సిబ్బంది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో EMTలు, పైలట్లు, ఇతర సిబ్బంది పాల్గొని, అత్యవసర వైద్య సేవల్లో తమ పాత్ర గురించి వివరించారు. 108 అంబులెన్స్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటూ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదాలు, గుండెపోటు, స్ట్రోక్, గర్భిణీ అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందనను అందిస్తున్నాయన్నారు.

ఈ సేవలు సమాజానికి ప్రాణాధారంగా నిలుస్తున్నాయని సిబ్బంది తెలిపారు. EMTలు సంఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించి, రోగిని స్థిరపరిచి ఆసుపత్రికి తరలించడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు . గోల్డెన్ అవర్‌లో అందించే సేవలు అనేక ప్రాణాలను కాపాడుతున్నాయని వారు పేర్కొన్నారు. గత సంవత్సరంలో నిర్మల్ జిల్లాలో 108 సేవలు 31,977 అత్యవసర కేసులకు సేవలందించాయి. ప్రమాద బాధితులు, గర్భిణులు, గుండె, స్ట్రోక్ రోగులకు అందించిన సేవలు వేలాది మందికి ఉపకరించాయి. ప్రోగ్రామ్ మేనేజర్ శ్రీ N. జనార్ధన్ ఈఎంఈ లింగాచారి మాట్లాడుతూ, EMTలు అంకితభావంతో పనిచేస్తున్నారని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.