చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర సూరెళ్లి గ్రామంలో ఆనంద్ అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైందని, రైతును రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బాసర మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కోర్వ శ్యామ్ డిమాండ్ చేశారు. ముథోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యులు డాక్టర్ కొమ్రేవార్ ఆదేశాల మేరకు రైతు వద్దకు చేరుకుని తమ పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని రైతుకు భరోసా కల్పించారు. కష్టపడి చేతికి వచ్చిన పంట పూర్తిగా దగ్ధం కావడంతో స్థానిక ఎమ్మార్వో పవన్ చంద్రకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. రైతు పంట నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రెవెన్యూ అధికారులకు పార్టీ నేతలు కోరారు. వెంట శ్రీనివాస్ ,మంతెన పోశెట్టి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ ఇద్దరికి జైలు శిక్ష, ఏడుగురికి జరిమానా
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపిన తొమ్మిది మందిలో ఇద్దరికీ జైలు శిక్ష, ఏడుగురికి కోర్టు జరిమానా విధించింది ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు బుధవారం పి.ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహింఛారు. అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఏడుగురికి జరిమానా విధించారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ తెలిపారు
ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరం
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ నిజామాబాదు వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ( మహిళలకు క్యాన్సర్ సంబంధించిన) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది 24/7 విధినిర్వహణలు నిర్వహిస్తూ తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు ఎల్లప్పుడూ తీసుకోవాలని అందుకోసం డా. సూచనలు, సలహాలు పాటించాలన్నారు. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం గురించి వివరించారు. క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించడం ద్వారా చికిత్స సులభం అవుతుందని ప్రతి ఒక్కరూ నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఆరోగ్యం బాగున్నప్పుడే విధి నిర్వహణకు తమ శరీరం సహకరిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సిబ్బంది ఎల్లప్పుడూ మందులు వాడే బదులు ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లయితే ఆరోగ్యానికి ఎలాంటి హాని కలవకుండా ఉంటుందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి ఫ్రూట్స్ వివిధ రకాల ఫ్రూట్స్ నుండి అన్ని రకాల జాగ్రతలు తీసుకొని వాటిని వాడాలని తెలిపారు. మన శరీరమునకు ఏ ఆహారం తింటే జీర్ణం అవుతుందో అదే ఆహారాన్ని తీసుకోవాలని అంతేకానీ జీర్ణం కానీ ఆహారము తీసుకొని బాధపడకూడదు అని అన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని , ప్రతి ఆరు నెలలకు ఒకసారి సిబ్బంది తమ ఆరోగ్యాన్ని సంబంధిత డాక్టర్లకు చూయించుకోవాలని , డాక్టర్ల సూచనలు సలహాలు తప్పనిసరి పాటించాలని కోరారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి క్యాంపు నిర్వహించడం ఎంతో శోభదాయకమని భవిష్యత్తులో ఇలాంటి క్యాంపులు ఇంకా అనేక నిర్వహించాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ వైద్య విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. 30 సంవత్సరాల పైబడిన మహిళలు మూడు సంవత్సరాలకు ఒక సారి పంప్స్మీర్ పరీక్ష, 40 సంవత్సరాలు పైబడిన మహిళలు రెండు సంవత్సరాలకు ఒక సారి మామోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి, అదనపు డీసీపీ (సి.ఏ.ఆర్) కె.రాంచందర్ రావ్ , పోలీస్ యూనిట్ డా. సరళ, డా.అమర్ దీపిక (మెడికల్ డైరెక్టర్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్), డా.పి.అరవింద్ (రేడియేషన్ ఒంకలోజిస్ట్), డా. శైలజ (గైనకాలజిస్ట్), డా.రితిక ( డీఎమ్ఓ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్), డా. రవీంద్రనాథ్ సూరి (సీనియర్ డా. ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ) , మధు (స్క్రీనింగ్ క్యాంపు కోఆర్డినేటర్), నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ పోలీస్ స్టేషన్ మహిళా సిబ్బంది, పోలీస్, రేంజ్ కార్యాలయం మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ నూతన కార్యాలయ భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ప్రారంభించారు. కార్యాలయంలోని ఆయా విభాగాలను సందర్శించి వసతులను పరిశీలించారు. అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు పూర్తి పారదర్శకంగా, సమర్ధవంతంగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఇంచార్జి రూరల్ తహసీల్దార్ వినయ్ సాగర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రమణ్ రెడ్డి, శ్రీనివాస్ రావు, విజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.
పోచంపాడ్లో కత్తిపోట్ల ఘటన: యువకుడి దారుణ హత్య
చిత్రం న్యూస్, నిజామాబాద్ జిల్లా బ్యూరో: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో పాత వివాదాల నేపథ్యంలో జరిగిన కత్తిపోట్ల ఘటనలో రిషిక్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.పోచంపాడ్ గ్రామంలో వేణు కుటుంబానికి, నర్సింలు కుటుంబానికి మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్య పరిష్కారానికి రిషిక్ నర్సింలు ఇంటికి వెళ్లగా, అక్కడ ఘర్షణ పెరిగి కత్తిపోట్లకు దారితీసింది.
నర్సింలు కుమారులైన ఉదయ్ చందు, కిషోర్, అరవింద్ కలిసి రిషిక్పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో రిషిక్ కడుపులో తీవ్ర గాయాలు కావడంతో అతన్ని నిర్మల్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో రిషిక్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. యువకుడి మృతితో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుహాసిని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించి, భద్రతను పెంచారు. పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
నేరాల నియంత్రణకు కఠిన చర్యలు: సీపీ అంబర్ కిషోర్ ఝా
చిత్రం న్యూస్, రామగుండం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల సమీక్ష, దర్యాప్తు వేగవంతం, సాంకేతికత వినియోగం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన నేర సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెండింగ్ కేసుల పరిష్కారం, కొత్త కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, వారెంట్ల అమలు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. దర్యాప్తులో జాప్యంపై ఆరా తీసి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందించడానికి న్యాయాధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.నేరాల ఛేదనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, రికవరీ శాతాన్ని పెంచాలని సీపీ సూచించారు. చోరీలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లు తెరవాలని, నేరాలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని, ప్రజల భాగస్వామ్యంతో వీటిని విస్తరించాలని ఆదేశించారు. ఇప్పటికే ఉన్న కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ప్రమాదకర ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, సంబంధిత శాఖల సహకారంతో నివారణ చర్యలు చేపట్టాలని సీపీ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడానికి “అరైవ్-అలైవ్” కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, వారి ఫిర్యాదులపై సత్వర స్పందన ఇవ్వాలని ఆదేశించారు.గంజాయి, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీపీ ఆదేశించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాల ద్వారా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీని సీజ్ చేసిన పోలీసులు
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీని సీజ్ చేసిన పోలీసులు
చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో (ముధోల్ ) :మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని ముథోల్ పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించి, వాహనాన్ని సీజ్ చేశారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి తానూరుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ముందస్తు సమాచారం అందిన నేపథ్యంలో ఎస్సై షేక్ జుబేర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా, సదరు లారీలో ఎటువంటి రవాణా అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత, పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించిన తదుపరి విచారణ చర్యల కోసం వాహనాన్ని తహసీల్దార్ కు అప్పగించారు.ఈ సందర్భంగా ఎస్సై జుబేర్ మాట్లాడుతూ, చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం ఛారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఇసుక ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఎవరికి తరలిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు
నిర్మల్ జిల్లాలో గాంజా గస్తీ కార్యక్రమం: యువత అప్రమత్తంగా ఉండాలి
నిర్మల్ జిల్లాలో గాంజా గస్తీ కార్యక్రమం: యువత అప్రమత్తంగా ఉండాలి
చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో: నిర్మల్ జిల్లాలో గాంజా, మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖ చేపట్టిన గాంజా గస్తీ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, జిల్లా ఎస్పీ డా.జి.జానకీ షర్మిల యువతకు కీలక సూచనలు చేశారు.జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న గాంజా గస్తీ కార్యక్రమం ద్వారా ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు గాంజా వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ మత్తు పదార్థాలు ఆరోగ్యంపై, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఎస్పీ తెలిపారు. యువత గాంజా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తమ భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు. అప్రమత్తంగా ఉండటమే కాకుండా అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి అధికారులకు సమాచారం అందించాలని ఆమె కోరారు. గాంజా విక్రయం లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు సంప్రదించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో మత్తు పదార్థాల ప్రభావాన్ని తగ్గించేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.
బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురికి జైలు శిక్ష
* వివరాలు వెల్లడిస్తున్న బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిస్తున్న ముగ్గురికి కోర్టు జైలు శిక్ష విధించింది.పెగడపల్లి గ్రామానికి చెందిన వై. వెంకట రమణకు రూ. 10 వేల జరిమానాతో పాటు నాలుగు రోజుల జైలు శిక్ష, పట్టణంలోని రాకసి పేట్ కు చెందిన బాలచందర్ కురూ.10 వేల జరిమానాతో పాటు రెండు రోజుల శిక్ష,అబ్దుల్ గఫార్ కు నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి తీర్పు ఇచ్చారని బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు.ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ..మద్యం తాగి వాహనాలను నడపరాదని పోలీసులు, అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా వాహనదారుల్లో మార్పు రాకపోవడం బాధాకరమని అన్నారు.మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురికావద్దని, తాగి వాహనాలను నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
