Home Blog Page 39

జర్నలిస్టులను సన్మానించిన ఆలయ ఈవో  విజయరామారావు 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి, వాటి చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా,పత్రికలు, ఛానళ్లు,సోషల్ మీడియా పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకం, అభినందనీయమని ఆలయ ఈవో విజయరామారావు అన్నారు. ఆలయాల విశిష్టతను చాటిచెప్పడం ద్వారా భక్తులను చైతన్యపరచడంలో మీడియా సేవలందిస్తోందన్నారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆశీర్వాద మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, వేద పండితులు నవీన్ శర్మ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. వీరి వెంట ఆలయ ఏఈఓ గంగా శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ సాయిలు, పి ఆర్ ఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

రైతులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ఇటీవల అకాల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతును తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని నిజామాబాద్ రూరల్ నియోజవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి తెలిపారు. గురువారం డిచ్ పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో రైతుల పంట పొలాలను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎవరు కూడా అధైర్యపడొద్దని కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అన్నారు. పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే స్థానిక వ్యవసాయ,విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారుల ద్వారా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ మేరకు ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…ఈ నెల 4 వ తేదీన అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి నియోజకవర్గంలోని రైతుల పంట పొలాలు దెబ్బతిన్నాయని తెలిపారు. అదేరోజు తక్షణమే వ్యవసాయ,విద్యుత్, రెవెన్యూ అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. నష్టానికి సంబంధించిన వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. కానీ ప్రతిపక్ష బీజేపీ నాయకులు అనవసరపు రాద్ధాంతం చేస్తూ..చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమది రైతు ప్రభుత్వమని రైతులు కష్టాల్లో ఉంటే తప్పకుండా వారికి అండగా ఉంటామని చెప్పారు. ఘటన జరిగిన కొన్నిరోజులు కూడా కాకముందే బీజేపీ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతులు బాధల్లో ఉంటే వారికి అండగా నిలవాల్సింది పోయి చిల్లర రాజకీయాలు చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. నల్ల చట్టాలు తెచ్చి వేలాదిమంది రైతులను పొట్టనబెట్టుకున్న బీజేపీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరెక్కడా లేవన్నారు.

పంట నష్టం విషయమై ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించినట్లు తెలిపారు.తప్పకుండా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో దాదాపు 2 వేల పైచిలుకు ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. డిచ్ పల్లి మండలం సుద్దపల్లి, ధర్పల్లి లోని రామడుగు,దమ్మన్నపేట,తండాలు,సిరికొండ మండలాల్లో పంట నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులు అధైర్యపడకుండా ఉండాలని ప్రభుత్వం ఆదుకుంటుందని అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అమృతపూర్ గంగాధర్,ప్రధాన కార్యదర్శి పోసాని శ్రీనివాస్,పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్,పార్టీ నాయకులు మునిపల్లి పెద్ద సాయి రెడ్డి,మునిపల్లి సాయి రెడ్డి,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వాసు బాబు, ఉమ్మాజి నరేష్, హన్మండ్లు, రాంచందర్ గౌడ్,శ్యాంసన్, అంబర్ సింగ్ ఆయా గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలి 

చిత్రం న్యూస్, బేల: విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నంతంగా ఎదగాలని గూడ సర్పంచ్ గోడే అవినాష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం గూడ గ్రామంలోని MPPS పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పుస్తకాలు, పెన్నులను, అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరమాల పుస్తకాలను గురువారం అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గోడే అవినాష్ మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదువు కోవాలని, విద్యతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు ప్రోత్సాహం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీరామే నిఖిల్, వార్డు సభ్యులు ఠాక్రే సుమిత్, గవాండే సందీప్, పాఠశాల ఉపాధ్యాయురాలు అనూష, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు గవాండే మీనా, వీ.అనిల్, దశరథ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

 

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి వేగంగా అడుగులు: త్వరలోనే భూమి పూజ

0

చిత్రం న్యూస్, న్యూదిల్లీ: ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్ కనెక్టివిటీ కల్పించే ప్రక్రియ వేగవంతమైంది. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరియు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిలతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆదిలాబాద్ ఎంపీ గోడాం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, సివిల్ ఏవియేషన్ అధికారులు, డిఫెన్స్ అధికారులు, వికాస్ రాజ్ గారు, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పాల్గొని ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన రోడ్ మ్యాప్‌పై చర్చించారు.

ఉమ్మడి నిర్వహణతో అభివృద్ధి

ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర విమానయాన అవసరాలతో పాటు భారత వైమానిక దళం (IAF) శిక్షణ అవసరాల కోసం కూడా వినియోగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రక్షణ శాఖ విమానాశ్రయ అభివృద్ధిని చేపట్టగా, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సివిల్ టెర్మినల్ నిర్మాణాన్ని పూర్తి చేయనుంది.

కీలక అంశాలు:

ఫీల్డ్ సర్వే: ఏప్రిల్ 17న పౌర విమానయాన శాఖ, రక్షణ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో ఓఎల్ఎస్ (OLS) ఫీల్డ్ సర్వే మరియు పెగ్ మార్కింగ్ నిర్వహించనున్నారు.

భూసేకరణ: ఈ ప్రాజెక్టు కోసం అదనంగా 450 ఎకరాల భూమిని సేకరించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

మాస్టర్ ప్లాన్ ఆమోదం: ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటికే ఆమోదం పొందిందని ఎంపీ గోడాం నగేష్ వెల్లడించారు.

శంకుస్థాపన: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని సమాచారం.

పారిశ్రామికాభివృద్ధికి బాటలు

ఈ విమానాశ్రయం పూర్తయితే జిల్లాలో పారిశ్రామిక వేగం పుంజుకోవడమే కాకుండా, పర్యాటక రంగం అభివృద్ధి చెంది స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్-నాగపూర్ పారిశ్రామిక కారిడార్‌లో ఈ ఎయిర్‌పోర్ట్ ఒక కీలక అనుసంధానకర్తగా మారనుంది.

ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో వాకథాన్ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకథాన్‌ను అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ప్రారంభించారు. రిమ్స్ ఆసుపత్రి నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ వాకథాన్‌లో అధికారులు, అంగన్వాడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రసంగించి, ఫుడ్ లైసెన్స్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆహార భద్రత అధికారి ప్రత్యూష, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ నాయక్, వైద్యులు దీపక్ పుష్కర్, నరేందర్ పాల్గొన్నారు.

ఆత్మహత్యాయత్నం నుంచి మహిళను రక్షించిన పోలీస్ నారీశక్తి

* పోలీస్ నారీ శక్తి సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ డా.జానకీ షర్మిల

చిత్రం న్యూస్, బాసర : నిజామాబాద్‌కు చెందిన ఓ మహిళ తన భర్తతో జరిగిన కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఇంటి నుండి వెళ్లిపోయింది. అనంతరం బాసర గోదావరి నదిలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించారు. డయల్ 100 సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీస్, నారీ శక్తి బృందం సంఘటనా స్థలానికి చేరుకొని అప్రమత్తంగా వ్యవహరించి ఆ మహిళను ఆత్మహత్యకు పాల్పడకుండా ప్రాణాలను కాపాడారు. అనంతరం మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన పోలీస్ అక్కలు దీపిక, సుమేర లను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ నారీ శక్తి,మహిళల భద్రత కోసం మాత్రమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఎస్పీ తెలిపారు.

 

తండ్రి జన్మదిన వేళ పాఠశాలకు కంప్యూటర్ వితరణ చేసిన కుమారుడు 

చిత్రం న్యూస్, వరంగల్ : తండ్రి పుట్టినరోజును పురస్కరించుకుని సమాజం పట్ల తన బాధ్యతను చాటుకున్నారు బండారి మనోజ్. తన తండ్రి బండారి కృష్ణమూర్తి జన్మదిన సందర్భంగా శివనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం మనోజ్-శ్వేత దంపతులు ఒక కంప్యూటర్‌ను బహూకరించారు.

35వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మనోజ్ దంపతులు కంప్యూటర్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూస నరేంద్రస్వామికి అందజేశారు. ఈ సందర్భంగా మేరుగు అశోక్ మాట్లాడుతూ.. జన్మదిన వేడుకలను ఇలా అర్థవంతంగా, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా జరుపుకోవడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీహాన్ వర్ధన్, కలువల రాహుల్, గోదాసి శివ, అంకతి అఖిల్ లతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు తిరుపతి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, దేవరాజ్, అంజయ్య, నరేందర్, రంగాచారి, సంపత్, కవిత, సుహాసిని, స్వప్న, భవాని, కృష్ణమూర్తి, కిరణ్మయి, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యుత్ వెలుగుల్లో రంజని తండా 

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో : నిర్మల్ జిల్లా కుబీర్ మండలం రంజని తండాలో గత 20 ఏళ్లుగా నెలకొన్న విద్యుత్ సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. తండా ప్రజల చిరకాల వాంఛ అయిన విద్యుత్ స్తంభాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు విద్యుత్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడ్డారు. యువ నాయకుడు జాదవ్ వికాస్ నాయక్ ప్రత్యేక చొరవ తీసుకుని, అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి నిరంతరం ఫాలోఅప్ చేశారు. వికాస్ నాయక్ కృషి ఫలితంగా 2026లో ఈ ప్రాజెక్టుకు అధికారికంగా అనుమతులు (Sanction) లభించాయి. ప్రస్తుతం విద్యుత్ అధికారుల పర్యవేక్షణలో పీఎం జుగ (PM-JUGA) కింద కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు.ఈ సందర్భంగా తండా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “మా కష్టాలను గుర్తించి, మా కోరికను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది” అని స్థానికులు పేర్కొన్నారు.

అవాల్పూర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన సర్పంచ్ అనిల్

చిత్రం న్యూస్, బేల: బేల మండలం అవాల్పూర్ గ్రామ అంగన్‌వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ అనిల్ బుధవారం సందర్శించారు. అక్కడి పరిస్థితులను, కార్యక్రమాలను పరిశీలించారు. కేంద్రంలోని పిల్లల సంఖ్య, వారికి అందిస్తున్న పౌష్టికాహార పంపిణీ విధానం, కేంద్రం యొక్క నిర్వహణ గురించి ఆరా తీశారు. అంగన్‌వాడీ టీచర్, సహాయకురాలితో మాట్లాడి, కేంద్రంలో అమలు జరుగుతున్న ‘ఆరోగ్య లక్ష్మి’ వంటి పథకాలపై వివరాలు తెలుసుకున్నారు. పిల్లల తల్లిదండ్రులను కూడా అడిగి కేంద్రం నిర్వహణపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కేంద్రం పరిశుభ్రత, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు.

వేంకటేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్తం మరుగుదొడ్ల నిర్మాణం 

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలం కూర గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. 4.50 లక్షల నిధులతో నిర్మాణ పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ నాయకుడు మార్చెట్టి గోవర్ధన్, బీజేపి కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు సామ వెంకట్ రెడ్డి హాజరై, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన కొంగల భూమన్న, సామ సంజీవ్ రెడ్డి, బీమ్ రెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.