Home Blog Page 37

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా

 ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి నెలా నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా, జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం శాంతినగర్‌లోని ఈవీఎం గోదామును సందర్శించారు. అక్కడ భద్రపరిచిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ (VVPAT) యంత్రాల పరిస్థితిని ఆయన నిశితంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. గోదాము వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, రిజిస్టర్ల నిర్వహణను ఆయన తనిఖీ చేశారు. యంత్రాల నిర్వహణలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, రెవెన్యూ సిబ్బంది సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 19న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

ఏప్రిల్ 19న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష అందుబాటులో హాల్ టికెట్లు 

చిత్రం న్యూస్, జైనథ్:  తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు ఆన్లైన్‌లో అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలని జైనథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ లుందే రాము తెలిపారు. 6వ తరగతిలో సీట్ల కోసం 131 మంది దరఖాస్తు చేసుకున్నారనీ, వీరికి ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి అభ్యర్థులకు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష జరుగుతుందని వివరించారు. హాల్ టికెట్లను విద్యార్థి పేరు, పుట్టిన రోజు లేదా మొబైల్ నెంబర్ నమోదు చేసి, https://telanganams.cgg.gov.in/TGMSWEB20/#/ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

సీపీఐ వందేళ్ల ప్రస్థానం – అప్రతిహతంగా ప్రజా పోరాటాలు: ముడుపు ప్రభాకర్ రెడ్డి

సీపీఐ వందేళ్ల ప్రస్థానం – అప్రతిహతంగా ప్రజా పోరాటాలు: ముడుపు ప్రభాకర్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారతదేశంలో నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలకు పెట్టింది పేరు సీపీఐ పార్టీ అని, వందేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో నిరంతరం పేదల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీయేనని సీపీఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో ‘ఇంటికీ సీపీఐ’ కార్యక్రమంలో భాగంగా పార్టీ కరపత్రాలను పంపిణీ చేస్తూ, విరాళాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని, అవినీతిపరులను అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే సీపీఐ లక్ష్యమని స్పష్టం చేశారు.

సీపీఐ కార్యక్రమానికి ప్రజల నుండి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోందని, దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు బలోపేతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు.  సమసమాజ స్థాపన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో, ప్రజలు సీపీఐ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనా ఖాన్, గిరిజన సంఘం నాయకులు కోడప సురేష్, ఆదిలాబాద్ మండల కార్యదర్శి మహబూబ్ ఖాన్, శ్యామల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

బేలలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులు: పాల్గొన్న ఎంపీ గొడాం నగేష్ 

బేలలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులు: పాల్గొన్న ఎంపీ గొడాం నగేష్ 

చిత్రం న్యూస్, బేల: భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులు శుక్రవారం బేల మండల కేంద్రంలోని శ్రీరామ్ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ ఎంపీ గొడాం నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పార్టీ సిద్ధాంతాలు, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ శిక్షణ తరగతులలో జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కట్కం రాందాస్ , జిల్లా ప్రధాన కార్యదర్శులు విజయ్, క్రాంతి కుమార్ జైనథ్, బేల, భోరజ్,  సాత్నాల మండలాల అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ ఛార్జిలు, మండల పదాధికారులు, బూత్ కమిటీ అధ్యక్షులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం రాబోయే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ సాగింది.

ఉపాధి హామీ పనులను సందర్శించిన ఉప సర్పంచ్ టాక్రే సాగర్

ఉపాధి హామీ పనులను సందర్శించిన ఉప సర్పంచ్ టాక్రే సాగర్

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల గ్రామంలో ఉపాధి హామీ పనులను  ఉప సర్పంచ్ టాక్రే సాగర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీల దగ్గరికి వెళ్లి కూలీలు ఎండలో పనిచేస్తున్న వారికి ఓ ఆర్ ఎస్ పాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ టాక్రే సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన భువన్ యాప్ కూలీలకు చాలా ఇబ్బంది పెడుతుందన్నారు. ఉదయం ఫొటో క్యాప్చర్ చేస్తేనే పనులకు వెళ్ళవచ్చాన్నారు. క్యాప్చర్ కాని వారు పనిచేయరాదనీ, ఆ కూలీల పరిస్థితి ఎలా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూలీలు ఫొటో క్యాప్చర్ కోసం వేచివుండాల్సి వస్తుందన్నారు. ఇంత సమయం తీసుకుంటే ఇంటి నుండి భోజనం చేయక వచ్చిన కూలీల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. పాతపద్దతిలో మాస్టర్ రోల్ పేపర్ పైన సంతకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సర్పంచ్ మెస్రం దౌలత్, సెక్రటరీ అర్షద్, ఫీల్డ్ అసిస్టెంట్ దేవరావు తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ మధుప్రీతి 

0

చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ మధుప్రీతి 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె )గ్రామ సర్పంచ్ మధుప్రీతి, సురేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి,అధ్వర్యంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులకు, గ్రామస్తులకు, తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, గ్రామస్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ చలివేంద్రం ప్రారంభించామని సర్పంచ్ మధుప్రీతి తెలిపారు. ఈ కార్యక్రమంలో. ఉప సర్పంచ్ కో ప్లే నాగనాథ్ , బీజేపీ కార్యకర్త సిందే వినయ్ రావు పటేల్, కధం సాయినాథ్ పటేల్, కర్రోల్ల మల్లయ్య, పెద్ద కప్ సక్కరి, అగ్గోళ్ల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.

ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీ

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో 99 రోజుల ఆరోగ్య మిషన్ ఆరోగ్య వారోత్సవంలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో ఎయిడ్స్ అవేర్నెస్ వాకతాన్( రెడ్ వాక్ ) ను అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. బి రాజశ్రీ తో కలిసి జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి గాంధీ చౌక్ మీదుగా తిరిగి జనరల్ హాస్పిటల్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ హెచ్ఐవి పైన అవగాహన ఉన్నప్పుడే దాని బారిన పడకుండా ఉండగలరని, ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి రాజశ్రీ జిజి హెచ్ లో గల సంపూర్ణ సురక్ష కేంద్రం వద్ద రోగ నిర్ధారణ పరీక్షల క్లినిక్ ను, ట్రాన్స్ జెండర్స్ కోసం రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రం ను మైత్రి క్లినిక్ వద్ద ప్రారంభిం చారు..ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జలగం తిరుపతి రావు,నోడల్ ఆఫీసర్ ఆర్ట్ సెంటర్,జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా. దేవి నాగేశ్వరి, డిప్యూటీ డీఎం హెచ్ ఓ డా. అశ్విని, ఎన్.వి.హెచ్.సి.పి  డా. వెంకటేష్, డీఈ డా. శ్రావ్య, టీబీ మెడికల్ ఆఫీసర్ డా. అవంతి , ఆర్ట్ సెంటర్ మెడికల్ ఆఫీసర్స్, డీ హెచ్ ఈ ఘనపురం వెంకటేశ్వర్లు, డీపీఎం సుధాకర్ , స్నేహ సొసైటీ సిద్దయ్య , పీఎమ్ఓ రూప , మోయిజ్ ,నవీన్, రవి గౌడ్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది, జిల్లా వైద్య శాఖ కార్యాలయం సిబ్బంది , ఆఫీసర్ క్లబ్ సభ్యులు,ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది, టీబీ కంట్రోల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు.

అత్యవసర సమయంలో అండగా సీఎం సహాయనిధి

రూ.5.60 లక్షల ఎల్.ఓ.సి లెటర్ అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని నిజమాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన ఎర్గు సత్యవ్వ అనారోగ్య సమస్యలతో.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శస్త్ర చికిత్స నిమిత్తం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో రూ.5 లక్షలకు సంబంధించి ఎల్.ఓ.సి లెటర్ ను అదేవిధంగా నిజమాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామానికి చెందిన బొద్దుల శ్రీనివాస్ చికిత్స నిమిత్తం రూ .60 వేల విలువగల ఎల్.ఓసి లెటర్ ను బాధిత కుటుంబ సభ్యులకు గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు.ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో పాటు వారి గ్రామస్తులు ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు 


చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం సెంట్రల్ జైలులో దాదాపు 640 మంది ఖైదీలకు టీబీ పరీక్షలు నిర్వహించడం ,అలాగే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డాక్టర్ల సహకారంతో కంటి పరీక్షలు, స్కిన్ ,డెంటల్ , గైనిక్,  గుండెకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి డా. బి రాజశ్రీ, జిల్లా టీబీ నియంత్రణ అధికారి అండ్ పోగ్రామ్ ఆఫీసర్ ఎయిడ్స్ అండ్ లెప్రసీ డా. దేవి నాగేశ్వరి, ఎన్ వి హెచ్ సి పి నోడల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేష్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సామ్రాట్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవంతి, డి హెచ్ ఈ ఘన్ పూర్ వెంకటేశ్వర్, ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది, జిల్లా టటీబీ నియంత్రణ సిబ్బంది, మొబైల్ ఐసీటీసీ సిబ్బంది జిల్లా వైద్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మన ఊరు – మన భద్రత – మన బాధ్యత : పోలీస్ కమిషనర్ వెల్లడి

గ్రామ సర్పంచులకు అవగాహన కార్యక్రమం 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచులతో మన ఊరు – మన భద్రత – మన బాధ్యత అనే కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ లోని కామాక్షి కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, హాజరయ్యారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అరైవ్- అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా నిర్వహించాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. వ్యవసాయదారులు రోడ్డు పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకం నిషేధం అని , ప్రతిఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలని , యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలన్నారు.

ఆన్లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలని , రోడ్డు భద్రతా నియమాలు , ట్రాఫిక్ నిబంధనలు , డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధిక వేగం , క్రమశిక్షణ లోపం , అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు. ఆరోగ్యంపై శ్రద్ధ , ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో అవగాహన పెరిగి, రోడ్డు ప్రమాదాల నివారణకు , డ్రగ్స్ మీద యువతకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి యొక్క తల్లిదండ్రులు వచ్చి మాట్లాడారు. అనంతరం అరైవ్ అలైవ్ సంబందించిన ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి , ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లహరి రఘు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాటిపల్లి గంగారెడ్డి , ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ టౌన్ సీఐ సత్యనారాయణ , ఆర్మూర్ రూరల్ సీఐ జి. జాన్ రెడ్డి, ఐ-రాడ్ మేనేజర్ వర్ష , ఆర్మూర్ డివిజన్ ఎస్ఐ లు రజనీకాంత్, సంజీవ్ , అనిల్ , రాము , శ్యామ్ రాజ్ , శైలేందర్ , కిరణ్ పాల్ , రాజేశ్వర్, ఎన్ ఎస్ సి కౌన్సిల్ మెంబర్స్ సుందర్ , క్రాంతి గంగారెడ్డి , నిజంసాగర్ మాజీ లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ వై.సాయ రెడ్డి , సాగర్ రెడ్డి , గ్రామ సర్పంచులు ,వార్డ్ కౌన్సిలర్లు, ప్రజలు, పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.