Home Blog Page 36

నిజామాబాద్ లో మెగా ప్రీమియర్ లీగ్ పోటీలు

నిజామాబాద్ లో మెగా ప్రీమియర్ లీగ్ పోటీలు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో “నిజామాబాద్ ప్రీమియర్ లీగ్” జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన క్రీడా పోటీల గురించి వివరించారు.

ఈ క్రీడా పోటీల ద్వారా ముఖ్యంగా యువకులకు, ప్రజలకు సైబర్ సెక్యూరిటీ, మాదక ద్రవ్యాల నిర్మూలన ట్రాఫిక్ నిబంధనల పట్ల విస్తృత అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని సీపీ వెల్లడించారు. ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణ కోసం సాయి చైతన్య ఎన్ ఎస్ సి చైర్మన్ గా, బస్వ రెడ్డి ఎన్ఎస్ సీ కన్వీనర్ గా, కవిత రెడ్డి ఎన్ఎస్ సీ జనరల్ సెక్రటరీగా ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కమిటీలో జాయింట్ సెక్రటరీలుగా కే. శ్రీనివాస్ రెడ్డి (స్పోర్ట్స్), డా. కే. శిరీష్ కుమార్ (సైబర్ సెక్యూరిటీ), రజినీకాంత్ (ఫిజికల్ సెక్యూరిటీ) ట్రెజరర్ గా కే. సంతోష్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా పోటీలలో భాగంగా మొత్తం ఐదు రకాల ఆటల పోటీలు వాలీబాల్,  బాస్కెట్ బాల్, కబడ్డీ, యోగా, క్రికెట్ నిర్వహిస్తున్నారు.

వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ పోటీలు నిజామాబాద్ లోని డీఎస్ఏ మైదానంలో జరగనున్నాయి. ఈ మూడు విభాగాలలో విజేతలకు మొదటి బహుమతిగా రూ.20 వేలు, రెండవ బహుమతిగా రూ.10 velu, మూడవ బహుమతిగా రూ.5 వేలు అందజేయనున్నారు. కబడ్డీ పోటీలు కేవలం పురుషులకు మాత్రమే నిర్వహించనున్నారు.

యోగా పోటీలు సుభాష్ నగర్ లోని కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో నిర్వహించనున్నారు. ఇందులో అండర్-14, అండర్-18, 18 ఏళ్లు పైబడిన బాలబాలికలకు మొత్తం 6 క్యాటగిరీలలో 18 బహుమతులు ఉంటాయి. యోగా విభాగంలో విజేతలకు మొదటి బహుమతిగా రూ.3 వేలు, రెండవ బహుమతిగా రూ.2 వేలు, మూడవ బహుమతిగా రూ.వేయి అందజేయనున్నారు.

క్రికెట్ పోటీలు కంటేశ్వర్ లోని మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో 12 ఓవర్ల ఫార్మాట్లో హార్డ్ టెన్నిస్ బంతి తో నిర్వహించనున్నారు. క్రికెట్ ఎంట్రీ ఫీజు రూ. 5 వేల కాగా కేవలం మొదట నమోదు చేసుకున్న టీములకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. క్రికెట్ విజేతలకు భారీ స్థాయిలో మొదటి బహుమతి రూ.లక్ష , రన్నరప్ కు రూ.50 వేలు నగదు బహుమతి ప్రకటించారు. క్రికెట్ క్రీడాకారులు సొంతంగా తెలుపు ప్యాంట్, తెలుపు బూట్లు తెచ్చుకోవాలన్నారు.

ఈ పోటీల్లో పాల్గొనదలచిన వారు ఈ నెల 11 నుండి  17 వరకు సాయంత్రం 5:00 గంటల లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. పోటీలకు సంబంధించిన డ్రా ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం 2:00 గంటలకు తీయబడునన్నారు. ఈ టోర్నమెంట్ కేవలం నిజామాబాద్ జిల్లా వాసులకు మాత్రమే అవకాశం ఉండటంతో, క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ వెంట తీసుకురావాలన్నారు. యోగా పోటీదారులు వయస్సు ధృవీకరణ కోసం స్కూల్ బోనఫైడ్ లేదా ఎస్ఎస్సీ మెమో సమర్పించాల్సి ఉంటుందన్నారు. టోర్నమెంట్ సమన్వయకర్తలుగా జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ బి. పవన్ కుమార్ (9701177144), కబడ్డీ కోచ్ ప్రశాంత్ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలోని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.

ఆటల్లో పేరు నమోదు చేసుకునేందుకు వాలీబాల్ – బి. మల్లేష్ గౌడ్ (9440711635), బాస్కెట్ బాల్ బి.నరేష్ (9440404424), కబడ్డీ ఎం.ప్రశాంత్ (9866770889), యోగా సంగీత (9848420803), గంగాధర్ (8074982200), క్రికెట్ – సురేష్ కుమార్-(9849202586) విక్రమ్ (9493309972) లను సంప్రదించాలన్నారు.

ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో :  ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈ నెల 11న నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి పర్యటనకు హాజరు కానున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులతో కలిసి ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కందకుర్తిలో కొనసాగుతున్న తుది ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, అధికారులకు సూచనలు చేశారు. మోహన్ భాగవత్ పర్యటనలో భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఎంపిక చేసిన స్థలంలో ఏర్పాట్లు, సభా ప్రాంగణం, బారికేడ్లు తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ భద్రతకు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. సభా స్థలి వద్ద అన్ని వసతులతో కూడిన అంబులెన్స్, అగ్నిమాపక శకటం, వైద్య బృందం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రవణ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ నిజామాబాద్ టౌన్ 2 ఏడీఈ ప్రసాద్ రెడ్డి శుక్రవారం తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని ఆయన కోరారు.

కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి: గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిప్పులు

కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి: గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిప్పులు

చిత్రం న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని బీజేఎల్పీ ఉప నేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బీజేపి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల కృషితో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని ఆయన కొనియాడారు.

గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో ఒక్క కొత్త ఎయిర్ పోర్ట్ కూడా తీసుకురాలేని గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరమని ఆయన విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి కనీసం భూసేకరణ కూడా చేయకుండా ఆ పార్టీ చేతులెత్తేసిందని, ఇప్పుడు మాత్రం తామేదో ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌తో పాటు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని పాయల్ శంకర్ తెలిపారు. దీనికోసం వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నారని, దీనివల్ల స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్‌పోర్టుల పనులను కేంద్రం మాస్టర్ ప్లాన్‌తో అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన వివరించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, కేంద్ర పథకాలతోనే రాష్ట్ర రూపురేఖలు మారుతున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

చెత్త సేకరణ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  నిజామాబాద్ రూరల్ నియోజవర్గ పరిధి డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామ పంచాయతీ లో చెత్త సేకరణ నిమిత్తం రూ.10 లక్షల తో నూతనంగా కొనుగోలు చేసిన వాహనాన్ని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రవి కిరణ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు వాసు బాబు లతో కలిసి వాహనాన్ని ప్రారంభించారు. గ్రామంలో పారిశుద్ధ్యం బాగుంటేనే ప్రజలంతా ఆరోగ్యకరంగా ఉంటారని ఆ దిశగా గ్రామ పాలకవర్గం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ షేక్ ఖాదర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణస్థాయిలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకం: రూరల్ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

మాతా, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిత్యం పిల్లలతో మమేకమై ఉండే అంగన్వాడీల పాత్ర గ్రామీణస్థాయిలో అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. నిజమాబాద్ రూరల్, అర్బన్ సీడీపీవో లు జ్యోతి, సౌందర్య ల నేతృత్వంలో అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వంచే అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లను శుక్రవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 200 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ..అంగన్వాడీ టీచర్లు గ్రామీణస్థాయిల్లో పిల్లలను తమ పిల్లలుగా భావించి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాతా, శిశు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ.. అనేక కార్యక్రమాలు చేపడుతుందని వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాద్యత అంగన్వాడీ టీచర్ల పై ఉంటుందన్నారు. పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందజేయడంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు.ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం 26 కొత్త అంగన్వాడీ భవనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అవసరమైన చోట మరిన్ని మంజూరు చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి,ధర్పల్లి,ఇందల్వాయి సూపర్వైజర్లు మమతా,బుజ్జి,సరిత,సునీత, డిచ్ పల్లి బ్లాక్ కో ఆర్డినేటర్ రంజిత్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్ లు అందజేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్ లను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్ లను సద్వినియోగపర్చుకోవాలన్నారు. అంగన్వాడీ నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు డిజిటల్ వ్యవస్థలో పొందుపరుస్తూ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. అంగన్వాడీ నిర్వాహకులు పిల్లలకు, గర్భిణులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను నెరవేర్చాలన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో 326 సెల్ ఫోన్లను అంగ న్వాడీ నిర్వాహకులకు అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో దీర్ఘకాలిక సమస్యలను అంగన్వాడీ టీచర్ ప్రాజెక్టు అధ్యక్షురాలు చంద్రకళ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.

ఆన్లైన్ బూస్టర్ సిస్టమ్ పనితీరును పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మారుమూల నివాస ప్రాంతాలకు సైతం రక్షిత మంచి నీటిని అందించేందుకు వీలుగా ఎడపల్లి మండలం జానకంపేట వద్ద ఏర్పాటు చేసిన ఆన్లైన్ బూస్టర్ సిస్టమ్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. దీని పనితీరు, ప్రయోజనాల గురించి గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిట్టచివరన ఉండే ఆవాసాలకు కూడా తాగునీరు చేరుకునేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతగిరి, పోచారం గ్రామాలకు సైతం తాగునీటి సరఫరా కోసం ఇదేతరహా ఏర్పాట్లు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తుగానే చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ప్రతి ఆవాస ప్రాంతానికి రక్షిత మంచి నీరు సరఫరా అయ్యేలా పక్కాగా పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ లు రాకేష్, స్వప్న తదితరులు ఉన్నారు.

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా

 ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి నెలా నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా, జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం శాంతినగర్‌లోని ఈవీఎం గోదామును సందర్శించారు. అక్కడ భద్రపరిచిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ (VVPAT) యంత్రాల పరిస్థితిని ఆయన నిశితంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. గోదాము వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, రిజిస్టర్ల నిర్వహణను ఆయన తనిఖీ చేశారు. యంత్రాల నిర్వహణలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, రెవెన్యూ సిబ్బంది సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 19న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

ఏప్రిల్ 19న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష అందుబాటులో హాల్ టికెట్లు 

చిత్రం న్యూస్, జైనథ్:  తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు ఆన్లైన్‌లో అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలని జైనథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ లుందే రాము తెలిపారు. 6వ తరగతిలో సీట్ల కోసం 131 మంది దరఖాస్తు చేసుకున్నారనీ, వీరికి ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి అభ్యర్థులకు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష జరుగుతుందని వివరించారు. హాల్ టికెట్లను విద్యార్థి పేరు, పుట్టిన రోజు లేదా మొబైల్ నెంబర్ నమోదు చేసి, https://telanganams.cgg.gov.in/TGMSWEB20/#/ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.