Home Blog Page 33

ఇంటర్ ఫలితాల్లో పెద్దోళ్ల సాత్విక ఉత్తమ ప్రతిభ 

0

ఇంటర్ ఫలితాల్లో పెద్దోళ్ల సాత్విక ఉత్తమ ప్రతిభ 

చిత్రం న్యూస్, బాసర :నిర్మల్ జిల్లా బాసర గ్రామానికి చెందిన పెద్దోళ్ల సాత్విక అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న పెద్దోళ్ల సాత్విక 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది. సాత్విక ప్రతిభ కనబరచడంతో ఆమె తల్లిదండ్రులు పెద్దోళ్ల పుష్పలత రవి దంపతులు ఆనందంలో మునిగిపోయారు. తమ కుమార్తె కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకోవడం పట్ల గర్వంగా ఉందని వారు తెలిపారు. గ్రామంలోని పెద్దలు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఆమెను అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కాలనీవాసులు కలిసి సాత్విక ను సన్మానించి ఆమెను ప్రశంసించారు. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదివితే ఎలాంటి లక్ష్యాన్ని అయినా అవలీలగా సాధించవచ్చని సాత్విక నిరూపించి చూపిందని వారు పేర్కొన్నారు.

ఇంటర్ ఫలితాలపై ఆందోళన వద్దు: మాజీ ఎంపీపీ జివి.రమణరావు

0

* ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు

* ఫలితాల పట్ల ఆందోళన చెందవద్దని విద్యార్థులకు సూచన

* ఓటమి గెలుపుకు తొలిమెట్టుగా భావించాలని పిలుపు

చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూనే, మార్కులు తక్కువ వచ్చినా లేదా ఫెయిల్ అయినా ఆందోళన చెందవద్దని కుంటాల మండల బీజేపీ జిల్లా నాయకులు, మాజీ ఎంపీపీ జివి.రమణరావు విద్యార్థులకు సూచించారు. జీవితంలో పరీక్షలు ఒక భాగం మాత్రమేనని, వాటిని ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉండాలని ఆయన అన్నారు. విడుదలైన ఇంటర్ ఫలితాలపై కొందరు విద్యార్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, జివి.రమణరావు ఒక ప్రకటన విడుదల చేశారు. పాస్ అయిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూనే, ఫెయిల్ అయిన వారికి ధైర్యం చెప్పారు. పరీక్షలు మళ్లీ రాసుకోవచ్చని, కానీ జీవితం తిరిగి రాదని, కాబట్టి ఎవరూ ఆత్మహత్య వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రుల ఆశలను గుర్తుంచుకోవాలని, వారిని బాధపెట్టే పనులు చేయవద్దని రమణరావు విద్యార్థులకు సూచించారు.

విద్యార్థుల భవిష్యత్తుకు పరీక్షా ఫలితాలే సర్వస్వం కాదని, వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో అనేక అవకాశాలు వస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఏదైనా విషయంలో విఫలమైనా, దానిని ఒక అనుభవంగా స్వీకరించి, మరింత పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు సలహా ఇచ్చారు. ఓటమిని గెలుపునకు తొలిమెట్టుగా భావించి, ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఆయన కోరారు. మానసికంగా దృఢంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రకటన ద్వారా, విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని అందించడమే లక్ష్యంగా జివి.రమణరావు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన సూచించారు.

ఇంటర్ ఫలితాల్లో లింగాపూర్ విద్యార్థుల ప్రతిభ

చిత్రం న్యూస్, దండేపల్లి: దండేపల్లి మండలం లింగాపూర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్ (TGMS) విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. పాఠశాల విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించారు. MPC మొదటి సంవత్సరం విభాగంలో ఆర్.అక్షిత్ వర్మ 425/470 మార్కులు, పి.స్పందన 412 మార్కులు సాధించారు. BPC విభాగంలో ఎం.డి. ఆసియా అంజుం 399/440, జి.మదన్ చంద్ర 352 మార్కులతో మంచి ఫలితాలు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బి.రాజ్ కుమార్ 969/1000, జి. సౌజన్య 956 మార్కులు సాధించగా, బి. సహితి 980 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ చూపింది. కె. వర్షిణి 890, వి.అపూర్వ శ్రీ 856, ఏ.హారిక 614 మార్కులు సాధించారు.

 

ముథోల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

0

ముథోల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా ముథోల్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా (ప్రెస్ క్లబ్) విలేకరులు అందరూ సమావేశమై కమిటీని ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా జింద్లే సునీల్, ఉపాధ్యక్షులుగా సొన్కాంబ్లే రాహుల్, మల్లేష్ , ప్రధాన కార్యదర్శిగా ముఫ్తీ రాయిస్ ఖాస్ మి , కోశాధికారిగా దొంతుల్వార్ రమేష్, సంయుక్త కార్యదర్శిగా శరత్  గైక్వాడ్ లను ఎన్నుకున్నారు, సభ్యులు దుర్గాప్రసాద్, మురళిగౌడ్, తిరుపతి గౌడ్, విజయ్, పి.నాగేష్, నాగేష్, పవన్, బషీర్, అజీమ్, సుభాష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాసర అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

0

బాసర అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

చిత్రం న్యూస్, బాసర : దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకార పూజలను చేశారు. అమ్మవారి దర్శనం కోసం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రైలు, రోడ్డు మార్గాల ద్వారా భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి క్యూలైన్లో వేచి ఉన్న భక్తుల కోసం మజ్జిగ, చల్లటి నీరు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు . భక్తులకు సుమారు రెండు గంటల సమయం దర్శనానికి పట్టింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో విజయరామరావు, బాసర సీఐ కిరణ్, పోలీస్ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.

మొక్కలకు నీరు పోస్తూ..ప్రాణంగా చూస్తూ 

* మొక్కలకు నీరు పోస్తూ..ప్రాణంగా చూస్తూ

* ఆదర్శంగా నిలుస్తున్న బట్టి సావర్గాం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ యువకులు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  మొక్కలు అందరూ నాటుతారు..వాటిని సంరక్షించడమే కష్టం..ఇలాంటి తరుణంలో నాటిన మొక్కలను కాపాడుకునేందుకు బట్టి సావర్గాం గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ యువత నడుంబిగించారు. శ్రమ నీ ఆయుధమైతే.. విజయం నీ బానిసవుతుంది అనే నానుడిని నిజం చేస్తున్నారు వీరంతా..ప్రతి ఆదివారం నీరు పోస్తూ మొక్కలను కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

సర్పంచ్ కాకముందే ఆలోచనకు బీజం..

ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టి సావర్గాం గ్రామ పంచాయతీలోని స్మశానవాటికలో మొక్కలు లేక ఎడారిగా ఉండడం, చెట్ల నీడ లేక పక్షులు రాక పోవడంతో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆలోచనకు బీజం పడింది. ఎలాగైనా మొక్కలు నాటాలని సర్పంచ్ కాక ముందే నిర్ణయించుకున్నారు. అనుకున్నది తడవుగా శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులు రూ.లక్షకు పైగా ఖర్చు పెట్టి గత ఏడాది జూన్ నెలలో సుమారు 300 మొక్కలను నాటించారు. అందులో 10 మొక్కల వరకు పోయాయి. ఉన్న 290  మొక్కలను ఎలాగైనా సంరక్షించాలని కంకణం కట్టుకున్నారు. గ్రామ యువత సైతం తోడు కావడంతో ప్రతి ఆదివారం నీరు పోస్తూ మొక్కల సంరక్షణ చేపడుతున్నారు..

మండుటెండలో మొక్కవోని సంకల్పంతో..

40 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ మొక్కలను కాపాడేందుకు గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా తెచ్చిన నీటిని మొక్కలకు పోస్తూ సర్పంచ్ తో పాటు యువకులంతా కాపడుతున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఎవరైనా అంత్యక్రియలకు వస్తే ఎండకు ఎండుతూ.. వర్షంలో తడుస్తూ ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారని  గ్రహించాను. మొక్కలను సంరక్షిస్తే వృక్షాలుగా మారి నీడతో పాటు పక్షులు వచ్చే అవకాశం ఉంటుందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పచ్చగా కనిపిస్తున్నాయి.

బరంపూర్ వేంకటేశ్వర స్వామి ఆలయ భక్తుల సౌకర్యార్థం బెంఛీలు విరాళం

చిత్రం న్యూస్, తలమడుగు: బరంపూర్ గ్రామంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం పల్లి (బి)గ్రామ వాస్తవ్యులు నల్లా రవీందర్ రెడ్డి గొప్ప మనసుతో ముందుకు వచ్చారు. సుమారు రూ. 70 వేల  సొంత  నిధుల ఖర్చుతో ఆలయానికి వచ్చే భక్తులు కూర్చోవడానికి వీలుగా ప్రత్యేక టేబుళ్లను (బెంఛీలను) చేయించారు.ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, బరంపూర్ గ్రామస్తులైన మెరువు ప్రభాకర్ రెడ్డి – శైలజ దంపతుల ఆధ్వర్యంలో నల్లా రవీందర్ రెడ్డి దంపతులను ఆలయ ప్రాంగణంలో శాలువాతో కప్పి చిరు సన్మానం చేశారు. స్వామివారి సేవలో భాగస్వాములైనందుకు గ్రామస్తులు, భక్తులు రవీందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

పోగొట్టుకున్న సెల్​ఫోన్లు బాధితులకు అందజేత

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నగరంలో సెల్​ఫోన్లు పోగొట్టుకుని ఫిర్యాదు చేసిన బాధితులకు వాటిని ట్రేస్ చేసి తిరిగి అందజేసినట్లు వన్​ టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్​హెచ్​వో మాట్లాడుతూ.. వన్​ టౌన్​ పరిధిలో 20మంది బాధితులు తమ ఫోన్లు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు చేశారన్నారు. ఈ సందర్భంగా సీఈఐఆర్​ పోర్టల్ ద్వారా వాటిని ట్రేస్​ చేసి తిరిగి బాధితులకు శనివారం అందజేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొబైల్​ఫోన్లు జాగ్రత్తగా చూసుకోవాలని.. ఒకవేళ పోగొట్టుకున్నట్లయితే వెంటనే సంబంధిత పోలీస్​స్టేషన్​లో సంప్రదించాలని సూచించారు.

వైద్య సేవలు ప్రశంసనీయం: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాల ముగిం పు కార్యక్రమం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య సేవలు ప్రశంసనీయమని వైద్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీహెచ్ఎస్, ఆసుపత్రి సూపరిండెంట్ డా.విజయ భాస్కర్, డిప్యూటీ డా.డీఎంఅండ్ హెచ్ ఓ విద్యా, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో  మహాత్మాాా  జ్యోతి రావు ఫులే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి స్థానిక నాయకులతో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఈనెల 7వ తేదీన నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భం గా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా సాధారణ ప్రసవాలు నిర్వహించిన ఆసుపత్రి గా అవార్డు అందుకున్న బాన్సువాడ మాత, శిశు సంక్షేమ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని పోచారం అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య సేవలను మరింత మెరుగుపరచడం ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యమని, వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమని తెలిపారు.

పోరాట యోధురాలు నూర్జహాన్ కన్నుమూత

* నివాళులు అర్పించిన కార్మిక నాయకులు

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు, సీఐటీయూ, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ (45) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె, శనివారం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కార్మిక ఉద్యమాలకు, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు పెద్ద దిక్కు కోల్పోయినట్టైంది. నూర్జహాన్ జీవితం మొత్తం పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ, మున్సిపల్ తదితర రంగాల్లో పనిచేసే కార్మికుల హక్కుల సాధన కోసం ఆమె నిరంతరం పోరాటాలు నడిపారు. తక్కువ వేతనాలు, అసమాన పని పరిస్థితులు, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి సమస్యలపై ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపి, కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ఆందోళనలు మాత్రమే కాకుండా, స్థానిక స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలను అధికారులతో చర్చల ద్వారా పరిష్కరించడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. కార్మికుల ప్రతి సమస్యను తన సమస్యగా భావించి, వారి మధ్యే ఉండి, వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యమయ్యారు. ఒక దశలో అడవుల్లో అజ్ఞాత జీవితం గడిపిన నూర్జహాన్, ఆ తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చి సీపీఎం పార్టీతో కలిసి ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. కష్టకాలాల్లో వెనుకడుగు వేయని ధైర్యసాహసాలు, అంకితభావం ఆమెను ప్రత్యేక నాయకురాలిగా నిలిపాయి. నూర్జహాన్ మరణం కార్మిక ఉద్యమాలకు తీరని లోటుగా భావిస్తూ, పార్టీ నాయకులు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. నూర్జహాన్ కి భర్త ఆనంద్ (ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు), కొడుకులు అబ్బాస్, ఆజాద్ ఉన్నారు. నూర్జహాన్ మృతి పట్ల పలువురు తమ సంతాపం ప్రకటించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్బాస్, నాటకం సభ్యులు ప్రసాద్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్,జయలక్ష్మి నివాళులర్పించారు. విజయ రాఘవన్, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత కార్యదర్శి పి.వెంకట్, సీఐడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్.శ్రమ, తమ సంతాపం ప్రకటించారు. సీపీఐ(ఎం ) నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నిజామాబాద్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ద వెంకట రాములు, పల్లపు వెంకటేష్, శంకర్ గౌడ్ నాయకులు విశాల్, గంగాధర్, సుజాత,తదితరులు నివాళులర్పించారు.