చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మహిళా అక్షరాస్యతకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా ఫులే అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జ్యోతిబా ఫులే జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మహిళల కోసం సతీమణి సావిత్రి భాయి ఫులేతో కలిసి మొట్టమొదటి పాఠశాలను నెలకొల్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సమాజంలో సమానత్వం, విద్య, న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహాయోధుడు అని తెలిపారు. ప్రధానంగా మహిళల విద్యకు ఆయన చేసిన సేవలు అపూర్వమైనవని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని లక్ష్యంతో సత్యశోధకు సమాజాన్ని స్థాపించారని గుర్తు చేశారు. ఒక మహానుభావుడిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడం అందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, కార్పొరేటర్లు జ్యోతి మురళి, మల్లేష్ యాదవ్, బెల్లాల్ శశాంక్, జగదీష్ కులకర్ణి, బంటు ప్రీతి ప్రవీణ్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్లో మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్లో శనివారం జరిగిన మహాత్మా జ్యోతిబా ఫులే 200వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష పాల్గొన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు ఆహ్వానితులను అలరించాయి. సుకుమార్ పెట్కూలే రచించిన ఫులే జీవిత చరిత్ర ఆడియో సీడీని కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు ఫులే జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలకు మెమెంటో, ప్రశంసా పత్రాలను కలెక్టర్, ఎమ్మెల్యే అందజేశారు.బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో, భుక్తాపూర్లోని ఫులే కూడలిలో, దస్నాపూర్లోని బీసీ స్టడీ సర్కిల్ ఆవరణలో ఫులే చిత్రపటాలకు, విగ్రహాలకు కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్, అధికారులు, కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దుబ్బ లోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో పూలే జయంతి వేడుక నిర్వహించారు.అంతకుముందు వినాయకనగర్ లోని మహాత్మ జ్యోతిబా ఫులే విగ్రహానికి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలను పారద్రోలేందుకు మహాత్మ జ్యోతిబా ఫులే కొనసాగించిన కృషి అమోఘమని అన్నారు. అడుగడుగునా అవరోధాలు, అవమానాలు ఎదురైనప్పటికీ ఏమాత్రం చలించకుండా సాంఘిక దురాచారాలను దూరం చేసేందుకు ఫులే ఎంతగానో శ్రమించారని గుర్తు చేశారు. అణగారిన వర్గాలు సమానత్వం సాధించాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించి వారికి విద్య అందేలా విశేషంగా కృషి చేశారని, మహిళల విద్య కోసం ప్రత్యేకంగా మొట్టమొదటి పాఠశాలను స్థాపింపజేశారని అన్నారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం బీ.సీ గురుకులాలకు జ్యోతిబా ఫులే పాఠశాలలుగా నామకరణం చేస్తూ నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తోందన్నారు. మహనీయులు చూపిన బాటలో పయనిస్తూ వారి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే మన జీవితానికి కూడా సార్థకత చేకూరుతుందన్నారు. జ్యోతిబా ఫులే చూపిన బాటలో పయనిస్తూ, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. జయంతి సభలో మేయర్ ఉమారాణి, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ లు మాట్లాడుతూ, జ్యోతిబా ఫులే సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, బీసీ సంఘాల బాధ్యులు బుస్స ఆంజనేయులు, నరాల సుధాకర్, నరేందర్ గౌడ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
తలమడుగు రైతులకు భూ పట్టాల పంపిణీ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తలమడుగు మండలం పల్సీ (బి) తండాకు చెందిన 9 మంది రైతులకు 30 ఎకరాల భూ పట్టాలను జిల్లా కలెక్టర్ రాజర్షిషా జడ్పీ సమావేశ మందిరం ఆవరణలో పంపిణీ చేశారు. ప్రత్యేక చొరవ చూపి దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యను పరిష్కరించడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కారుణ్య నియామక అభ్యర్థులకు ఉత్తర్వులు అందజేసిన కలెక్టర్ రాజర్షి షా
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా నియామక ఉత్తర్వును శనివారం అందజేశారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఎంపికైన మొత్తం 16 మంది అభ్యర్థులకు ఆయన ఈ ఉత్తర్వులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబాలకు ఈ నియామకాలు ఆర్థిక భరోసానిస్తాయని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో వర్ణ, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నర్సింగ్ ఆఫీసర్గా ఎంపికైన శంకర్ ను సన్మానించిన మాజీ మంత్రి జోగు రామన్న
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 23వా వార్డు మహాలక్ష్మి వాడకు చెందిన తోట సుభాష్ తోట గౌరమ్మ దంపతుల కుమారుడు తోట శంకర్ ప్రభుత్వ వైద్యారోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా శంకర్ సాధించిన విజయాన్ని అభినందిస్తూ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న వారి నివాసానికి స్వయంగా వెళ్లారు. శంకర్, అతని తల్లిదండ్రులను జోగు రామన్న ఘనంగా సన్మానించారు.శంకర్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పేద కుటుంబం నుండి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డీసీసీ కార్యాలయంలో ఘనంగా ఫులే జయంతి: పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్: అణగారిన వర్గాల కోసం కృషి చేసిన మహనీయులు, గొప్ప సంఘసంస్కర్త, మహాత్మా జ్యోతిరావు ఫులే అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఫులే జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ(డీసీసీ) కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కుల వివక్షకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం కృషి చేసిన ఆ మహనీయుడు మనకు ఎప్పటికీ ఆదర్శమన్నారు. సమాజంలో సమానత్వం, అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన జ్యోతిరావు ఫులే ఆశయాలు ఆదర్శంగా తీసుకొని మనమంతా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. జ్యోతిబా ఫులే దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ.. నినాదాలు చేస్తూ వారిని స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బెజ్జంకి అనిల్ , గౌలి సంజయ్, మంగేష్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంబేద్కర్, బౌద్ధ జయంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం కైలాష్ నగర్ లోని అశోక బుద్ధ విహార్ లో మే 1న నిర్వహించే బౌద్ధ పూర్ణిమ ( వైశాఖ పూర్ణిమ ), డా.బీ. ఆర్ అంబేద్కర్ జయంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ పిలుపునిచ్చారు.ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గం ట్రస్ట్ కార్యాలయంలో జయంతులకు సంబంధించిన గోడ ప్రతులను దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ పలువురు తో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల జయంతులకు వేలాది సంఖ్యలో బౌద్ధ ఉపాసకులు, అంబేద్కర్ వాదులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తర్వాత దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ కార్యక్రమం నిర్వాహకులకు రూ.10 వేల చెక్కును డా. బీ.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో భారతీయ బుద్ధ మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞా కుమార్ , జిల్లా అధ్యక్షులు విట్టల్ బుట్టే , ప్రధాన కార్యదర్శి దయానంద్ పొటఫోడే , డా. బీ .ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భీమ్ రావు వాగ్మారే , జిల్లా జనరల్ సెక్రటరీ దడసాహెబ్ జబడే తో పాటు దయానంద్ కామ్లే , కాంతారావు వాగ్మారే , రంగారావు వాటోరే , గోవింద్. రఘనాథ్ ఆడే. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు యువకులను కాపాడిన గంగపుత్రులు
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర పవిత్ర పుణ్యక్షేత్రం గోదావరి నది పుణ్య స్నానాలకు వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులను గంగపుత్రులు కాపాడారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఇద్దరు భక్తులు పవిత్ర గోదావరినదిలో పుణ్యస్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. అక్కడ ఉన్న గంగ పుత్రులు డప్పు నరేశ్ గమనించి ఇద్దరిని గోదారోడ్డుకు చేర్చి ప్రాణాలను కాపాడారు. వారిని కాపాడినందుకు నరేష్ కు పలవరు అభినందనలు తెలిపారు.
బాసర ఆర్జీయూకేటీలో మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో డా. రెవెల్లి అజయ్ అధ్యక్షతన శనివారం మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్, డీన్ డా.విట్టల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విశేష సంఖ్యలో పాల్గొని ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, అంటరానితనం నిర్మూలన, మహిళా సాధికారత కోసం ఫులే చేసిన విశేష కృషిని వీసీ, డీన్ కొనియాడారు. అందరికీ విద్య అందాలన్న ఫులే ఆశయ సాధన దిశగా అడుగులు వేయాలని, ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు సూచించారు.
