రైతులకు పరిహారం అందించాలి: సుహాసిని రెడ్డి
చిత్రం న్యూస్, భోరజ్:
గత ఏడాది ఆగస్టు-సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు పెనగంగా నది పరివాహక ప్రాంతంలో పంటలు నీట మునిగి దెబ్బతిన్న రైతులకు పంట నష్ట పరిహారం అందజేయాలని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి అన్నారు. భోరజ్ మండలంలోని పెండల్వాడ, లేకర్వాడ, తరోడ గ్రామాల్లో శనివారంఆమె పర్యటించారు. రైతులను కలిసి మాట్లాడారు. రైతుల వివరాలను రెవెన్యూ, వ్యవసాయాధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారని ఆమె తెలిపారు. ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించి డిసెంబర్లో జీవో జారీ చేసి నిధులు మంజూరు చేసినా, 6 నెలలు గడిచినా ఇప్పటికీ రైతులకు నష్టపరిహారం అందలేదని సుహాసిని రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను చైతన్యం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి పరిహారం అందేలా కార్యాచరణ రూపొందిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో లేకర్వాడ సర్పంచ్ ప్రభాకర్ తరోడ సర్పంచ్ అరవింద్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
