.ఆరోగ్య స్పృహకు నిదర్శనం: కొలాం గిరిజన రైతు కుటుంబం ఆదర్శం
చిత్రం న్యూస్,సాత్నాల: మండలంలోని అడ్డగుట్ట గ్రామానికి చెందిన కొలాం గిరిజన రైతు కొడప అమృతరావు, జంగుబాయి దంపతులు ఆరోగ్యకరమైన జీవన విధానంతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న ఈ దంపతులు గ్రామంలోని పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తూ సమాజ సేవలో ముందున్నారు. తమ తల్లి బాటలో నడుస్తూ నిత్యం ఆహారంలో గానుగ నూనెను వాడుతున్నారు.
జంగుబాయి ప్రతిరోజూ రూ.10, 20 చొప్పున పొదుపు చేసి, ప్రతి రెండు నెలలకు ఒకసారి తమ కుటుంబానికి సరిపడా పల్లీలను కొనుగోలు చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా వాటిని యూనిట్కు తీసుకొచ్చి తమ కళ్ల ముందే స్వచ్ఛమైన గానుగ నూనె తయారు చేయించుకొని వాడుతున్నామని అమృతరావు తెలిపారు. ఆరోగ్యంపై అవగాహనతో సంప్రదాయ ఆహారపు అలవాట్ల వైపు మళ్లుతున్న ఇలాంటి కుటుంబాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
