చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఓటమి కూడా అడ్డంకి కాలేదని మామ్మాయి రమేష్ నిరూపించాడు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ గ్రామానికి నీటి సమస్యను పరిష్కరించాలనే సంకల్పంతో మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ మామ్మాయి రమేష్ రెండు బోర్లను వేయించి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామంలో గత కొంతకాలంగా తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. ఎన్నికల సమయంలో ప్రజలతో సమావేశాలు నిర్వహించిన రమేష్, తాను గెలిచినా గెలవకపోయినా గ్రామంలో రెండు బోర్లను వేయిస్తానని మాట ఇచ్చారు. అయితే ఎన్నికల్లో ఆయనకు విజయం దక్కకపోయినా, ఇచ్చిన మాటను మాత్రం మరవలేదు. తన కుమారుడు మామ్మాయి సచిన్ రెండు బోర్లను శుక్రవారం బొర్రా గణేష్ గల్లీ, ధోబి గల్లీ ప్రజలతో, యువకులతో కలిసి ప్రారంభించారు.
సచిన్ మాట్లాడుతూ..మా నాన్న సర్పంచిగా, ఎంపీటీసీగా ఎన్నో సేవలు అందించారన్నారు. నాన్న బాటలో నేను కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తాననన్నారు. తన సొంత ఖర్చుతో గ్రామంలోని అవసరమైన బొర్రా గణేష్ గల్లీ, దోబి గల్లీ ప్రాంతాల్లో రెండు బోర్లను వేయించి, వాటిని ప్రారంభించారు. దీంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మామ్మాయి రమేష్ ను అభినందించారు. రాజకీయాలకతీతంగా గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలనే సంకల్పంతో మామ్మాయి రమేష్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ దేశ్ముఖ్, గురప్ప శంకర్, వార్డ్ మెంబర్లు నానం సాయిలు, భూమన్న నాగలక్ష్మి అశోక్, ఫారుక్, గైని సాగరా గంగాధర్, బలగం శైలేష్ , మల్లేష్ వీరన్న దావరాజు ఇక్బాల్ ముల్తాన్ విక్రమ్ శీను తదితరులు ఉన్నారు.
