Home Blog Page 35

ఆత్మాభిమానం కోసం పదవికి త్యాగం..ఎక్సైజ్ శాఖలో ‘ఈగో’ల పోరు

ఆత్మాభిమానం కోసం పదవికి త్యాగం..ఎక్సైజ్ శాఖలో ‘ఈగో’ల పోరు

డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆవేదన.!

చిత్రం న్యూస్, నిజామాబాద్ జిల్లా బ్యూరో: ఆకలితోనైనా చస్తాం కానీ ఆత్మాభిమానం వదులుకోలేం” అన్న కాళోజీ మాటలను నిజం చేస్తూ, ఒక ఉన్నతాధికారి తన ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట కొలువు చేయలేనని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిజామాబాద్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, తన పై అధికారి చేసిన ఘోర అవమానాన్ని భరించలేక, తన ముప్పై ఏళ్ల సుదీర్ఘ సర్వీసును వదులుకుని శాఖ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన పడిన మానసిక సంఘర్షణ, ఆ గదిలో జరిగిన అవమానం గురించి ఆయన పంచుకున్న ముచ్చట్లు చదువుతుంటే ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవు.

​అసలేం జరిగింది..? సోమిరెడ్డి వివరణ ప్రకారం.. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో పై అధికారి (కమిషనర్) ఆయనను ఉద్దేశించి “వెధవ, ఇడియట్” అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. చేయని తప్పుకు అకారణంగా నిందిస్తుంటే, సోమిరెడ్డి చాలా సున్నితంగా “అలాంటి మాటలు అనొద్దు సార్” అని ఎదురు చెప్పారు. బహుశా వ్యవస్థలో ఎవరూ ఇన్నేళ్లుగా కమిషనర్ ని ఎదురు ప్రశ్నించి ఉండకపోవచ్చు. ఆ చిన్న మాట ఆయన ‘ఈగో’ను బాగా దెబ్బతీసింది. ఫలితంగా పది నిమిషాల పాటు నలుగురు అధికారులు, సిబ్బంది ముందే సోమిరెడ్డిని “వెధవాతి వెధవవు” అంటూ వ్యక్తిగత దూషణలకు దిగారు. తనకు సంబంధం లేని పనులను అంటగడుతూ, బలవంతంగా తాను వెధవనని ఒప్పించే ప్రయత్నం చేశారని సోమిరెడ్డి వాపోయారు.

వ్యవస్థ మౌనంపై ఆవేదన: ఒక ఉన్నతాధికారి స్థాయి వ్యక్తిని అందరి ముందే అవమానిస్తుంటే, తోటి అధికారులు, మిత్రులు మౌనంగా ఉండటం సోమిరెడ్డి ని మరింత కలచివేసింది. “అన్యాయాన్ని ప్రశ్నిద్దాం రండి” అని ఆయన పిలిచినప్పుడు, తోటి అధికారుల మొఖాల్లో కనిపించిన భయం, వారి మౌనం చూసి ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మిత్రులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. “అరేయ్, ఒరేయ్” అని పిలుస్తూ, కనీస గౌరవం ఇవ్వని చోట ఇన్నాళ్లు ఎలా పనిచేశామా అని ఆయన సిగ్గుతో తలదించుకుంటున్నారు.

ఆత్మాభిమానమే మిన్న: “నేను పెరిగిన వాతావరణంలో ఆత్మాభిమానంతో బ్రతకడమే జీవితమని నమ్మాను. ఆత్మాభిమానం లేని చోట ఈ ఉద్యోగం నాకు అక్కర్లేదు” అని సోమిరెడ్డి తేల్చి చెప్పారు. తన కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. చేతకాని, చైతన్యం చచ్చిపోయిన ఒక శాఖలో 30 ఏళ్ల పాటు సేవలు అందించినందుకు విచారం వ్యక్తం చేస్తూ, ఇక ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పని చేయలేనని స్పష్టం చేశారు.

​ఉన్నతాధికారులకు ధన్యవాదాలు: తను ఈ శాఖలో ఇమడలేనని తెలిసినా, ఇన్నాళ్లు ప్రోత్సహించిన మేలుకోరే ఉన్నతాధికారులకు, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేర్చిన మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కానీ తన మనసు పడ్డ గాయం మాత్రం మానలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల మధ్య ఉండాల్సిన కనీస మర్యాదలు లోపించడం, పెత్తందారీ పోకడలు పెరిగిపోవడంపై ఈ ఘటన ఒక చర్చకు దారితీసింది. సోమిరెడ్డి నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్‌షిప్ శిక్షణ పూర్తి 

చిత్రం న్యూస్, దండేపల్లి :మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని TGMS లింగాపూర్ విద్యార్థులకు, Media and entertainment విభాగం లో ప్రయోగ పూర్వక జ్ఞానాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వృత్తి విద్యలో భాగంగా ఆచరణాత్మక అనుభవం కల్పించేందుకు వృత్తి విద్య శిక్షకుడు రాజు రెడ్డి పర్యవేక్షణలో ఈ శిక్షణ కార్యక్రమం మార్చి 30 నుంచి ఏప్రిల్ 10 వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ప్రణవి ఫోటో స్టూడియో మ్యాదరిపేట లో విద్యార్థులు ఆసక్తిగా శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.రమెష్ మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో వివిధ రంగాలలో ఎదగడానికి ఈ తరహా ఇంటర్న్‌షిప్‌లు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ముఖ్యంగా వృత్తి విద్య ద్వారా విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుందని ఆయన అన్నారు. విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ తమ నైపుణ్యాలను పెంపొందించుకున్నారు. ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని సాయి ప్రణవి ఫోటో స్టూడియో నిర్వాహకులు మైదం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

యుజీసీ నెట్ లో విద్యార్థిని ప్రతిభ 

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కొత్త సాంగిడి గ్రామానికి చెందిన సామ సంతోష్ రెడ్డి చిన్న కుమార్తె అంకిత యూజీసీ నెట్ లో ప్రతిభ కనబరిచింది. జాతీయ స్థాయిలో లక్షలాది మంది పోటీపడే ఈ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల కాగా అందులో ఆమె ఈ ఘనత సాధించారు. డిగ్రీ అధ్యాపక పోస్టులకు అర్హత సాధించారు. పీ హెచ్ డీ ప్రవేశ పరీక్షకు అర్హత సాధించడం ద్వారా ఆమెకు పరిశోధన రంగంలో మరింత ఉన్నత అవకాశాలు లభించనున్నాయి. గ్రామ ప్రజలు, కుటుంబీకులు ఆమెను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో యోగా, మెడిటేషన్ పై అవగాహన

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం యోగ డే, హోమియోపతి డే ఆరోగ్య దినోత్సవాల ను పురస్కరించుకొని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఏడవ అంతస్తు,  పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగ మ మెడిటేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని జిల్లా ఆయుష్ విభాగాధికారి డాక్టర్ గంగాదాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా, మెడిటేషన్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. మన ఇంట్లో వంట గదిలో దొరికే దినుసుల ద్వారా ఆరోగ్యం అన్నారు. అదేవిధంగా ఔషధ మొక్కలపై అవగాహన పెంచుకొని మన చుట్టూ అనేక రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని వాటిని మనకు అవసరాన్ని కనుగొనంగా ఆయుర్వేద వైద్య నిపుణులచేత సూచనలు తీసుకుంటూ ఔషధాలుగా ఉపయోగించవచ్చన్నారు. ఆయుర్వేద యునాని, హోమియోపతి మందులు జిల్లా ప్రజలకు అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని ఎటువంటి సందేహం లేకుండా డాక్టర్ల సూచన మేరకు ఉపయోగించవచ్చు అన్నారు.మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జలగం తిరుపతిరావు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా ప్రశాంతమైన మనసుతో ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా జీవనం కొనసాగించవచ్చన్నారు. ప్రతిరోజు మెడిటేషన్ క్రమం తప్పకుండా చేయడం జీవనశైలిలో మార్పును తీసుకురావచ్చన్నారు. యోగ డాక్టర్ తిరుపతి,  విజయభాస్కర్ తో కలిసి నర్సింగ్ కళాశాల విద్యార్థి నీలచైత యోగ ఆసనాలపై , మెడిటేషన్ పై సాధారణ వ్యాధులపై,అవగాహన కలిగించారు.  ఈ కార్యక్రమంలో పీడియాట్రిషన్ డాక్టర్ శ్రీకాంత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుండి డిహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, నర్సింగ్ సూపరిండెంట్ చంద్రకళ, విజయలక్ష్మి,మాక్లూర్ నర్సింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థినిలు, పురుషోత్తం, రమేష్,ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు.

మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో గల మున్సిపల్ కార్మికులందరికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులు, క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి రాజశ్రీ తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరాన్ని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, మున్సిపల్ కమిషనర్ దిలీప్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులందరూ వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని, ఏ కార్మికుడు కూడా అనారోగ్యానికి గురి కావద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. డీ ఎం హెచ్ ఓ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు శారీరక పరిశుభ్రత పాటిస్తూ పోషకాహారం తీసు కోవాలని, ముఖ్యంగా గుండె జబ్బులు ,మధుమేహం, క్యాన్సర్ లాంటి జీవనశైలి వ్యాధులను ముందే గుర్తించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అదేవిధంగా క్షయ వ్యాధికి గురికాకుండా చక్కని పోషకాహారంం తీసుకోవాలని తెలిపారు. మున్సిపల్ కార్మికులందరికీ ఎక్సరే ద్వారా క్షయ నిర్ధారణ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవంతి , లక్ష్మణ్, నరేష్, శ్యామల, క్షయ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ స్థాయిలో మెరిసిన ఆదిలాబాద్ కుర్రాడు: ‘వీరగాథ 5.0’లో రిషాంత్ అద్భుత ప్రతిభ

జాతీయ స్థాయిలో మెరిసిన ఆదిలాబాద్ కుర్రాడు: ‘వీరగాథ 5.0’లో రిషాంత్ అద్భుత ప్రతిభ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మారుమూల పల్లె నుంచి వెళ్లిన ఓ విద్యార్థి తన కవిత్వంతో దేశ రాజధానిని ఆకర్షించాడు. కేంద్ర రక్షణ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘వీరగాథ 5.0’ పోటీలలో గాదిగూడ మండలం బుద్ధమహర్ గూడ గ్రామానికి చెందిన రిషాంత్ అద్భుత విజయాన్ని అందుకున్నాడు.

సైనికుల త్యాగాలను, వారి వీరత్వాన్ని కళ్లకు కట్టినట్లుగా రిషాంత్ రాసిన కవిత్వం అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రతిభను గుర్తించిన కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి, రిషాంత్‌ను స్వయంగా అభినందించి ప్రశంసా పత్రంతో పాటు మెడల్‌ను అందజేశారు.

కలెక్టర్ ప్రత్యేక సన్మానం:

జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు తెచ్చిన రిషాంత్‌ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సన్మానించారు. రిషాంత్‌కు శాలువా కప్పి అభినందనలు తెలియజేసిన కలెక్టర్, భవిష్యత్తులో అతను మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) రాజేశ్వర్, అధికారులు అజయ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొని రిషాంత్‌ను అభినందించారు. ఒక మారుమూల గ్రామం నుండి జాతీయ స్థాయి వేదికపై రిషాంత్ మెరవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కందకుర్తికి ఆర్ఎస్ఎస్ చీఫ్: బందోబస్తు ఏర్పాటును పర్యవేక్షించిన పోలీసు కమిషనర్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : ఏప్రిల్ 11న కందకుర్తిలో శ్రీ కేశవ స్ఫూర్తి మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డా. మోహన్ భాగవత్ సర్ సంఘ్ చాలాక్ (ఆర్.ఎస్.ఎస్ చీఫ్) విచ్చేస్తున్న సందర్భంగా సభ స్థలము, విగ్రహ ప్రతిష్టాపన, బహిరంగ సభ తదితర ప్రదేశాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అన్ని ప్రదేశాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని సభ స్థలంలో పటిష్ట భాగం బందోబస్తు,  కేంద్ర పార మిలటరీ, రాష్ట్రస్థాయి బలగాలు, 6 క్యూఆర్టీ,  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని , ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు కలవకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్ , బోధన్ రూరల్ సీఐ శ్రీ విజయబాబు , రెంజల్ ఎస్సై చంద్రమోహన్ , బోధన్ రూరల్ ఎస్సై మచ్చందర్ రెడ్డి , ఎడపల్లి ఎస్సై రమ, కేశవనంద భారతి ట్రస్ట్ ప్రెసిడెంట్ చామకూరి సుధాకర్ రెడ్డి , ప్రచారక్ శివకుమార్ తెలంగాణ ప్రచారక సహకార, మల్లికార్జున్ కేశవ్ నంద భారతి మెంబర్ సుబోర్ కాకాని తదితరులు పాల్గొన్నారు.

అసత్యపు ఆరోపణలు చేస్తున్న వారిపై పరువునష్టం దావ వేస్తా 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: అసత్యపు ఆరోపణలు చేస్తున్న వారిపై పరువునష్టం దావ వేస్తానని, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి నాపై తప్పుడు కేసు నమోదు చేశారని కార్పొరేటర్ మఠం పవన్ ఆరోపించారు. శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో సేవ చేస్తూ, ఎన్నికలో ప్రజల మద్దతుతో గెలిచానన్నారు. నా గెలుపును ఓర్వలేక కావాలని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అంతే కాకుండా ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ లో తనపై మంగళవారం కేసు నమోదు చేశారన్నారు. 8 వ డివిజన్ ప్రాంతంలో బిల్డర్ రోడ్డును ఆక్రమించుకొని ర్యాంపు నిర్మాణాన్ని చేపట్టడంతో ఈ విషయంపై నగరపాలక సంస్థ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

దీంతో నన్ను అవమానించాలనే ఉద్దేశంతో నాపై తప్పుడు కేసు పెట్టించడం జరిగిందని పవన్ ఆరోపించారు. ఈ తప్పుడు ఫిర్యాదుకు ఐదవ టౌన్ ఎస్ఐ వత్తాసు పలుకుతూ నాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కేసు నమోదు చేశారని కార్పొరేటర్ విమర్శించారు. దీనిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు ఫిర్యాదు చేశానన్నారు.. ఈ అక్రమ కేసు నమోదు వెనుక అధికార పార్టీ నాయకులతోపాటు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మాజీ కార్పొరేటర్, మరొక వ్యక్తి పాత్ర ఉందన్నారు. అక్రమంగా భవనం కడితే నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు.

తాను డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలతో చూపిస్తే దేనికైనా సిద్ధమని, ప్రజల పక్షాన ఉండి సేవ చేస్తే తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. డివిజన్ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి పనులు పూర్తి అయ్యేలా పని చేస్తున్నానని, అబద్ధపు మాటలు చెబుతూ నాపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని అన్నారు.సాక్షాలు ఉంటే చూపించాలని, లేని పక్షంలో వారిపై కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.ఈ సమావేశంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో భాగస్వాములు కావాలి

సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో భేటీలో కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు విస్తృత స్థాయిలో సమాచారం చేరడంలో సామాజిక మాధ్యమాలు ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు కూడా సంక్షేమ పథకాల అమలులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను పురస్కరించుకుని చేపట్టనున్న కార్యక్రమాలను విస్తృత స్థాయిలో ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల సేవలను వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్లు కలిగి ఉన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు ఎంతో ఉత్సాహంతో తరలివచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ మానవీయ కోణంలో, శాస్త్రీయ దృక్పధంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు, సబ్సిడీపై వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ, వడ్డీ లేని రుణాలు, రైతు రుణ మాఫీ, రైతు భరోసా వంటి అనేక పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఇంటర్ వరకు విద్యార్థులకు మద్యాహ్న భోజన పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేయనుందని, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం కూడా అమలు కానుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకునేలా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు తమ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో భాగస్వాములై వాటి విజయవంతానికి తోడ్పాటును అందించాలని కోరారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఉద్దేశించిన అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని తమదైన శైలిలో ప్రజకు చేరవేయాలని, తద్వారా ప్రమాదాల నియంత్రణకు దోహదపడిన వారు అవుతారని అన్నారు. ఈ నెల 13న గ్రామ పంచాయతీల స్థాయిలో జరిగే గ్రామ సభలతో పాటు, 16న జరిగే మండల స్థాయి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక సభలలో పాల్గొని ప్రజలను చైతన్యపర్చాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో భాగస్వాములయ్యే సామాజిక మాధ్యమకర్తలకు జిల్లా యంత్రాంగం తరపున తప్పనిసరిగా తగిన గుర్తింపును అందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, డీఈఓ అశోక్, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డీపీఆర్ఓ పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

పెర్కిట్ మహిళా ప్రాంగణం ఉదంతంపై కలెక్టర్ సీరియస్

*బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: పెర్కిట్ మహిళా ప్రాంగణంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ పి.ఇందిర శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ను కలిసి జరిగిన సంఘటన గురించి తెలియజేశారు. గత మార్చి నెల 02 వ తేదీ నుండి 31వ తేదీ వరకు బ్యూటిషియన్ కోర్సులో బాలికలు, యువతులకు మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కోర్సులో శిక్షణ అందించిన తాత్కాలిక ఇన్ స్ట్రక్టర్ గా కొనసాగిన స్నేహ, బాలికలు, యువతుల ఫోటోలు, ఫోన్ నెంబర్లను సతీష్ అనే వ్యక్తికి పంపించిందని అన్నారు. దీంతో సతీష్ కొంతమంది యువతులకు ఫోన్ లు చేసి, వాట్సప్ చాటింగ్ ల ద్వారా వేధింపులకు గురి చేశాడని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బాధిత యువతులు ఈ విషయాన్ని గురువారం రోజున తమ దృష్టికి తేగా, పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించామని తెలిపారు. ఈ ఉదంతంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులైన వారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. పెర్కిట్ మహిళా ప్రాంగణంలో శిక్షణ పొందిన యువతులను వేధించిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ తరహా ఘటనలు జిల్లాలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని అన్నారు.