చిత్రం న్యూస్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో బాజీరావ్ మహారాజ్, సద్గురు శ్రీ శబరి మాత ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో పూజలు నిర్వహించి గ్రామవీధుల గుండా పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పాల్గొని పల్లకీ మోశారు. గ్రామస్తులతో కలసి నృత్యం చేసి చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రియాంక, గ్రామపెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఆలమూరు మండలంలో రహదారుల మరమ్మతులకు రూ.1.10కోట్ల నిధులు మంజూరు
*కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
చిత్రం న్యూస్, కొత్తపేట: ఆలమూరు మండలంలో పలు రహదారుల మరమ్మతులకు రూ.1.10 కోట్ల ఆర్ అండ్ బీ నిధులు మంజూరు అయ్యాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు .జొన్నాడ నుంచి మండపేట ప్రధాన రహదారికి సంబంధించి కొత్తూరు సెంటర్ నుంచి గుమ్మిలేరు వరకూ మరమ్మతుల నిమిత్తం రూ.80 లక్షలు, చింతలూరు నుంచి సూర్యారావుపేట వరకూ రహదారి మరమ్మతుల కొరకు రూ.30లక్షలు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలుపెడతామని ఆయన పేర్కొన్నారు.
బేలలో వృద్ధురాలి మృతి..నకిలీ ఆర్ఎంపీ అరెస్ట్
_అర్హతలేని వైద్యులపై కఠిన చర్యలు..జైనథ్ సీఐ జి శ్రావణ్ కుమార్
చిత్రం న్యూస్, బేల: అర్హత లేకుండా RMP డాక్టర్గా చలామణి అవుతూ.. హైడోస్ ఇంజక్షన్లు ఇచ్చిన కారణంగా వృద్ధ మహిళ మృతి చెందిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేశామని జైనథ్ సీఐ జి. శ్రావణ్ కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. బేల మండలం ఇందిరానగర్కు చెందిన ఉర్వతే శాంతాబాయి (65) అనే వృద్ధ మహిళకు ఛాతి నొప్పి, తల తిరుగుడు ఉందని చెప్పగా అర్హత లేకున్నప్పటికీ నకిలీ rmp లక్ష్మణ్ అనే వ్యక్తి ఆమెకు ఇంజక్షన్లు గోలీలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఆమె అస్వస్థతకు గురై కింద పడిపోవడం108 అంబులెన్స్ ద్వారా అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై నమోదైన Cr. No. 230/2025 U/Sec 105 BNS of PS Bela కేసులో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు అర్హత లేకుండా గత 15 ఏళ్లుగా RMP డాక్టర్గా చలామణి అవుతూ అమాయక ప్రజలకు హైడోస్ ఇంజక్షన్లు ఇస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. విచారణలో నిందితుడి వద్ద నుండి ఉపయోగించిన సిరంజీలు, ఇంజక్షన్లు, గోలీలను స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించామన్నారు. గతంలో కూడా ఇతనిపై ఇలాంటి కేసులు నమోదు అయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన జైనథ్ సీఐ శ్రావణ్, బేల పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆభినందించారు.
ప్రజలకు పోలీసుల సూచన: ప్రజలు తమ ఆరోగ్య సమస్యల విషయంలో తప్పనిసరిగా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన అర్హత కలిగిన వైద్యుల వద్ద మాత్రమే చికిత్స పొందాలని, అర్హతలు లేని వ్యక్తుల వద్ద ఇంజక్షన్లు, మందులు తీసుకోవద్దని పోలీస్ శాఖ సూచిస్తోంది. అనధికార వైద్య చర్యలు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అక్రమ వైద్య చర్యలకు పాల్పడుతున్నవారిని, అర్హతలేని వైద్యులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
వేడుకగా బాజీరావుబాబా పల్లకీ ఊరేగింపు
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పాఠన్ లో వారం రోజుల కొనసాగుతున్న సంత్ బాజీరావు మహారాజ్ సప్తాహ వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో ముగిశాయి.. చివరి రోజు పల్లకీతో ఊరేగింపు నిర్వహించగా ఇంటింటా భక్తులు పూజలు నిర్వహించారు. మాజీమంత్రి జోగు రామన్న హాజరై మహారాజ్ చిత్రపటానికి పూజలు నిర్వహించారు.. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మనోహర్, భారాస నాయకులు గంభీర్ ఠాక్రే, ప్రమోద్ రెడ్డి, సతీష్ పవార్, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఎస్బీఐ ప్రమాద బీమా పథకం కింద రూ.20 లక్షలు అందజేత
చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పాటన్ గ్రామానికి చెందిన బోయర్ ఆకాష్ అనే వ్యక్తి 6 నెలల క్రితం యాక్సిడెంట్ లో మృతిచెందారు. ఆయన ఇదివరకే టీజీబీ ఎస్బీఐ చప్రాల బ్రాంచ్ లో జనరల్ ఇన్సూరెన్స్ చేసుకొని ఉన్నారు. ప్రమాద బీమా పథకంలో భాగంగా అతని కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల చెక్కును టీజీబీ చప్రాల బ్రాంచ్ మేనేజర్ శివ కుమార్ అందజేశారు. గ్రామ సభ్యుల సమక్షంలో నామిని అయినా ఆయన తల్లి బోయర్ సక్కుబాయికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాటన్ సర్పంచ్ గేడాం గులాబ్, బేల సీఎఫ్ఎల్ కౌన్సిలర్ అజయ్, వినోద్, అనికేత్ తదితరులు ఉన్నారు.
కడెం మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సంపత్ రెడ్డి
చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడితో పాటు మండల కమిటీని ఉప సర్పంచ్లు ఎన్నుకున్నారు. బుధవారం కడెం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ సమావేశంలో కొండుకూర్ గ్రామ ఉప సర్పంచ్ పొద్దుటూరి సంపత్ రెడ్డిని కడెం మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షురాలిగా లింగాపూర్ గ్రామ ఉప సర్పంచ్ కమ్మల లక్ష్మిని, గౌరవ అధ్యక్షురాలిగా నాగవత్ సరితను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శులుగా మద్దిపడగ గ్రామ ఉప సర్పంచ్ బండారి జనార్దన్, పాండవపూర్ గ్రామ ఉప సర్పంచ్ గొర్రె మధుకర్లను, కార్యదర్శిగా ఎలగడప గ్రామ ఉప సర్పంచ్ రాపర్తి శ్రీనివాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో మొత్తం 29 మంది ఉప సర్పంచ్లు ఉండగా, ఈ సమావేశానికి 25 మంది హాజరయ్యారు. మిగతా ఉప సర్పంచ్లు పలు కారణాల వల్ల సమావేశానికి హాజరు కాలేకపోయారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సంపత్ రెడ్డి, కమిటీ సభ్యులకు మెజారిటీ ఉప సర్పంచ్లు శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన సంపత్ రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్న మండలంలోని అన్ని గ్రామాల ఉప సర్పంచ్లకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఉప సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.
యూరియా బస్తాల కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో యూరియా బస్తాల కోసం రైతులు రోడ్డెకారు. ఆందోళన చేపట్టారు. మండలంలోని పెద్దూర్, ధర్మాజీపేట్, మద్దిపడగా, చిట్యాల, పాండ్వాపూర్, బిల్లాల్, కొండుకూర్, కన్నాపూర్ రైతులంతా కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..ఎకరానికి ఒక బస్తా కూడా ఇవ్వడం లేదని.. ఎప్పుడు వచ్చినా సర్వర్ ప్రాబ్లం అని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి యూరియా బస్తాలు అందజేయాలని రైతులు కోరుతున్నారు.
సాంగిడిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..సర్పంచ్ మంచాల భూపతి రెడ్డి
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ నియోజకవర్గం బేల మండలం సాంగిడి గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకొని, నూతనంగా బాధ్యతలు స్వీకరించబోయే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువా కప్పి సత్కరించారు. ప్రత్యేక అధికారి మనోహర్ రావు, గ్రామ కార్యదర్శి వేణుగోపాల్ రావు సమక్షంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంచాల భూపతిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు కీలక పాత్ర పోషిస్తారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక పాలన, సమగ్ర గ్రామాభివృద్ధి దిశగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం హయాంలో గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాయని, అదే స్పూర్తితో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా సమష్టి కృషితో ముందుకు వెళతామన్నారు. ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
కొలువుదీరిన పెద్దూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం
చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూర్ కడెం పంచాయతీ పాలకవర్గం కొలువుదీరింది. గ్రామ సర్పంచ్గా దీకొండ విజయ్ కుమార్, ఉప సర్పంచ్గా పిట్టల రాజన్న, వార్డు సభ్యులు గూగులవత్ మౌనిక, అపావత్ రాజేష్, కత్తెరపాక రాజశేఖర్, ఎస్కే నయిమా బేగం, ఎస్.కె నయీమ్, గట్ల స్వరూప, అట్ల సరోజ, గొల్ల లావణ్య, ఎంఏ సాహిస్తా, పర్వీన్, ఎండి జుబేర్ ఖాన్, అత్రం శ్రీనివాస్లతో ఎంపీఓ టి. శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం పాలక వర్గ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు అందరి సహకారంతో గ్రామం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పంచాయతీ సెక్రెటరీ ఎండి మునురుల్ హాసన్ పాల్గొన్నారు.
జైనథ్ లో మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
450 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు కళ్ళెం జీవిత వెంకట్ రెడ్డి దంపతులు
చిత్రం న్యూస్, జైనథ్: కళ్ళెం భూమా రెడ్డి హాస్పిటల్, వికాస తరంగిణి (చిన్నజీయర్ స్వామి వారి బృందం) సౌజన్యంతో గ్రామ సర్పంచ్ గడ్డం మమత జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో జైనథ్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో సుమారు 450 మంది గ్రామస్తులు పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందారు. వైద్యులు జీవిత వెంకటరెడ్డి దంపతులు గ్రామస్తులకు బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఈసీజీ పరీక్షలతో పాటు ఇతర సాధారణ పరీక్షలు చేపట్టారు. మహిళలకు బ్రెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలు, గర్భిణులకు పరీక్షలు నిర్వహించారు. మందులను ఉచితంగా అందజేశారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ గడ్డం మమత జగదీష్ రెడ్డి దంపతులను, ఉప సర్పంచ్ సంతోష్ , వార్డు సభ్యులను, వికాస తరంగిణి సభ్యులు రాజేశ్వర్ రావు, హన్మంత్ రావు లను వైద్యులు కళ్ళెం జీవిత వెంకట్ రెడ్డి దంపతులు సన్మానించారు. జైనథ్ ఆలయ చైర్మన్ రుకేష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ అశోక్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గడ్డం మమత జగదీష్ రెడ్డి, వార్డు సభ్యులు కలిసి కళ్ళెం జీవిత వెంకట్ రెడ్డి దంపతులను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి చిత్ర పటాన్ని అందజేశారు. అంతకుముందు చినజీయరు స్వామి చిత్ర పటానికి పూజలు నిర్వహించారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. కళ్ళెం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.










