వికసిత్ కృషి సంకల్ప అభియాన్
వ్యవసాయ ,ఉద్యాన పంటలపై అవగాహన కార్యక్రమం
చిత్రం న్యూస్, ఓదెల:
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని నాంసానిపల్లి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరి ఖిల్లా శాస్త్రవేత్తలు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా వానాకాలంలో వేసుకోవలసిన వ్యవసాయ ఉద్యాన పంటలపై అవగాహన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమము జూన్ 12వ తారీకు వరకు వివిధ మండలాల్లోని గ్రామాల్లో జరుగుతున్నందున రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని రానున్న వానాకాలంలో వేస్తున్న పంటలపై అవగాహన పెంచుకోవాలని శాస్త్రవేత్తలను అడిగి వారి సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్. బి. భాస్కరరావు మాట్లాడుతూ.. రైతు సోదరులు ప్రతి సంవత్సరం ఏక పంటగా వరి, పత్తి పంటలను సాగు చేస్తున్నారు. ఒకే పంటను సాగు చేయడం వలన చీడపీడల వలన గాని, వాతావరణంలోని మార్పుల వలన గాని, మార్కెట్లో సరైన ధర లభించకపోవడం వలన రైతు మొత్తం గా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. రైతులు సమగ్ర పంట ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. దీనిలో భాగంగా వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్లు, పూల పంటలను కూడా సాగు చేసుకుని అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని ఆ పంటల సాగులో మెలకువలను వివరించారు. తదనంతరం నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ నుంచి వచ్చిన శాస్త్రవేత్త డాక్టర్. యోగేష్ మాట్లాడుతూ.. వ్యవసాయం తో పాటు పాడి పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకలను కూడా పెంచుకొని అధిక ఆదాయం పొందవచ్చని వాటి మెలకువలను వివరించారు. ఉద్యాన అధికారి మహేష్ మాట్లాడుతూ.. ఉద్యాన పంటల్లో అమలవుతున్న వివిధ రకాల సబ్సిడీలు, ఆయిల్ పంట సాగు గురించి వివరించారు. వ్యవసాయ విస్తరణ అధికారిని సంధ్య వ్యవసాయ పంటలలో అమలవుతున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో విలేజ్ సెక్రటరీ శంకర్ రైతు సోదరులు, మహిళా రైతులు పాల్గొన్నారు.