హనుమంతుడి సింధూర కథ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్:
హనుమంతుడి ఆలయాల్లో స్వామికి సింధూరాన్ని అలంకరించడం, భక్తులు దాన్నే బొట్టుగా పెట్టుకోవడం చూస్తుంటాం. మారుతికి సింధూరాన్ని అర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయనే నమ్మకమూ ఉంది. సూటిగా చెప్పాలంటే ఒక్క హనుమాన్ ఆలయాల్లోనే కాషాయ రంగు సింధూరం కనిపిస్తుంది. అసలు, స్వామికి కుంకుమ బదులు సింధూరాన్ని అర్పించడం వెనుక చిన్న కథే ఉంది. హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనానికి చేరుకున్నప్పుడు… వెంటనే సీతమ్మ దగ్గరకు వెళ్లలేదట. కాసేపు అమ్మవారిని గమనించాడట. ఆ సమయంలో ఆమె పాపిటలోని సింధూరాన్ని చూశాడట. ఆ తర్వాత సీతాదేవి చెంతకు వెళ్లినప్పుడు సింధూర ధారణకు కారణాన్ని అడిగి తెలుసుకున్నాడట. అప్పుడు సీతాదేవి… శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమనీ, స్వామి దీర్ఘాయుష్షు కోసం తాను ధరిస్తున్నాననీ వివరించిందట. కాస్త సింధూ రాన్ని ధరించినందుకే దీర్ఘాయుష్షు వస్తే, తాను కనుక శరీరమంతా లేపనంలా రాసుకుంటే రాముడికి ఎలాంటి సమస్య ఉండదని భావించాడట హనుమంతుడు. అదే సమయంలో స్వామి ప్రేమను ఇంకాస్త ఎక్కువగా పొందవచ్చనే ఉద్దేశంతోనూ తన ఒళ్లంతా సింధూరాన్ని రాసుకోవడం మొదలుపెట్టాడట. ఇదీ, సీతాశోక నివారకుడి సింధూర పూజ కథ.