జైనథ్లో భక్తిశ్రద్ధలతో ‘శ్రీరామకోటి లిఖిత మహాయజ్ఞం’
చిత్రం న్యూస్, జైనథ్: ధర్మ ప్రచారంలో భాగంగా ‘శ్రీరామకోటి లిఖిత మహాయజ్ఞం’ కార్యక్రమం జైనథ్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు . ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన ఏ.ఎం. ఉమాశంకర్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం జైనథ్లోని చారిత్రాత్మక లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమాశంకర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ రామనామాన్ని చేరవేయడమే ఈ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి గ్రామానికి వెళ్తూ గ్రామస్తులతో చర్చిస్తూ, వారిని ఈ రామకోటి లిఖిత యజ్ఞంలో సభ్యులుగా చేరుస్తున్నట్లు వివరించారు. రామనామ జపంతో పాటు దానిని లిఖితపూర్వకంగా రాయడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి లింగారెడ్డి, దేవన్న, పిడుగు స్వామి యాదవ్, నిపుంగే దివ్య గంగమణి, గట్టు దేవకి, లక్ష్మీనారాయణ స్వామి సేవకులు, గ్రామ సభ్యులు, భక్తులు పాల్గొని రామ కార్యంలో తాము కూడా భాగస్వాములమవుతామని ఉత్సాహంగా ముందుకు వచ్చారు.




