బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు
చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలం కరంజి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులు, యువతకు బాల్య వివాహాలు మరియు సైబర్ ఫ్రాడ్ (సైబర్ నేరాలు) పట్ల అవగాహన సదస్సును సర్పంచ్ శైలజ పొచ్చన్న, ఉప సర్పంచ్ ఏనుగు సూర్య ప్రకాష్ రెడ్డి, అంగన్వాడీ టీచర్ సంగీత నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, వారి ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
అనంతరం, ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయకపోవడం, వ్యక్తిగత వివరాలను పంచుకోకూడదని విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే ‘1930’ టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్శింగ్, ఆశ వర్కర్ బోజమ్మ, అంగన్వాడీ సిబ్బంది భూమక్క, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

