ఆదిలాబాద్ ప్రజల కోసం ‘ప్రజా దర్బార్’.. సమస్యల పరిష్కారానికి కంది శ్రీనివాస్ రెడ్డి భరోసా
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పట్టణంలోని ప్రజా సేవా భవన్లో గురువారం అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్ కూడా పాల్గొని, ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించడమే కాకుండా వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతుల నమోదు కోసం ప్రత్యేకంగా ఒక డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీని ద్వారా సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయని ఆయన పేర్కొన్నారు.
మున్సిపల్ చైర్ పర్సన్ అనూష సతీష్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తుండటం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ప్రతి వారం ఇలా ప్రజా దర్బార్ నిర్వహించి, క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడం అభినందనీయమని ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.




