వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలో వరుస దొంగతనాలు, మొబైల్ స్నాచింగ్లకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న సయ్యద్ నవీద్ అలీ (అలియాస్ బడా ముష్రఫ్) పై ఆదిలాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. నిందితుడిపై ఇప్పటివరకు మొత్తం 23 కేసులు నమోదయ్యాయి. ఇందులో 20 దొంగతనం కేసులు కాగా, 3 గంజాయి స్మగ్లింగ్కు సంబంధించిన కేసులు ఉన్నాయి. గతంలో జైలు శిక్ష అనుభవించినప్పటికీ, నవీద్ అలీ తన ప్రవర్తన మార్చుకోలేదు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు. నిందితుడు జైలు నుండి విడుదలైన ప్రతిసారీ మళ్ళీ నేరాలకు పాల్పడుతుండటంతో, ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

