చిత్రం న్యూస్, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన ‘జాయింట్ యూజర్ ఎయిర్పోర్ట్’ (Joint User Airport) ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ విమానాశ్రయ అభివృద్ధి కోసం సేకరించాల్సిన భూమికి సంబంధించి కొన్ని కఠినమైన భూసేకరణ నిబంధనల నుండి మినహాయింపునిస్తూ రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ (విమానాశ్రయాలు) జీవో విడుదల చేసింది.
జీవో ముఖ్యాంశాలు: ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No. 17 (తేదీ: 02-04-2026) ప్రకారం ప్రధాన అంశాలు ఇవే:
సేకరించే భూమి: ఆదిలాబాద్ (అర్బన్ & రూరల్) పరిధిలోని ఖానాపూర్, అనుకుంట, నిషాన్ ఘాట్ గ్రామాల్లోని సుమారు 430.30 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్ కోసం సేకరించనున్నారు.
చట్టపరమైన మినహాయింపు: ‘భూసేకరణలో పారదర్శకత, సరైన పరిహారం మరియు పునరావాస చట్టం – 2013′ (RFCTLAR&R Act, 2013) లోని చాప్టర్ II మరియు III నిబంధనల నుండి ఈ ప్రాజెక్టుకు మినహాయింపు ఇచ్చారు.
కారణం: ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, తెలంగాణ సవరణ చట్టం 2016లోని సెక్షన్ 10(A) ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయ అవసరాల కోసం కనీస భూమిని మాత్రమే సేకరిస్తున్నట్లు ప్రభుత్వం ధృవీకరించింది.
తదుపరి చర్యలు: ఈ ఉత్తర్వులను తెలంగాణ గెజిట్ అసాధారణ సంచికలో ప్రచురించాలని పౌర సరఫరాలు, ముద్రణ శాఖ కమిషనర్ను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నిర్ణయంతో ఆదిలాబాద్ జిల్లాలో విమాన ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి కూడా బాటలు పడనున్నాయి.


