చిత్రం న్యూస్, వరంగల్ : వరంగల్ లో మరో మిర్చి వ్యాపారి బోర్డు తిప్పేశాడు. భారీ మొత్తంలో బాకీ పడిన వారికి పంగనామాలు పెట్టాడు. జిల్లాలోని ఓ వ్యవసాయ మార్కెట్ కు చెందిన వ్యాపారి రూ.5కోట్లకు ఎగనామం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు వ్యాపారి మొత్తానికి ఐపీ పెట్టినట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఆ మొత్తం ఎవరికి ఇవ్వాలి? ఎంతమందికి ఇవ్వాలనే విషయం గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే.. ఏనుమాముల మార్కెట్లో ఓ ట్రేడర్స్ పేరిట ఓ వ్యాపారి లావాదేవీలు నిర్వహించేవాడు. అయితే, వారం రోజులుగా ఆయన మార్కెట్ కు రావడం లేదు. అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. ఈ క్రమంలో ఆయన డబ్బు రూపేనా సంబంధాలు ఉన్న కొందరు వ్యాపారులు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆ వ్యక్తి బోర్డు తిప్పేసి ఉడాయించి ఉంటాడని అనుమానిస్తున్నారు. సుమారు రూ.5కోట్ల మేర బాకీలపై కోర్టులో ఐపీ పెట్టి ఉంటాడని భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. ఆయన ఎవరెవరిపై ఐపీ పెట్టి ఉంటాడో వారికి నోటీసులు అందితే గానీ అసలు నిజం బయటకు రాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు, చాంబర్ ప్రతినిధులు ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా..విషయం మాత్రం దావానలంలా వ్యాపార వర్గాల్లో వ్యాపించింది. బాధితుల్లో ఇప్పటికే ఆందోళన నెలకొనగా వ్యాపారుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఒకటీ, రెండు రోజుల్లో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే, ఈ బాకీల్లో రైతులు ఉన్నారా? కేవలం వ్యాపారులేనా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఒకవేళ రైతులు ఉంటే.. వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాంటి సంఘటనలు జరగకముందే అధికారులు ఈ విషయంపై దృష్టిసారించి రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అయితే ఈ వ్యాపారి ఐదేళ్ల క్రితం జమ్మికుంటలో కూడా మోసం చేసి ఐపీ పెట్టీ ఉడాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడినుండి వరంగల్ కు వచ్చిన అతను ఓ ట్రేడర్స్ తో వ్యాపారం కొనసాగించాడు. అడ్తీ వ్యాపారులను మచ్చిగ చేసుకున్నాడు. అడ్తీ దారుల వద్ద భారీగా మిర్చిని కొనుగోలు చేసి ఇక్కడే అమ్ముకొని సొమ్ము చేసుకొని పక్క ప్లాన్ తో పారిపోయినట్లు తెలుస్తోంది.


