చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ఆహ్లాదక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. బాసర ఆలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రానున్నందున, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ఆయన సమీక్షించారు.
ముందుగా పలు నిర్మాణాలు చేపట్టబోయే ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పలు నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపనలు చేసే ప్రాంతాలను చూశారు. పనుల ప్రారంభోత్సవాల ఏర్పాటుకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఆలయంలో ముఖ్యమంత్రి నిర్వహించే పూజలకు సంబంధించి వివరాలను చర్చించారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. బాసర ఆలయానికి దేశవ్యాప్తంగా ఎంతో చారిత్రాత్మక ప్రశస్తి ఉందని, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి బాసర పర్యటన సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని వివరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సకల వసతులను కల్పిస్తామని పేర్కొన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అన్నారు.
రానున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి బాసరలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పుష్కర ఘాట్ మరమ్మత్తు, నూతన పుష్కర ఘాట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణ పనులను ప్రారంభించాలని అన్నారు. జిల్లాలో పుష్కరాల నిర్వహణకు సంబంధించి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు స్వయంగా సమీక్షిస్తానని వివరించారు.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని అన్నారు. ఆయా శాఖలకు సంబంధించి అధికారులు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై సంబంధిత ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే రానున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి బాసరలో అవసరమైన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, తహసీల్దార్ పవన్ చంద్ర, వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


